Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- కార్బన్ డై ఆక్సైడ్ అణువులతో భావితరాలకు ముప్పు
- 2017లో ప్రపంచ వ్యాప్తంగా విలయాల నష్టం ఖరీదు
- రూ. 20 లక్షల కోట్లు : ఐక్యరాజ్యసమితి వరల్డ్ మెటియొరాలాజికల్ ఆర్గనైజేషన్
న్యూయార్క్ : ప్రపంచం మొత్తం మీద 2017 సంవత్సర కాలంలో వరదలు, తదితర వాతావరణ మార్పుల కారణంగా కనీసం రూ. 20,83,330 కోట్ల నష్టం వచ్చినట్టు ఐక్యరాజ్యసమితి అంచనా వేసింది. ఏది ఏమైనా, గడిచిన మూడేండ్లలో ఆస్ట్రేలియాలో అత్యధిక ఉష్ణోగ్రతలతో అసాధారణమైన వేడి గాలులతో వాతావరణం భయానకంగా సాగిందని వార్షిక నివేదికలో ఐక్యరాజ్యసమితి అనుబంధ వరల్డ్ మెటియొరాలాజికల్ ఆర్గనైజేషన్ తెలియచేసింది. ఈ 2017 సంవత్సర కాలంలో ఇండియాలో కూడా వరదలు, ఇంకా ఇతర వాతావరణ తీవ్రతలు భారీ నష్టాలు కలిగించాయని, ఆ సంవత్సర కాలంలో పరిస్థితే ఇప్పటికీ 2018లో కూడా కొనసాగుతోందని ఈ సంస్థ సెక్రెటరీ జనరల్ పెటెరీ తాలాస్ ఆ నివేదికలో పేర్కొన్నారు. 19వ శతాబ్దం నుంచి సేకరించిన రికార్డులన్నిటిలో 2016 సంవత్సరం అత్యధిక ఉష్ణ వాతావరణం నమోదైన సంవత్సరం కాగా, 2015, 2017 సంవత్సరాలు ఆ తరువాతి స్థానాలను ఆక్రమించాయి. ఎల్ నినో ప్రభావం కారణంగా గత ఏడాది పసిఫిక్ సముద్ర తీరం నుంచి ఉష్ణ గాలులు అన్ని దేశాలను ప్రభావితం చేసాయి. 2018లో యూరోప్, ఉత్తర అమెరికాల్లో అతిశీతల వాయువులు, ఇతర ప్రదేశాల్లో వేడి గాలులు ఈ వాస్తవ స్థితిని ప్రతిబింబిస్తున్నాయని అందులో వ్యాఖ్యానించారు. దాదాపు 8,00,000 సంవత్సరాల కాలంలో ఎన్నడూ లేని విధంగా వాతావరణంలో మిలియన్ (పది లక్షలు) అణువుల్లో 400 పార్టులు కార్బన్ డై ఆక్సైడ్ అణువులున్నట్టు లెక్కకడుతూ, రానున్న తరాలు మరింత ప్రమాదకరమైనకార్బన్ డై ఆక్సైడ్ అణువులతో సహజీవనం సాగించాల్సి ఉంటుందని హెచ్చరించింది. దీనికి 2015లో 200 దేశాలు పారిస్లో సమావేశమై కుదుర్చుకున్న ఒడంబడిక మాత్రమే పరిష్కారమని గుర్తుచేసింది.