Authorization
Mon Jan 19, 2015 06:51 pm
ముంబయి : మహారాష్ట్రలో రైతుల పాదయాత్రలో వేలాది మంది పాలొన్నారు. ఆరు రోజుల పాటు 200 కిలోమీటర్ల దూరం యాత్ర సాగింది. కానీ, రైతుల ఆందోళన కారణంగా ఏ ఒక్క వ్యక్తి కూడా ఇబ్బంది పడలేదంటే వారి క్రమశిక్షణ ఏపాటిదో అర్థమవుతున్నది. రోజువారీ విధులకు వెళ్లే ఉద్యోగులు, కార్మికులకు ఆటంకం కల్గకుండా ప్రత్యేక చర్యలు తీసుకున్నది ఏఐకేఎస్. ప్రధాన రహదారులపై వెళ్తే ట్రాఫిక్కు అంతరాయం కలుగుతుందన్న ఉద్దేశంతో ఎక్కువ శాతం వీధుల గుండానే పాదయాత్ర సాగించింది. మెయిన్ రోడ్లపైకి వచ్చినప్పుడల్లా వాహనదారులకు ఇక్కట్లు తలెత్తకుండా జాగ్రత్త తీసుకున్నారు. పదుల మంది ఆందోళన చేస్తేనే ట్రాఫిక్ భారీగా నిలిచిపోయే అవకాశమున్న తరుణంలో 50 వేల మంది రైతులు రోడ్డెక్కితే ఎలాంటి ఇబ్బందులూ తలెత్తకపోవడం పట్ల ఒక్క మహారాష్ట్రనే కాదు.. యావత్తు భారతదేశ ప్రజలను ఆలోచనలో పడేసింది.
విద్యార్థుల భవిష్యత్ను దృష్టిలో పెట్టుకున్న గొప్ప మనస్సు
పాదయాత్ర చేపట్టిన రైతుల్లో ఎక్కువ మంది పెద్దగా చదువుకొని ఉండకపోవచ్చు.. కానీ, తాము చేస్తున్న ఆందోళనలో విద్యార్థులకూ ఇబ్బందులు తలెత్తకూడదని ఆలోచించారంటే వారిని ప్రతి ఒక్కరూ అభినందించి తీరాల్సిందే. మహారాష్ట్రలో పదో తరగతి పరీక్షలు జరుగుతున్నాయి. ముంబయిలో పగలు యాత్ర చేపడితే..పరీక్షలకు వెళ్లే విద్యార్థులు ఇబ్బంది పడతారేమోనని రాత్రి వేళ నడక సాగించారు. ఈ క్రమంలోనే ఆదివారం రాత్రంతా నడిచి సోమవారం తెల్లవారుజామున ముంబయిలోని ఆజాద్ మైదాన్కు చేరుకున్నారు. అనంతరం లాంగ్ మార్చ్ కొనసాగిస్తే కొన్ని గంటల్లో అసెంబ్లీకి చేరుకునే వారు. కానీ, విద్యార్థుల భవిష్యత్ను పాదయాత్ర నిర్వాహకులు, రైతులు ఆలోచించారు. ఉదయం 11 తర్వాత ర్యాలీ తీస్తే విద్యార్థులు ఎలాంటి ఇబ్బందీ ఉండదని భావించారు.
యువకులు, మహిళలు, వృద్ధులన్న తేడా లేదు
పాదయాత్ర అంటేనే ఎక్కువ ప్రయాసతో కూడుకున్నది. అది రెండు మూడు కిలోమీటర్లు కాదు.. 180 కిలోమీటర్లు.. యాత్రలో యువ రైతులే కాదు.. మహిళలు, వృద్ధ రైతులూ పాల్గొన్నారు. దీన్ని బట్టి రాష్ట్రంలో అన్నదాతల దయనీయ పరిస్థితులు అర్థమవుతున్నాయి. ఎక్కడా వెనుకడుగు వేయకుండా అందరితో పాటు వీరు యాత్ర కొనసాగించారు. పంట చేలల్లో గడపాల్సిన మమ్మల్ని ఫడ్నవీస్ సర్కారు రోడ్లపైకి తెచ్చిందంటూ రైతులు ఆవేదన వ్యక్తం చేశారు.
ఎర్రపూల వనాన్ని తలపించిన ఆజాద్ మైదాన్
వేలాదిమంది రైతులతో ముంబయిలోని ఆజాద్ మైదానం ఎర్రపూల వనాన్ని తలపించింది. కార్పొరేట్ మీడియా సంస్థలు రైతుల పాతయాత్ర పట్ల ఉద్దేశపూర్వకంగానే కొంత నిర్లక్ష్యంతో వ్యవహరించగా, నగర ప్రజల నుంచి లభించిన గట్టి మద్దతు, సానుభూతి రాజకీయ పరిశీలకుల్ని సైతం ఆశ్చర్యపరిచింది. రైతుల పాదయాత్రలో కొన్నివేలమంది మాత్రమే పాల్గొంటున్నారంటూ మొదట తప్పుడు ప్రచారం సాగించినవారు కూడా ఆ తర్వాత నాలుక్కరుచుకున్నారు. 50 వేలమందికిపైగా పాదయాత్రలో పాల్గొన్నారంటూ లెక్కలు సరిదిద్దుకున్నారు.
అన్నం పెట్టే రైతే అలసి వస్తే..సేద తీర్చిన ముంబయి ప్రజలు
ముంబయి: ఆల్ ఇండియా కిసాన్ సభ(ఏఐకేఎస్) చేపట్టిన కిసాన్ లాంగ్ మార్చ్్(మహా పాదయాత్ర)కి ముంబయి నగర ప్రజల నుంచి అనూహ్య మద్దతు లభించింది. 180 కి.మీ. సుదీర్ఘ పాదయాత్ర అనంతరం ముంబయి చేరుకున్న రైతులకు పలు వర్గాల ప్రజలు ఘనస్వాగతం పలికారు. మండుటెండల్లో నడుస్తూ ఆదివారం ముంబయికి చేరుకున్న రైతులకు మంచి నీటి ప్యాకెట్లు, బిస్కెట్ ప్యాకెట్లు, పలు రకాల ఆహార పదార్థాలతో డబ్బావాలాలుసహా పలు వర్గాల ప్రజలు ఆత్మీయ స్వాగతం పలికారు. రైతుల ఆకలిదప్పులు తీర్చి ముంబయి ప్రజలు తమ హృదయపూర్వక మమకారాన్ని చాటుకున్నారు. పలు స్వచ్ఛంద సంస్థల కార్యకర్తలు కూడా రైతులకు ఆహార పొట్లాలు, మంచినీళ్ల బాటిళ్లు అందించారు. నగరంలోకి ప్రవేశించిన రైతులకు మహిళలు, చిన్నారులు తమకు తోచిన సాయం చేసి అన్నదాతల పట్ల తమ అభిమానాన్ని చాటుకున్నారు.
రెండు దశాబ్దాల్లో 4 లక్షలమంది రైతుల ఉసురుతీసిన పాలకుల విధానాలు
1991 నుంచి మొదలైన ఉదార ఆర్థిక విధానాలతో కేంద్రంలో ఏ ప్రభుత్వం ఉన్నా రైతుల పట్ల నిర్లక్ష్యంగానే నిర్ణయాలు తీసుకున్నాయన్నది తెలిసిందే. రెండు దశాబ్దాల కాలంలో సుమారు నాలుగు లక్షలకుపైగా రైతులు ఆత్మహత్యలకు పాల్పడ్డారు. ఆత్మహత్యలు ఎక్కువగా మహారాష్ట్రలోనే జరగడం గమనార్హం. ఈ నేపథ్యంలోనే అక్కడి రైతులు వినూత్న నిరసనకు శ్రీకారం చుట్టారు.
'మనం తినే ప్రతి ఆహారపు ముద్ద వెనకా రైతులు చిందించిన స్వేదం ఉంది. పాలకవర్గాల ఉదాసీనత వల్ల 4 లక్షలమంది రైతులు తమ జీవితాల్ని చాలించారు. పాలకుల చేతులు రైతుల రక్తంతో తడిచాయి. తమ హక్కుల సాధన కోసం ఉద్యమ బాట పట్టిన రైతులకు సంపూర్ణ సంఘీభావాన్ని అందిద్దాం'
- ఆల్ ఇండియా కిసాన్ సభ
బీజేపీ పాలిత రాష్ట్రాల్లో రైతుల బతుకు దుర్భరం
దేశంలోని బీజేపీ పాలిత రాష్ట్రాల్లోనే రైతులు ఎక్కువ ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. అన్నదాతల ఆత్మహత్యలూ ఈ రాష్ట్రాల్లోనే ఎక్కువ. రెండేండ్లుగా దేశంలో అన్నదాతల ఆందోళనలు ఉధృతమయ్యాయి. మధ్యప్రదేశ్, గుజరాత్, ఛత్తీస్ఘఢ్, రాజస్థాన్లలో రైతుల ఉద్యమాలు జరిగాయి. గుజరాత్, మధ్యప్రదేశ్లో రైతులు శాంతియుతంగా నిరసన తెలుపుతుంటే పోలీసులు తూటాల వర్షం కురిపించి పలువురిని పొట్టన బెట్టుకున్నారు. ఇప్పుడు మహారాష్ట్రలోనూ బీజేపీనే అధికారంలో ఉన్నది. దీన్ని బట్టి రైతుల సంక్షేమంపై బీజేపీకి ఏపాటి శ్రద్ధ ఉన్నదో అర్థమవుతున్నది. ఇటీవల దేశంలో జరిగిన రైతు ఉద్యమాల్లో లాంగ్ మార్చ్ అతి పెద్ద పోరాటం అనడంలో ఎలాంటి సందేహమూ లేదు.
బొబ్బలెక్కి.. రక్తమోడుతున్నా..
ఎండలో నడిచి నడిచి వాచిపోయిన కాళ్లు.. సరిపోయి.. సరిపోని చెప్పులు(స్లిప్పర్లు).. బొబ్బలెక్కి రక్తమోడుతున్న పాదాలు.. ప్రభుత్వ ప్రజా వ్యతిరేక విధానాలతో జీవితంలో పడుతున్న కష్టాల కంటే రైతులకు ఈ గాయాలు చిన్నగానే కనిపించాయి. అసెంబ్లీని దిగ్బంధించి తమ ఆవేదనను తెలియజేయాలన్న సంకల్పమే వారిని ముంబయి వరకూ నడిపించింది. 200 కిలోమీటర్ల దూరం సాగిన పాదయాత్రలో రైతులు పడ్డ ఇబ్బందులు వర్ణణాతీతం. కుటుంబం, పిల్లలను విడిచి బయటి కొచ్చిన వారికి.. కడుపు నిండా తిండి లేదు.. కంటి నిండా కునుకు లేదు. అక్కడో ఇక్కడో స్థానికులు అందించిన ఆహారం, నీళ్లతో సరిపెట్టుకుంటూ యాత్ర సాగించారు కర్షకులు.
ఎర్రసముద్రాన్ని తలపించిన మహారాష్ట్ర పాదయాత్రలు పాల్గొన్న కొందరు అన్నదాతల ఆవేదన వారి మాటల్లో...
జీవితం మొత్తం కూలీ బతుకే
రాదాభాయి.. దిండోరి, నాసిక్ జిల్లా
నా వయస్సు 65 యేండ్లు. నా జీవితం మొత్తం ఇతరుల పొలాల్లోనే పని చేయవలసి వచ్చింది. ఖాళీగా ఉన్న అటవీ భూమిలో ఒక ఎకరం భూమిని బతుకుదెరువుకోసం ఇప్పించాలని రెండు దశాబ్దాలుగా ప్రభుత్వాన్ని కోరుతున్నార. ఆ భూమితో నా వారసులకైనా మంచి భవిష్యత్ దొరుకుతుందని ఆశ. అయినా ప్రభుత్వం పట్టించుకోవడం లేదు.
నీళ్లు లేక కూలికి వెళ్తున్నాం
హిరమన్ వాగ్మేర్(46).. చికడి. నాసిక్ జిల్లా
నాకు అయిదెకరాల భూమి ఉంది. వర్షాలు పడితేనే పంటలు పండుతాయి. బోరు, బావి తవ్వే స్థోమత లేదు. వర్షాలు కురువక, నీటి సదుపాయం లేక నిత్యం రూ. 100కు కూలికి వెళ్తున్నాం.
ప్రభుత్వం మా భూములకు పట్టాలు ఇప్పిస్తే బ్యాంకు వద్ద రుణాలు తీసుకుని నీటి సదుపాయం కల్పించుకుంటాం.
రుణ మాఫీ కాలేదు
రాజేబావు రాథోడ్(42).. సుర్పింప్రీ గ్రామం, ప్రభాని జిల్లా
నాకున్న మూడెకరాల భూమిని 2012లో బ్యాంకులో తనాఖా పెట్టి రూ. 1.80 లక్షలు అప్పు తీసుకున్నా. బీజేపీ ప్రభుత్వం ప్రకటించిన రుణమాఫీ హామీని చూసి ఓట్లేసాం. కానీ ఆ ఆనందం ఆవిరవ్వడానికి ఎంతోకాలం పట్టలేదు. ప్రభుత్వం ప్రకటించిన జాబితాలో నా పేరున్నా బ్యాంకు వారి వద్దకు వెళ్తే కొత్త రుణాన్ని ఇవ్వడం లేదు. ప్రభుత్వం రుణాన్ని మాఫీ చేయలేదు. మూడేండ్లుగా కరువుతో పంటల్లేక తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నాం.
నిండా మునిగాం
రామ్రాజే (40) మన్వత్, పర్బానీ జిల్లా
ఈ యేడు మూడెకరాల్లో పత్తి పంట వేశాం. గులాబీ పురుగు సోకి పంటంతా నాశనమైంది. ఎకరానికి 12 క్వింటాళ్లు రావలసిన దిగుబడి రెండు క్వింటాళ్లు కూడా రాలేదు. దీంతో తీవ్రంగా నష్టపోయాం. ప్రభుత్వం నష్టపరిహారం ప్రకటించినా ఇంతవరకూ అందలేదు.
అటవీ హక్కుల చట్టాన్ని అమలు చేయాలి
- కృష్ణ(34) తల్వాడా, థానే జిల్లా
నాకు ఎనిమిదెకరాల భూమి ఉంటే ప్రభుత్వాధికారులు కేవలం నాలుగెకరాలు మాత్రమే రికార్డుల్లో ఎక్కించారు. మా గ్రామంలో చాలా మంది పరిస్థితి ఇదే విధంగా ఉంది. ప్రభుత్వం వెంటనే అటవీ హక్కుల చట్టం- 2006ను సమర్ధవంతంగా అమలు చేసి మా భూములు మా పేర రిజిష్టర్ చేయాలి.
భూమికి భద్రత కరువయ్యింది
అంబదాస్(55) కొల్హే, నాసిక్
నాకున్న ఐదెకరాల్లో టమాటో, సోయాబిన్, ఆలు, తదితర పంటలు పండిస్తున్నాను. అదే నా కుటుంబానికి జీవనాధారం. కానీ ఇటీవల ప్రభుత్వం మా భూములను లాక్కుంటోంది. రక్షించాల్సిన ప్రభుత్వమే ఇలా చేస్తే.. నా కుటుంబం భవిష్యత్ అర్థం కావడం లేదు.
కరెంటు, నీళ్లూ లేవు.. సాగు ఎలా..?
మందా పవార్(45) పండానా, నాసిక్
మాకు పదెకారల భూమి ఉంది. అయినా కరెంటు, నీళ్ల సదుపాయం లేక తీవ్ర ఇబ్బందులు పడుతున్నాం. పెట్టుబడి తెచ్చి పంట పండిద్దామన్నా చేతిలో చిల్లిగవ్వ లేదు. కుటుంబ పోషణ కోసం వ్యవసాయ కూలీలుగా మారాం. ప్రజా రవాణా వ్యవస్థ ద్వారా ప్రభుత్వం అందిస్తోన్న సరుకులు సైతం సరిగ్గా రావడం లేదు.