Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- మోడీ సర్కార్కు వ్యతిరేకంగా లోక్సభలో టీడీపీ, వైసీపీ తీర్మానం
- కాంగ్రెస్, సీపీఐ(ఎం), టీఎంసీ మద్దతు
- నిరసనల సాకుతో సభ వాయిదా
దేశ రాజధాని హస్తినలో రాజకీయ పోరు వేడెక్కింది. నాలుగేండ్ల పాటు అధికారంలో ఉన్న మోడీ సర్కారు మొట్టమొదటిసారి అవిశ్వాస తీర్మానాన్ని ఎదుర్కొబోతున్నది. టీడీపీ,వైసీపీ పోటాపోటీగా అవిశ్వాసతీర్మానాలు ప్రవేశపెట్టాయి. దీనికి సీపీఐ(ఎం)తో సహా పలు పార్టీలు మద్దతు తెలపగా..మోడీ సర్కారులోని మిత్రపక్షాలు గుర్రుగా ఉన్నాయి. లోక్సభలో విశ్వాసం నెగ్గటానికి మ్యాజిక్ ఫిగర్ 271. కాగా ఎన్డీయే సర్కారుకు అవసరమైన బలం ఉన్నా... అవిశ్వాస తీర్మానం వైపు మళ్లుతాయన్న చర్చకు తెరతీసినట్టయింది.ఇన్నాళ్లూ తమకు ఎదురులేదనుకున్న మోడీకి..అవిశ్వాసఅస్త్రం మింగుడుపడటంలేదు. మారుతున్న రాజకీయ సమీకరణలతో బీజేపీ పెద్దలు అంత్మరథనంలో పడ్డారు. దీంతో గల్లీనుంచి ఢిల్లీదాకా లోక్సభ వైపు అందరూ దృష్టికేంద్రీకరించారు.ఈ అవిశ్వాసతీర్మానంతో ఎన్డీయే సర్కారుకు ఎలాంటి ముప్పులేకపోయినా.. నైతికంగా మోడీ ప్రభుత్వానికి పెద్ద ఎదురుదెబ్బఅని విశ్లేషకులు అంటున్నారు.
నవతెలంగాణ-న్యూఢిల్లీబ్యూరో
మోడీ సర్కారుకు వ్యతిరేకంగా టీడీపీతో పాటు వైసీపీ పోటాపోటీగా అవిశ్వాస తీర్మానాలు ప్రవేశపెట్టాయి. ఈ తీర్మానాలకు టీఆర్ఎస్, అన్నాడీఎంకే మినహా ప్రధాన ప్రతిపక్ష పార్టీలన్నీ మద్దతు తెలిపాయి. లోక్సభలో ఈ తీర్మానాలపై స్పీకర్ సుమిత్రా మహాజన్ ప్రకటన చేసే సమయంలోనే కాంగ్రెస్, సీపీఐ(ఎం), ఎస్పీ, టీఎంసీ తదితర పార్టీల ఎంపీలు తమ స్థానాల్లో నిల్చోని మద్దతు తెలిపారు. అయితే సభ 'క్రమంలో' లేదని, ఈ సమయంలో అవిశ్వాస తీర్మానాలను ప్రవేశపెట్టలేనని స్పీకర్ ప్రకటించారు. అనంతరం సభను సోమవారానికి వాయిదా వేశారు. 'విపక్షాల నిరసనలపై ప్రజలు సహనం కోల్పోతున్నారు' అంటూ రాజ్యసభలో చైర్మెన్ వెంకయ్యనాయుడు చేసిన వ్యాఖ్యలు కొద్దిపాటి వాగ్వాదానికి దారి తీశాయి. గతంలో విపక్షాల ఆందోళనలతో నెలల తరబడి సభ వాయిదా పడటం చూడలేదా? అని కాంగ్రెస్ ప్రశ్నించింది. దీంతో కొద్దిసేపు వాగ్వాదం చోటుచేసుకుంది. అనంతరం సభ మధ్యాహ్నం 2.30 గంటలకు ఆపై సోమవారానికి వాయిదా పడింది. ఆంధ్రప్రదేశ్కు హోదా హామీని విస్మరించినందుకు నిరసనగా కేంద్రంపై తమకు విశ్వాసం లేదంటూ ఏపీకి చెందిన అధికార, ప్రతిపక్ష పార్టీలు టీడీపీ, వైసీపీలు ప్రవేశపెట్టిన అవిశ్వాస తీర్మానాలు శుక్రవారం సభ ముందుకు వచ్చాయి. వైసీపీ ఎంపీ వైవీ సుబ్బారెడ్డి, టీడీపీ ఎంపీ తోట నరసింహం అందజేసిన నోటీసులు తమకు అందాయని స్పీకర్ సుమిత్రా మహాజన్ సభలో ప్రకటించారు. 'నోటీసులు సభ ముందుకు తీసుకురావడం నా బాధ్యత. సభ క్రమంలో ఉండేంత వరకూ... ఆయా ఎంపీలు తమ స్థానాల్లో నిల్చున్నారో లేదో 50 మందిని లెక్కించడం సాధ్యపడదు. లెక్కించిన తరువాతే ఈ తీర్మానాలను ప్రవేశపెట్టేందుకు అనుమతివ్వాలో తిరస్కరించాలో నిర్ధారించే వీలుంటుంది' అని అన్నారు. ఈ సమయంలో రిజర్వేషన్ కోటాపై టీఆర్ఎస్ ఎంపీలు, కావేరీ నదీ నిర్వహణ బోర్డు కోసం అన్నాడీఎంకే ఎంపీలు వెల్లో ప్లకార్డులతో నినాదాలు చేశారు. 'సభ క్రమంలో లేనందున.. తీర్మానాలను సభ ముందు ప్రవేశపెట్టలేను' అని ప్రకటించిన స్పీకర్.. అనంతరం సభను 19వ తేదీ సోమవారానికి వాయిదా వేశారు.
అంతకముందు ఉదయం సభ ప్రారంభమవగానే యూపీ, బీహార్లో జరిగిన లోక్సభ ఉప ఎన్నికల్లో గెలుపొందిన ఎంపీలు ప్రమాణం చేశారు. అనంతరం ప్రశ్నోత్తరాలను ప్రారంభిస్తున్నట్టు స్పీకర్ ప్రకటించారు. దీంతో టీడీపీ, వైసీపీ, టీఆర్ఎస్, అన్నాడీఎంకే ఎంపీలు తమ డిమాండ్లపై వెల్లోకి దూసుకొచ్చారు. పెద్దఎత్తున నినదాలు చేశారు. ప్రశ్నోత్తరాలను అడ్డుకున్నారు. దీంతో సభను స్పీకర్ మధ్యాహ్నం 12 గంటలకు వాయిదా వేశారు.
అవిశ్వాసానికి మద్దతిస్తాం : సీపీఐ(ఎం) జాతీయ ప్రధాన కార్యదర్శి సీతారాం ఏచూరి
ఏపీకి ప్రత్యేక హోదా హామీని విస్మరించిన బీజేపీ ప్రభుత్వానికి వ్యతిరేకంగా ప్రవేశపెట్టిన అవిశ్వాస తీర్మానానికి మద్దతు తెలియజేస్తామని సీపీఐ(ఎం) జాతీయ ప్రధాన కార్యదర్శి సీతారాం ఏచూరి తెలిపారు. ఈ మేరకు ఆయన ట్వీట్ చేశారు. 'బీజేపీ ప్రభుత్వానికి వ్యతిరేకంగా తీసుకొచ్చిన అవిశ్వాస తీర్మానానికి సీపీఐ(ఎం) మద్దతిస్తోంది. ఆంధ్రప్రదేశ్కు ప్రత్యేక హోదా వాగ్దానంపై బీజేపీ విశ్వాస ఘాతుకానికి పాల్పడటం క్షమార్హంకాదు. అన్ని రంగాల్లో వైఫల్యంపై, పార్లమెంట్ జవాబుదారీతనం నుంచి తప్పించుకోవడంపై బీజేపీని ఎండగట్టాల్సిన అవసరముంది' అని పేర్కొన్నారు.
బీజేపీకి గట్టి ఎదురుదెబ్బ... టీడీపీ దారిలో మరికొన్ని పార్టీలు?
కేంద్రంలోని మోడీ సర్కారుకు గట్టి ఎదురుదెబ్బ తగిలినట్టయింది. ఎన్డీయే కూటమి నుంచి మిత్రపక్షమైన టీడీపీ తెగదెంపులు చేసుకున్నది. ఏపీకి ప్రత్యేక హోదాను ఇవ్వనందుకు నిరసనగా బీజేపీ సర్కారుపై అవిశ్వాస తీర్మానం ప్రవేశపెట్టింది. మొదట వైసీపీ ప్రవేశపెట్టిన అవిశ్వాసానికి మద్దతు ఇవ్వనుందని ఊహాగానాలు వినిపించాయి. అయితే వైసీపీ అవిశ్వాసం ఓ డ్రామా అని పేర్కొన్న ఆ పార్టీ లోక్సభాపక్ష నేత తోట నరసింహం.. తామే స్వయంగా అవిశ్వాస తీర్మానం ప్రవేశపెడుతున్నామని శుక్రవారం ఉదయం మీడియాకు తెలిపారు. ఎన్డీయే మిత్రపక్షంలో శివసేన(18) పార్టీల తరువాత అతిపెద్ద రెండో పార్టీ టీడీపీ. మొత్తం 16 మంది లోక్సభ సభ్యుల సంఖ్యాబలం ఉన్నది. కాగా టీడీపీ బాటలోనే మరికొన్ని పార్టీలున్నట్టు తెలుస్తోంది. బీజేపీపై శివసేన సైతం ఆగ్రహంగా ఉన్నది. మోడీ నేతృత్వంలోని సర్కారు కీలకమైన అంశాలపై మిత్రపక్షాలతో సంప్రదింపులు చేయడం లేదని ఆ పార్టీ ఎంపీ చంద్రకాంత్ తెలిపారు. 'బీజేపీ మాజీ ప్రధాని అటల్ బిహారీ వాజ్పేయి ఎప్పుడూ మిత్రపక్షాలను తన వెన్నంటే నిలుపుకునేవారు' అని అన్నారు. ఆ పార్టీ పత్రిక సామ్నాలోనూ మోడీ వైఖరిని తీవ్రపదజాలంతో ఎండగట్టారు. నాలుగేండ్ల క్రితం ఎన్డీయేను అధికారంలోకి తీసుకొచ్చిన మోడీ హవా నీరుగారిపోయిందని ఎడిటోరియల్లో పేర్కొన్నది. నేడు ప్రజలు అన్ని విషయాలు స్పష్టంగా చూస్తున్నారని చంద్రకాంత్ తెలిపారు. మరోవైపు టీడీపీ అవిశ్వాస తీర్మానానికి తృణమూల్ కాంగ్రెస్ మద్దతు తెలిపింది. ఎన్డీయే నుంచి టీడీపీ తెగదెంపులు చేసుకోవడాన్ని ఆ పార్టీ అధినేత్రి మమతాబెనర్జీ స్వాగతించారు. ఈ మేరకు ఆమె ట్వీట్ చేశారు. బీజేడీ సైతం మద్దతు తెలిపింది. మద్దతుపై కాంగ్రెస్ అధికారికంగా ప్రకటించినప్పటికీ.. లోక్సభలో ఉదయం అవిశ్వాస తీర్మానం వచ్చినప్పుడు కాంగ్రెస్తో పాటు యూపీఏ మిత్రపక్షాల ఎంపీలు నిల్చుని మద్దతు తెలిపారు. టీడీపీ అవిశ్వాసానికి మద్దతిచ్చే అంశంపై అన్నాడీఎంకే ఇంకా నిర్ణయించలేదు. అవిశ్వాసంపై పార్టీ హైకమాండ్ నిర్ణయం తీసుకోనున్నదని ఆ పార్టీ ఎంపీ తంబిదొరై తెలిపారు. కావేరీ నదీ నిర్వహణ బోర్డు ఏర్పాటు చేయకపోవడంపై తమిళ ఎంపీలు తీవ్ర ఆగ్రహంగా ఉన్న విషయం తెలిసిందే. కాగా అకాలీదళ్ బీజేపీకి మద్దతు ప్రకటించింది. 'బీజేపీకి అకాలీదళ్ పురాతన భాగస్వామి. ఇలాంటి క్లిష్టసమయాలను కలిసికట్టుగా ఎదుర్కొన్నాం' అని ఫుడ్ప్రాసెసింగ్ మంత్రి హర్సిమ్రత్కౌర్ అన్నారు.
టీఆర్ఎస్ది అదే దారి..
కేంద్రప్రభుత్వంపై టీడీపీ ప్రవేశపెట్టిన అవిశ్వాస తీర్మానం పార్లమెంటులో చర్చకు వస్తే..మోడీ సర్కారుకు వ్యతిరేకంగా ఓటేయనున్నట్టు టీఆర్ఎస్ వెల్లడించింది. ఎన్డీయే ప్రభుత్వతీరును వ్యతిరేకిస్తున్న తెలంగాణ ప్రభుత్వం కూడా అవిశ్వాసతీర్మానానికి మద్దతు తెలపాలని నిర్ణయించింది.
రాజ్యసభలో చైర్మెన్కు, కాంగ్రెస్ ఎంపీకి వాగ్వాదం...
విపక్షాల ఆందోళనపై రాజ్యసభ చైర్మెన్కు కాంగ్రెస్ ఎంపీ సత్యవ్రత్ చతుర్వేదికి స్వల్ప వాగ్వాదం చోటుచేసుకుంది. ఉదయం సభ ప్రారంభమైన తరువాత చైర్మెన్ వెంకయ్యనాయుడు ఆందోళన చేపడుతున్న ఎంపీలనుద్దేశించి ప్రసంగం చేశారు. సభను అడ్డుకునే బదులు అంశాలపై చర్చ చేపట్టాలని సూచించారు. ప్రతిరోజూ పార్లమెంట్ పనిచేయకపోవడాన్ని చూసి ప్రజలు అసహానానికి గురౌతున్నారని చెప్పారు. 'సభలో ప్లకార్డులు ప్రదర్శిస్తూ.. అంశాలను పరిష్కరించలేరు. డిస్కస్, డిబేట్, డిసైడ్' అని ఎంపీలకు సూచించారు. వెంకయ్యనాయుడు ప్రసంగం ముగించగానే.. కాంగ్రెస్ ఎంపీ సత్యవ్రత్ చతుర్వేది లేచి మాటా ్లడారు. 'సభ జరగాలన్న మీ అభిప్రాయాలను ఎవరూ నిరాకరించడం లేదు. కానీ మీకు నేనొక్కటి అడగద ల్చుకున్నాను. మీ సుదీర్ఘ రాజకీయ అనుభవంలో సభను అడ్డుకోవడం చూడటం ఇదే మొదటిసారా? గతంలో మీరు చూడలేదా? ఈ సభను గతంలో నెలల తరబడి స్తంభింపచేశారు' అని చెప్పారు. దీంతో సభను చైర్మెన్ మధ్యాహ్నం 2.30 నిమిషాలకు వాయిదా వేశారు. అనంతరం ప్రయివేటు సభ్యుల చర్చలోనూ విపక్ష పార్టీలు ఆందోళన చేపట్టాయి. ఫలితంగా సభ సోమవారానికి వాయిదా పడింది.
నూతన సభ్యుల ప్రమాణం..
యూపీ, బీహార్ లోక్సభ ఉప ఎన్నికల్లో గెలుపొందిన ఆర్జేడీ, ఎస్పీ నూతన సభ్యులు శుక్రవారం ఎంపీలుగా ప్రమాణం చేశారు. ఉదయం సభ ప్రారంభమవగానే బిహార్లోని అరరియా స్థానం నుంచి గెలుపొందిన సర్ఫరాజ్ అలాం, యూపీలోని పుల్పూర్ నుంచి గెలిచిన నాగేంద్రప్రతాప్ సింగ్ పటేల్, గోరఖ్పూర్ నుంచి గెలుపొందిన ప్రవీణ్కుమార్ నిషాద్లు ప్రమాణం చేశారు. నూతన సభ్యులకు విపక్ష పార్టీల ఎంపీలు బల్లులుజరుస్తూ ఘన స్వాగతం పలికారు.
అవిశ్వాసతీర్మానాల చరిత్ర..
దేశ చరిత్రలో మొత్తం 26 సార్లు అవిశ్వాసం
* 1963.. మొట్టమొదటి అవిశ్వాసతీర్మానం
* అప్పటి ప్రధాని జవహర్లాల్ నెహ్రుపై కృపలానీ
అవిశ్వాస తీర్మానం
* అనుకూలంగా 62 ఓట్లు.. వ్యతిరేకంగా 347 ఓట్లు
1978..
* కాంగ్రెసేతర ప్రధాని మొరార్జీదేశారుపై రెండ్లు సార్లు అవిశ్వాసం
* రెండోసారి మిత్రపక్షాలు దూరం..కూలిన ప్రభుత్వం
* ఇందిరా సర్కారుపై 15 సార్లు అవిశ్వాసం
* పార్లమెంటు చరిత్రలో ఎక్కువ అవిశ్వాస తీర్మానాలు ఎదుర్కొన్న ప్రధాని ఇందిరాగాంధీయే..
* ఏకంగా 15 సార్లు అవిశ్వాసం.
అవిశ్వాసతీర్మానాల చరిత్ర..
- లాల్బహదూర్ శాస్త్రి,పి.వి.నరసింహారావుపై కూడా చేరో మూడు సార్లు అవిశ్వాస తీర్మానాలు
- అవిశ్వాసతీర్మానాల ప్రవేశంపెట్టడంలో సీపీఐ(ఎం)దే పై చేయి
* ఇందిరాగాంధీ ప్రభుత్వానికి వ్యతిరేకంగా సీపీఐ(ఎం) ఎంపీ జ్యోతి మౌర్య బసు 4 అవిశ్వాసతీర్మానాలు