Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- మే 23న నిరసన ప్రదర్శనలు ప్రజాసంఘాల పిలుపు
న్యూఢిల్లీ : మోడీ ప్రభుత్వ ప్రజా వ్యతిరేక విధానాలకు వ్యతిరేకంగా మే 23న నిరసన భేరీ మోగించనున్నారు. రైతులు, వ్యవసాయ కార్మికులు, కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వోద్యోగులు, బ్యాంకు, ఇన్సూరెన్ ఉద్యోగులు, కళాశాల, విశ్వవిద్యాలయ అధ్యాపకులు, విద్యార్థులు, మహిళలు, దళితులు, ఆదివాసీలు, పర్యావరణవేత్తలకు సంబంధించి దాదాపు 100కుపైగా ప్రజా సంఘాలు మే 23న జన్ ఏక్త్తా జన్ అధికార్ ఆందోళన్ (జేఈజేఏఏ) నేతృత్వంలో అన్ని రాష్ట్ర రాజధానుల్లో 'నిరసన దినం' పాటించనున్నారు. 'ఇటీవల దేశరాజధానిలో రైతులు, కార్మికులు, ఇతర వర్గాల ప్రజల జరిపిన ఆందోళనను మరింత ముందుకు తీసుకుని వెళ్లే లక్ష్యంతో ఎన్డీయే ప్రభుత్వ నాలుగో వార్షికోత్సవం రోజున జేఈజేఏఏ తన మరో విడత పోరాటాన్ని ప్రారంభించాలని నిర్ణయించింది' అని కో-ఆర్డినేషన్ కమిటీ సభ్యులు హన్నన్మొల్లా చెప్పారు. ప్రభుత్వ వినాశకర విధానాలు ముఖ్యంగా మహిళలు, యువకులపై తీవ్ర ప్రభావం పడుతున్నదని, ఇందుకు ప్రభుత్వమే బాధ్యత వహించాలని హన్నన్మొల్లా డిమాండ్ చేశారు. జేఈజేఏఏలో భాగస్వామి అయిన ఏఐకేఎస్ నేతృత్వంలో ఇటీవల మహారాష్ట్రలో నిర్వహించిన కిసాన్ మార్చ్ విజయవంతమైన విషయం తెలిసిందే. 'మహారాష్ట్రలో రైతుల మార్చ్ను మేం చూశాము, మోడీ ప్రభుత్వ ప్రజా వ్యతిరేక విధానాలపై నిరసన గళానికి మరింత పదును పెట్టాలని నిర్ణయించాం' అని కో-ఆర్డినేషన్ కమిటీ పి కృష్ణప్రసాద్ చెప్పారు.