Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- 2019 ఎన్నికలకు కాంగ్రెస్ కసరత్తు
- నేడు, రేపు ఢిల్లీలో ప్లీనరీ సమావేశాలు
నవతెలంగాణ-న్యూఢిల్లీబ్యూరో
2019 లోక్సభ ఎన్నికలకు కాంగ్రెస్ పార్టీ కసరత్తు ప్రారంభించింది. నరేంద్రమోడీ సర్కారుపై తీవ్ర అసంతృప్తితో ఉన్న రైతాంగాన్ని, యువతను పార్టీకి దగ్గర చేసుకునేందుకు ప్రణాళికలు సిద్ధం చేస్తోంది. వచ్చే యేడాది జరిగే సాధారణ ఎన్నికల్లో మరోసారి దేశవ్యాప్త రుణమాఫీని ముందుకు తీసుకురావాలని భావిస్తోంది. శని, ఆదివారాలు రెండు రోజుల పాటు జరగనున్న ఆ పార్టీ ప్లీనరీ సమావేశంలో ఈ మేరకు తీర్మానం చేయనున్నట్టు తెలుస్తోంది. అలాగే ఆంధ్రప్రదేశ్కు ప్రత్యేక హోదా కల్పించడంపై కూడా ఓ తీర్మానం ఆమోదించనున్నట్టు సమాచారం. పార్టీ ప్లీనరీ సమావేశాల నేపథ్యంలో శుక్రవారం కాన్షిట్యూషన్ క్లబ్లో జరిగిన స్టీరింగ్కమిటీ సమావేశంలో ఈ మేరకు పలువురు నేతలు ప్రతిపాదించినట్టు తెలిసింది. ఈ సమావేశానికి టీపీసీసీ అధ్యక్షులు ఉత్తమ్కుమార్రెడ్డితో పాటు మండలి కాంగ్రెస్ విపక్ష నేత షబ్బీర్ అలీ తదితరులు పాల్గొన్నారు. వ్యవసాయ రంగానికి ప్రాధాన్యత కల్పించాలని తాము కోరామని సమావేశనంతరం ఉత్తమ్కుమార్రెడ్డి తెలిపారు. అలాగే మద్దతు ధరలను పెంచాలని సూచించామన్నారు. 2019లో అధికారంలోకి వస్తే 'దేశవ్యాప్తంగా కాంగ్రెస్ రుణమాఫీ అమలు చేయనుంది' అని తెలిపారు. యూపీఏ హయాంలో ఇచ్చిన ప్రత్యేక హోదా హామీని బీజేపీ విస్మరించడాన్ని ఖండిస్తూ రాజకీయ తీర్మానంలో ఏపీ అంశాన్ని పొందుపరిచామని ఏపీ పీసీసీ అధ్యక్షులు రఘువీరారెడ్డి చెప్పారు. కాంగ్రెస్ ప్లీనరీలో ఒక రాష్ట్రానికి సంబంధించిన అంశాన్ని ప్రత్యేక చేర్చడం ఇదే మొదటిసారని తెలిపారు. కాగా నేడు ఢిల్లీలోని ఇందిరాగాంధీ స్టేడియంలో ప్లీనరీ సమావేశాలు ప్రారంభమవుతాయి. రాహుల్గాంధీ ప్రారంభోపన్యాసం చేస్తారు. ఎన్డీయే సర్కారు వైఫల్యాలు, కాంగ్రెస్ భవిష్యత్తుపై ఈ ప్లీనరీలో చర్చిస్తారు. మాజీ ప్రధాని మన్మోహన్సింగ్ రాజకీయ ముసాయిదా తీర్మానం ప్రవేశపెడతారు. 18వ తేదీ రాహుల్గాంధీ ముగింపు ప్రసంగం చేస్తారు. నేడు వ్యవసాయం, రాజకీయ అంశాలపై ప్రధానంగా చర్చిస్తారని కాంగ్రెస్ నేతలు తెలిపారు.