Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- 250 ఎకరాల భూమి
- స్వాధీనం చేసుకున్న రైతులు
ముంబయి: పంజాబ్ నేషనల్ బ్యాంకు(పీఎన్బీ)కు దాదాపు రూ.12 వేల కోట్ల రుణాలు ఎగ్గొట్టిన వజ్రాల వ్యాపారి నీరవ్ మోడీకి ఊహించని షాక్ తగిలింది. మహారాష్ట్రలోని అహ్మద్నగర్ జిల్లాలో ఆయన కంపెనీ పేరిట ఉన్న 250 ఎకరాల భూమిని రైతులు స్వాధీనం చేసుకున్నారు. తమను బెదిరించి అతి తక్కువ ధరకే ఈ భూమిని నీరవ్ సొంతం చేసుకున్నాడని వారు ఈ సందర్భంగా తెలిపారు. దాదాపు 200 మంది రైతులు ఎడ్ల బండ్లపై అహ్మద్నగర్లోని ఖండాలా ప్రాంతానికి శనివారం చేరుకున్నారు. అక్కడ నీరవ్ పేరిట ఉన్న భూమిని ట్రాక్టర్తో దున్నారు. ఈ భూమినంతా సాగు చేయనున్నట్టు రైతులు తెలిపారు. ఎకరా రూ.20 లక్షలు ధర పలికే భూమిని నీరవ్ కేవలం రూ.15 వేలకే సొంతం చేసుకున్నాడని రైతులు ఆగ్రహం వ్యక్తం చేశారు. అయితే.. పీఎన్బీ కేసు దర్యాప్తులో భాగంగా ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్(ఈడీ) అటాచ్ చేసిన ఆస్తుల్లో ఈ భూమి కూడా ఉండటం గమనార్హం.