Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- చిట్ ఫండ్ బిల్లుకు సవరణలు
- బ్యాంకుల్లో స్కామ్ల వేళ..సర్కారు కొత్త పాట
- చిట్ఫండ్ రంగం బలోపేతానికేనని వివరణ...
'ముసాయిదా'కు ఆమోదం తెలిపిన మంత్రివర్గం
- ప్రభుత్వ బ్యాంకుల పటిష్టత గాలికి వదిలి..
- చిట్ఫండ్లపై ఆసక్తి ఎందుకు:నిపుణులు
- పెద్దగా ఒరిగేదేమీ లేదు : చిట్ఫండ్ సంఘం
నవతెలంగాణ, వాణిజ్య విభాగం: దేశంలోని ప్రభుత్వ రంగ బ్యాంకుల్లో (పీఎస్బీ) ప్రజల సొమ్ముకు భద్రత లోపిస్తున్న వేళ.. చిట్ఫండ్ రంగాన్ని వెలుగులోకి తెచ్చే దిశగా కేంద్ర ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. 1982లో అమలులోకి వచ్చిన చిట్ఫండ్ చట్టానికి సవరణలతో రూపొందించిన ముసాయిదా బిల్లుకు కేంద్ర క్యాబినెట్ మంగళవారం ఆమోదం తెలిపింది. దేశంలో చిట్ఫండ్ రంగం ఎదుర్కొంటున్న పలు వ్యవస్థాపరమైన అవరోధాలను దూరం చేస్తూనే.. ఆ రంగం ఒక క్రమపద్ధతిలో ఎదిగేందుకు గాను తాము ఈ సంస్కరణలను ముందుకు తీసుకువచ్చినట్టుగా సర్కారు వెల్లడించింది. అయితే దీని వెనుక అసలు మతలబు మరోకటి కనిపిస్తోందని ఆర్థిక సేవల రంగ నిపుణులు చెబుతున్నారు. పీఎస్బీలు విఫలమవుతున్న వేళ.. ప్రజలకు చిట్ఫండ్ రంగం భద్రమైందన్న భావన కల్పిస్తూనే.. అత్యది óకంగా ప్రజల సొమ్మును కార్పొరేట్లు, ప్రయివేటు వ్యక్తుల చేతులకు చిట్ఫండ్ల రూపంలో మళ్లించాలన్నది ఇందులో అసలు వ్యూహంగా కనిపిస్తోందని వారంటున్నారు. దీని వల్ల రానున్న రోజుల్లో సామన్యులు చిట్ఫండ్లలో కోట్లాది రూపాయలను కోల్పోయే అవకాశం ఉందని వారు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.
బ్యాంకులకే దిక్కులేదు.. చిట్ఫండ్లెంత భద్రం..
కఠినమైన అకౌటింగ్ విధానాలు, పటిష్టమైన ఆడిటింగ్తో పాటు ఆర్బీఐ నిరంతర నిఘా ఉన్న ప్రభుత్వ బ్యాంకుల్లోనే రోజుకో కొత్త స్కామ్ వెలుగులోకి వస్తుంటే.. నామమాత్రపు నియంత్రణ, అంతంత మాత్రపు నిఘా ఉండే చిట్ఫండ్ల వైపు ప్రజల దృష్టి మళ్లేలా సర్కారు అడుగులు వేయడం ఎంత వరకు సబబు అన్ని నిపుణులు ప్రశ్నిస్తున్నారు. దీనివల్ల రానున్న రోజుల్లో చిట్ఫండ్ రంగంలో కార్పొరేట్ చీటింగ్లు, కొత్త తరహా స్కామ్లు పెరిగిపోయి.. వందల కోట్ల రూపాయల మోసాలు వెలుగులోకి వచ్చే అవకాశం ఉందని వారు అభిప్రాయపడుతున్నారు. ఇదే జరిగితే మరోమారు సామాన్య జనాలు కొత్త మోసంలో ఇరుక్కొని చేతి చమురు వదిలించుకోక తప్పదని వారు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. కొన్ని సంవత్సరాలుగా ప్రజల విశ్వాసాన్ని పొందుతూ వస్తోన్న ప్రభుత్వ బ్యాంకుల్లో స్కాములు వెలుగు చూస్తున్న నేపథ్యంలో.. సర్కారు వాటిని నివారించేందుకు ఎలాంటి సత్వర కఠిన చర్యలు తీసుకోకపోగా.. అటువైపు కనీసం ఆలోచించకపోవడం ఆశ్చర్యాన్ని కలిగిస్తోంది. జరుగుతున్న నష్టాన్ని వదిలి.. భవిష్యత్తులో మరిన్ని మోసాలకు ఆస్కారం ఇచ్చేలా చిట్ఫండ్లను తెరపైకి తేవడం తీవ్ర విమర్శలకు తావిస్తోంది.
దేశ వ్యాప్తంగా 30,000 చిట్ఫండ్స్..
అందుబాటులో ఉన్న సమాచారం మేరకు ప్రభుత్వ రికార్డుల్లో నమోదైన చిట్ ఫండ్ సంస్థలు దాదాపు 30,000 ఉన్నాయి.రికార్డుల్లో నమోదు కాకుండానే చిట్ఫండ్ వ్యాపారాలు నిర్వహిస్తున్న వారు దేశ వ్యాప్తంగా దాదాపు 3 లక్షలకు పైమాటే.. కొన్ని భారీ మోసాల నేపథ్యంలో అప్పటి ప్రభుత్వాల నియంత్రణల నేపథ్యంలో దాదాపు కొన్ని సంవత్సరాలుగా ఈ సంఖ్యలో పెద్దగా వృద్ధి నమోదు కావడం లేదు. ఈ రంగంలోని లావాదేవీల విలువ రూ.5000 కోట్ల పైమాటేనని రికార్డులు చెబుతున్నాయి. ఈ నేపథ్యంలో చిట్ఫండ్ రంగాన్ని బలోపేతం చేసేందుకు తాము సవరణలు చేపట్టినట్టుగా సర్కారు చెబుతోంది. అయితే ఈ సంస్కరణ పట్ల దేశ వ్యాప్తంగా విమర్శలు వస్తున్నాయి. సామాన్యులతో పాటు చిట్ఫండ్ రంగంలోని వారు కూడా సవరణల బిల్లు తమకు ఏ మాత్రం ఉపయుక్తం కాదని అసంతృప్తి వ్యక్తం చేసున్నారు.
మాకూ.. ప్రయోజనకరంగా లేదు!
ప్రభుత్వ చిట్ఫండ్ చట్టానికి ప్రతిపాదించి సవరణలు తమకూ ప్రయోజనకరం కాదని 'అఖిల భారత చిట్ఫండ్స్ అసోసియేషన్' ప్రధాన కార్యదర్శి టి.ఎస్.శివరామకృష్ణ తెలిపారు. మొత్తంగా చూస్తూ అసంఘటిత రంగంలోని చిట్ ఫండ్ సంస్థలను సంఘటిత రంగంలోకి తీసుకు రావడం ఒక్కటే ఈ సవరణల్లో ప్రజలకు తమకు మేలు చేసే విషయంగా కనిపిస్తోందని ఆయన అన్నారు. దీనికి తోడు చిట్ఫండ్లో చిట్ వేసిన వారికి భద్రత కలిగేలా బీమా విధానాన్ని బిల్లులో పెట్టాల్సిందిగా తాము ప్రభుత్వాన్ని కోరుతూ వచ్చామని... అయితే ఆ అంశాన్ని సర్కారు పట్టించుకోలేదని ఆయన అసంతృప్తి వ్యక్తం చేశారు. దీనికి తోడు చిట్ రంగం మేలు కోసం చిట్ఫండ్ చట్టంలోని సెక్షన్ 20 (1) నుంచి 50 మేరకు ఉన్న నిబంధనల మేరకు రిజిస్ట్రార్ల వద్ద డిపాజిట్ చేయాల్సిన సెక్యూరిటీ సొమ్ము మొత్తాన్ని తగ్గించాలని తాము సర్కారును కోరినప్పటికీ పట్టించుకోలేదని ఆయన విస్మయం వ్యక్తం చేశారు. సర్కారు సవరణలతో చిట్ఫండ్ రంగంలో కీలక మార్పులేమి రాబోవని ఆయన అన్నారు.