Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- గత బడ్జెట్లో ఆర్ఎస్బీవై నిధులకు కోత
- రూ.975 కోట్ల నుంచి రూ.450 కోట్లకు కుదింపు
- మోడీ ప్రభుత్వ తీరును తప్పు పట్టిన పార్లమెంటరీ కమిటీ
- రూ.12,000 కోట్లు అవసరమైన ఎన్హెచ్పీఎస్పై పలు అనుమానాలు..?
న్యూఢిల్లీ: కేంద్ర ప్రభుత్వం చేపట్టిన ఆరోగ్య పథకాల అమలుతీరు పట్ల పార్లమెంటరీ కమిటీ తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేసింది. ఈ ఏడాది(2018-19) బడ్జెట్ ప్రవేశపెట్టిన సందర్భంగా దేశంలోని పేద కుటుంబాలకు ఏటా రూ.5 లక్షలమేర ఆరోగ్య బీమా కల్పిస్తామంటూ జాతీయ ఆరోగ్య సంరక్షణ పథకం(ఎన్హెచ్పీఎస్)ను ఆర్థికమంత్రి అరుణ్జైట్లీ ప్రకటించిన విషయం తెలిసిందే. అయితే, దీనికన్నా ముందు దారిద్య్రరేఖకు దిగువన ఉన్న పేదలు(బీపీఎల్ కుటుంబాలు), అసంఘటిత రంగంలోని కార్మికుల కోసం రాష్ట్రీయ స్వస్థ బీమా యోజన(ఆర్ఎస్బీవై) పేరుతో ఓ పథకం ఉన్నది. 2008లో యూపీఏ ప్రభుత్వం ప్రారంభించిన ఈ పథకాన్ని బీజేపీ నేతృత్వంలోని ప్రస్తుత ప్రభుత్వం కూడా బడ్జెట్ లెక్కల్లో అమలు చేస్తున్నట్టు చెప్పుకుంటూ వచ్చింది. కానీ, ఆర్ఎస్బీవైపై ఏర్పాటైన పార్లమెంటరీ స్థాయీ సంఘం అధ్యయనంలో పథకం అమలులోని పలు లోపాలు బయటపడ్డాయి. ఇటీవలే కమిటీ తన నివేదికను కేంద్రానికి అందించింది.
ఆర్ఎస్బీవై కోసం 2017-18 బడ్జెట్లో రూ.975 కోట్లు కేటాయిస్తున్నట్టు చెప్పి ఆ తర్వాత రూ.565 కోట్లకు మోడీ ప్రభుత్వం తగ్గించింది. కేటాయించిన నిధుల్ని కూడా రాష్ట్రాలకు విడుదల చేయలేదని, కేవలం రూ.450 కోట్లు మాత్రమే తన వాటాగా ఇచ్చిందని పార్లమెంటరీ కమిటీ తన నివేదికలో తెలిపింది. ఎందుకిలా తగ్గించారని కేంద్ర ఆరోగ్య, కుటుంబ సంక్షేమశాఖను ప్రశ్నించగా..రూ.లక్షకు బీమా కవరేజ్ను పెంచేందుకు తమ ప్రతిపాదనపై రాష్ట్రాల నుంచి నివేదికల కోసం ఎదురు చూస్తున్నామని..దాంతో, ఆర్ఎస్బీవైని నిలిపి వేశామని సమాధానమిచ్చినట్టు కమిటీ తన నివేదికలో ఉటంకించింది. ఆర్ఎస్బీవై ద్వారా బీపీఎల్ కుటుంబాలకు రూ.30,000 బీమా కల్పించాలనేది గత పథకం లక్ష్యం. అయితే, ఆ లక్ష్యాన్ని కూడా చేరుకోవడంలో కేంద్రంలోని మోడీ ప్రభుత్వం విఫలమైనట్టు నివేదిక స్పష్టం చేసింది. కనీసం ఆ పథకం గురించి కూడా పేద కుటుంబాలకు చాలావరకు తెలియదనే చెప్పాలి. అర్హత ఉన్న కుటుంబాల్లో 57 శాతం మాత్రమే ఆర్ఎస్బీవైలో చేరారని, 12 శాతం మాత్రమే లబ్ది పొందారని కమిటీ(స్థాయీ సంఘం) తన నివేదికలో విశ్లేషించింది. వైఫల్యాలపై కమిటీని ఏర్పాటు చేసి ఇకనైనా ఆ పథకాన్ని సక్రమంగా అమలు చేయాలని స్థాయీ సంఘం తన నివేదికలో కేంద్రానికి సూచించింది.
ఇదిలా ఉండగానే కేంద్రం ఎన్హెచ్పీఎస్ పేరుతో కొత్త పథకాన్ని ఎంతో ఆర్బాటంగా ప్రకటించిన విషయం తెలిసిందే. ఎన్హెచ్పీఎస్ పరిధిలోకి వచ్చేవారిలో దాదాపు 50 శాతం ఆర్ఎస్బీవై కింద ఉన్నవారేనని కమిటీ గుర్తించింది. ఎన్హెచ్పీఎస్ ద్వారా దేశంలోని 10 కోట్ల కుటుంబాలకు(50 కోట్లమందికి) ఆరోగ్య బీమా కల్పిస్తానని మోడీ ప్రభుత్వం ప్రచారం చేసుకుంటున్నది. ఈ పథకానికి తాజా బడ్జెట్లో కేటాయించింది మాత్రం రూ.2000 కోట్లే కాగా, కేంద్రం వాటాగా కనీసం రూ.12,000 కోట్లు అవసరమవుతాయని అంచనా ఉన్నది. కేంద్ర-రాష్ట్రాలు 60:40 నిష్పత్తిలో ఈ పథకం కోసం ఖర్చు చేయాల్సి ఉంటుంది. కొత్తగా తెచ్చిన పథకాన్ని ఔట్ పేషెంట్ల విషయంలోనూ అమలు చేయాలని పార్లమెంటరీ కమిటీ సూచించింది. అయితే, ఇప్పటికే ఏపీ, తెలంగాణలాంటి రాష్ట్రాల్లో ఆరోగ్యశ్రీ వంటి పథకాలు అమలవుతున్నాయి. రాష్ట్రాలు సొంతంగా అమలు చేస్తున్న ఆరోగ్య పథకాలపై కేంద్ర అధికారులు అధ్యయనం చేస్తున్న సంగతి తెలిసిందే. ఇప్పటికే ఆరోగ్యశ్రీ అమలుతీరుపై తెలంగాణ ప్రభుత్వం నుంచి కేంద్రానికి నివేదిక అందింది.