Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- ఫలించిన కేంద్ర వ్యూహాత్మక మౌనం
- టీడీపీ, టీఆర్ఎస్ పరస్పర ఆరోపణలు
- మరోసారి అవిశ్వాస తీర్మానాలకు అనుమతి నిరాకరణ
- నిరసనలు ప్రజలు చూడొద్దనే రోజంతా వాయిదా : చైర్మెన్ వెంకయ్యనాయుడు
- ఉభయసభలు శుక్రవారానికి వాయిదా
నవతెలంగాణ-న్యూఢిల్లీ బ్యూరో
'విపక్షాలకు విపక్షాలే అడ్డు' అన్నట్టు చిత్రీకరించడంలో మోడీ సర్కారు సఫలీకృతమవుతోంది. పార్లమెంట్లో విపక్ష పార్టీలు చేపడుతున్న నిరసనలపై కేంద్ర సర్కారు అనుసరిస్తున్న వ్యూహాత్మక మౌనం ఫలిస్తోంది. టీఆర్ఎస్, అన్నాడీఎంకే ఆందోళనల వల్లే టీడీపీ, వైసీపీ ప్రవేశపెట్టిన అవిశ్వాస తీర్మానాలకు అనుమతించలేకపోతున్నామనే సంకేతాలను కేంద్రం పంపుతోంది. ఫలితంగా టీఆర్ఎస్, అన్నాడీఎంకే ఆందోళనలపై టీడీపీ, వైసీపీ ఎంపీలు గుర్రుగా ఉన్నారు. 'బీజేపీ రచించిన డ్రామాలో భాగంగానే టీఆర్ఎస్, అన్నాడీఎంకే ఎంపీలు వెల్లోకి వచ్చి ఆందోళనలు చేస్తున్నారు' అని పార్లమెంట్ ఆవరణలో వైసీపీ, టీడీపీ ఎంపీలు ఇటీవల వ్యాఖ్యానించారు. ఈ వ్యాఖ్యలపై ఇటు టీఆర్ఎస్, అన్నాడీంకే ఆగ్రహం వ్యక్తం చేశాయి. తమ రాష్ట్ర డిమాండ్లపై పోరాటం చేసే హక్కు తమకు ఉంటుందని పేర్కొన్నాయి. ఈ విధంగా 'విభజించు పాలించు' అన్నట్టుగా విపక్షాల్లో కేంద్రం చీలిక తీసుకొచ్చింది. పైగా అన్ని అంశాలపై చర్చకు తాము సిద్ధమంటున్నప్పటికీ... టీఆర్ఎస్, అన్నాడీఎంకే డిమాండ్లపై ప్రకటన చేసేందుకు కూడా కేంద్రం నిరాకరిస్తోంది.
ఐదోరోజూ అవిశ్వాస తీర్మానాలకు అనుమతి నిరాకరణ
ప్రత్యేక హోదా డిమాండ్పై ఏపీ ఎంపీలు ప్రవేశపెట్టిన అవిశ్వాస తీర్మానాలకు వరుసగా ఐదో రోజూ స్పీకర్ సుమిత్రా మహాజన్ అనుమతించలేదు. విపక్ష పార్టీలు వెల్లో ఆందోళన చేపడుతుండటంతో ఈ తీర్మానాలకు మద్దతుగా నిల్చున్న ఎంపీలను లెక్కించడం సాధ్యపడటం లేదని పేర్కొన్నారు. అనంతరం సభను శుక్రవారానికి వాయిదా వేశారు. అంతకముందు ఉదయం సభ ప్రారంభం కాగానే పీఎన్బీ కుంభకోణంతో పాటు ప్రత్యేక హోదా, రిజర్వేషన్, కావేరీ జలాల అంశంపై కాంగ్రెస్, సీపీఐ(ఎం), టీడీపీ, వైసీపీ, టీఆర్ఎస్, అన్నాడీఎంకే ఎంపీలు ప్లకార్డులు ప్రదర్శిస్తూ ఆందోళన చేపట్టారు. దీంతో సభను స్పీకర్ మధ్యాహ్నం 12 గంటలకు వాయిదా వేశారు.
రాజ్యసభలోనూ విపక్షాల నిరసన
రాజ్యసభలోనూ విపక్ష పార్టీల ఎంపీల నిరసన కొనసాగింది. ఫలితంగా చైర్మెన్ వెంకయ్యనాయుడు సభను రోజంతా వాయిదా వేశారు. అంతకముందు ఎలాంటి చర్చ చేపట్టకుండా గ్రాట్యుటీ సవరణ బిల్లును పెద్దల సభ ఆమోదించింది. ఈ బిల్లు ఆమోదం పొందిన వెంటనే తమ డిమాండ్లపై కేంద్రం నుంచి సానుకూల ప్రకటన వెలువడకపోవడంతో టీడీపీ, అన్నాడీఎంకే, కాంగ్రెస్ ఎంపీలు వెల్లోకి వచ్చి ఆందోళన చేపట్టారు. విపక్ష ఆందోళనలపై చైర్మెన్ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. 'సభలో దారుణమైన సన్నివేశాలను ప్రజలు చూడొద్దనే సభను వాయిదా వేస్తున్నాను' అని అన్నారు. 'ఒక్కో రోజు ఒక్కో పార్టీ సభను అడ్డుకుంటే వ్యవస్థ ఏం కావాలి' అని ప్రశ్నించారు. ఈ సమయంలో జైరాం రమేష్ లేచి మాజీ ప్రధానమంత్రి ఆంధ్రప్రదేశ్కు ఇచ్చిన వాగ్ధానాలను సభలో గుర్తు చేసే ప్రయత్నం చేశారు. అయితే విపక్ష ఆందోళనలతో చైర్మెన్ సభను వాయిదా వేశారు. అంతకముందు విభజన చట్టంలోని హామీలపై టీడీపీ ఎంపీ సీఎం రమేష్ మాట్లాడారు. అయితే విభజన చట్టం హామీలపై గత సమావేశాల్లోనే సుదీర్ఘ చర్చ జరిగిందని, ఆర్థికమంత్రి సమాధానం కూడా ఇచ్చారని చైర్మెన్ తెలిపారు.
గ్రాట్యుటీ చెల్లింపుల(సవరణ) బిల్లుకు ఏకగ్రీవ ఆమోదం..
ఈ నెల 15న లోక్సభలో ఆమోదం పొందిన గ్రాట్యుటీ చెల్లింపుల(సవరణ) బిల్లుకు రాజ్యసభ ఆమోదం తెలిపింది. ఎలాంటి చర్చ చేపట్టకుండా ముజువాణి ఓటుతో పెద్దల సభ ఈ బిల్లును ఆమోదించింది. ఈ బిల్లును కేంద్ర కార్మిక, ఉపాధి కల్పనా శాఖ మంత్రి సంతోష్కుమార్ గంగ్వార్ సభలో ప్రవేశపెట్టారు. ఈ బిల్లు చాలా ముఖ్యమైనదని, కాబట్టి ఎలాంటి చర్చ చేపట్టకుండా బిల్లు ఆమోదించేందుకు సహకరించాలని కోరారు. వెంకయ్యనాయుడు సైతం బిల్లు ఆమోదానికి సహకరించాలని విపక్షాలను కోరారు. దీంతో బిల్లు ఏకగ్రీవంగా ఆమోదం పొందింది.