Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- ఐదుగురు పౌరులు మృతి, ఇద్దరికి గాయాలు
శ్రీనగర్: పాకిస్థాన్ ఆర్మీ కాల్పుల విరమణ ఒప్పందాన్ని ఉల్లంఘిస్తునే ఉంది. తాజాగా జమ్మూకాశ్మీర్లోని పూంచ్ జిల్లా బాల్కోట్ సెక్టార్లో పాక్ బలగాలు కాల్పులకు తెగబడ్డాయి. ఈ కాల్పుల్లో ఐదుగురు పౌరులు మృతి చెందగా ఇద్దరు గాయపడ్డారు. ఆదివారం ఉదయం 7:45 గంటల ప్రాంతంలో దేవ్తాదార్ గ్రామ సమీపంలో నియంత్రణ రేఖ వెంబడి ఉన్న ఆర్మీ స్థావరాలు, జనావాసాలను లక్ష్యంగా చేసుకుని పాక్ ఆర్మీ కాల్పులు జరిపింది. దీనికి ప్రతిస్పందనగా భారత బలగాలు దీటుగా బదులిచ్చాయి. పాక్ బలగాల కాల్పుల్లో చౌదరీ మహ్మద్ రంజాన్ అనే స్థానికుడితో పాటు అతని భార్య, ముగ్గురు కుమారులు ప్రాణాలు కోల్పోయారు. అలాగే రంజాన్ ఇద్దరు కూతుర్లు గాయపడ్డారు. వారిని చికిత్స నిమిత్తం స్థానిక ఆస్పత్రికి తరలించినట్టుగా జమ్మూకాశ్మీర్ డీజీపీ వేద్ తెలిపారు. పాక్ ఆర్మీ దుశ్చర్యను కేంద్ర మంత్రి జితేంద్రసింగ్ తీవ్రంగా ఖండించారు. భారత ప్రభుత్వం భద్రతా బలగాలకు పూర్తి స్వేచ్ఛను కల్పించిందని, వారు తగిన రీతిలో స్పందిస్తారని ఆయన తెలిపారు.