Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- బీజేపీ పాలనలో భయాందోళనల్లో ప్రజలు
- ప్రశ్నిస్తే దాడులు చేస్తారా..?
- ఆర్ఎస్ఎస్, బీజేపీపై రాహుల్ నిలదీత
న్యూఢిల్లీ: రాబోయే ఎన్నికల్లో అధికారం కోసం ఎగబడుతున్న కౌరవులకు(బీజేపీకి), ధర్మం కోసం పోరాడుతున్న పాండవులకు (కాంగ్రెస్కు) మధ్య యుద్ధమని కాంగ్రెస్ జాతీయ అధ్యక్షుడు రాహుల్ గాంధీ అన్నారు. ఢిల్లీలో జరుగుతున్న కాంగ్రెస్ పార్టీ 84వ ప్లీనరీ సమావేశాల్లో ఆయన మాట్లాడారు. ఈ సందర్భంగా ఆర్ఎస్ఎస్, బీజేపీపై ఆయన ఆరోపణాస్త్రాలు సంధించారు. రాహుల్ మాట్లాడుతూ... 'దేశంలో అతిపెద్ద పెట్టుబడిదారుడి పేరుకు, ప్రధాని మోడీ పేరుకు ఓ పోలిక ఉన్నది. ఒక మోడీకి వ్యాపారం చేసుకునేందుకు రూ. 30వేల కోట్లు ఇస్తే.. మరో మోడీ ప్రధాని రాజకీయాల్లో రాణించేందుకు, ప్రచారం చేసుకునేందుకు డబ్బులు ఇస్తారంటూ' ప్రధానిపై విరుచుకుపడ్డారు. దేశంలో ఆశ్రిత పెట్టుబడిదారులకు ప్రధాని కొమ్ము కాస్తున్నారన్నారు. 'మీరు దేశంలోని బ్యాంకులనుంచి రూ.33 వేల కోట్లు ఎగ్గొట్టి విదేశాలకు పారిపోండి. మిమ్మల్ని బీజేపీ ప్రభుత్వం కాపాడుతుంది' అంటూ పరోక్షంగా దేశం వదిలి పారిపోయిన వారిని ప్రభుత్వం రక్షిస్తోందని ఆరోపించారు.
ఆర్థిక మంత్రి అరుణ్ జైట్లీ దీని గురించి ఏం మాట్లాడబోరని.. జైట్లీ, ఆయన కూతురు బడా పెట్టుబడిదారులు కాబట్టే వారు మాట్లాడరని చెప్పారు. ఆర్థిక వ్యవస్థలో దూసుకుపోతున్నామని బీజేపీ పదే పదే చెబుతోందని, కానీ దేశంలో లక్షలాది మంది నిరుద్యోగులు ఉద్యోగాల్లేక తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని చెప్పారు. రైతులు ఆత్మహత్యలకు పాల్పడుతుంటే.. మోడీ వారిని యోగా చేయమం టున్నారని విమర్శిం చారు. ప్రధాని దేశ ప్రజలను తప్పుదోవ పట్టిస్తు న్నారని.. ప్రధాన సమస్యలు ముందు కొచ్చినప్పుడు ఆయన మౌన ముని అవతారం ఎత్తుతున్నారని ఎద్దేవా చేశారు.
దేశంలోని అన్ని వర్గాల ప్రజలు బీజేపీని చూసి భయాందోళనలకు గురవుతున్నారన్నారు. సంఫ్ు అరాచక శక్తులు.. ముస్లింలను పాకిస్థాన్కు వెళ్లిపోవాలని సూచిస్తూ విధ్వంస కాండను సృష్టిస్తున్నాయని చెప్పారు. తమిళుల భాషపై దాడి జరుగుతోందన్నారు. ఈశాన్య రాష్ట్రాల ప్రజల ఆహారపు అలవాట్లపై బీజేపీ దాడి చేస్తోందన్నారు. దేశంలో ప్రశ్నించిన వారిపై హత్యలు చేయిస్తున్నారని.. కల్బుర్గీ, గౌరీ లంకేశ్ హత్యల్ని గుర్తు చేశారు. దేశ చరిత్రలోనే తొలిసారి నలుగురు సుప్రీంకోర్టు సీనియర్ న్యాయమూర్తులు న్యాయం కోసం ప్రజల ముందుకొచ్చారని చెప్పారు.
బీజేపీ పాలనలో నిజాయితీ గల వ్యాపారస్తుల్ని బెదిరిస్తూ అవినీతి అధికారులను ప్రోత్సహిస్తున్నారన్నారు. హత్య కేసులో నిందితుడిగా ఉన్న వ్యక్తి బీజేపీకి అధ్యక్షుడుగా ఉన్నాడంటూ అమిత్షాపై ఆరోపణలు చేశారు. బీజేపీ, ఆర్ఎస్ఎస్ కలిసి దేశంలోని పార్లమెంట్, న్యాయ, పోలీసు వ్యవస్థల్ని నాశనం చేయాలని ప్రయత్నిస్తున్నాయన్నారు. కాంగ్రెస్ పార్టీలో నాయకులకు, కార్యకర్తలకు మధ్య ఓ అడ్డుగోడ ఉన్నదని.. సీనియర్ నాయకుల సాయంతో ఆ గోడను బద్దలు కొట్టి అందరినీ కలుపుకునిపోతానని హామీ ఇచ్చారు. వచ్చే లోక్సభ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ విజయం సాధిస్తుందని ఆశాభావం వ్యక్తం చేశారు.