Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- దిగ్విజయంగా ఏపీ దిగ్బంధం
- రాష్ట్ర వ్యాప్తంగా కదిలిన ప్రజలు
- ఎక్కడికక్కడ స్తంభించిన ట్రాఫిక్
- డప్పుకొట్టిన మధు, రామకృష్ణ, శివాజి
- గుంటూరులో జగన్ మద్దతు
- ప్రత్యేకంగా టీడీపీ నిరసన
అమరావతి : ఏపీకి ప్రత్యేక హోదా ఇవ్వాలని సాగుతున్న పోరాటం ఉవ్వెత్తున ఎగసింది. ఆంధ్రప్రదేశ్కు ప్రత్యేక తరగతి హోదా, విభజన హామీలను అమలు చేయాలని డిమాండ్ చేస్తూ గురువారం ఏపీ ప్రత్యేక హోదా, విభజన హామీల సాధన సమితి ఆధ్వర్యంలో చేపట్టిన జాతీయ రహదారుల దిగ్బంధం రాష్ట్ర వ్యాప్తంగా విజయవంతమైంది. ఈ కార్యక్రమంలో సీపీఐ, సీపీఐ(ఎం) ఇతర వామపక్షాలు, కాంగ్రెస్, వైసీపీ, జనసేన పార్టీలకు చెందిన నాయకులు, కార్యకర్తలు పెద్దఎత్తున ప్రత్యక్షంగా పాల్గొన్నారు. తెలుగుదేశం పార్టీ మద్దతు తెలిపి పలు చోట్ల నిరసన చేపట్టింది. హోదా ఉద్యమానికి రాష్ట్రంలో ఒక్క బీజేపీ మినహా అన్ని పార్టీలు మద్దతు పలికాయి. జాతీయ రహదారులు ఉదయం 10 నుంచి 12 గంటల వరకు స్తంభించాయి. విజయవాడ కనకదుర్గ వారధి దగ్గర జరిగిన జాతీయ రహదారి దిగ్భంధన కార్యక్రమంలో సీపీఐ(ఎం) ఏపీ రాష్ట్ర కార్యదర్శి పి.మధు, కార్యదర్శివర్గ సభ్యులు వై.వెంకటేశ్వరరావు, సిహెచ్.బాబూరావు, సీపీఐ ఏపీ రాష్ట్ర కార్యదర్శి కె.రామకృష్ణ, సినీ హీరో శివాజీ, వైసీపీ రాష్ట్ర నాయకులు పార్థసారథి, జనసేన కార్యకర్త పోతిన మహేష్ పాల్గొన్నారు. గుంటూరు నగర శివారు అంకిరెడ్డిపాలెం రహదారి వద్ద వైఎస్ జగన్ ఆందోళనకు మద్దతు తెలిపారు. విజయవాడలో ఈలలు వేసి, కర్రసాము చేసి డప్పులు కొట్టి మధు రామకృష్ణ, శివాజి ఆందోళనలో పాల్గొన్న వారికి ఉత్సాహాన్నిచ్చారు. విశాఖ జిల్లాలో ఎనిమిది సెంటర్లలో హైవేలను దిగ్బంధం సాగింది. విశాఖపట్నం మద్దిలపాలెం జంక్షన్లో ప్రత్యేక హోదా, విభజన హామీల సాధన సమితి అధ్యక్షులు చలసాని శ్రీనివాస్, మాజీ మంత్రి కొణతాల రామకృష్ణ, కాంగ్రెస్ నాయకులు ద్రోణంరాజు శ్రీనివాస్ పాల్గొన్నారు. మహిళలు ఆటలు ఆడుతూ తమ నిరసన వ్యక్తం చేశారు. సినీ హీరో శివాజి కర్రసాము చేశారు. ఎవరికీ ఇబ్బంది లేకుండా నిర్వాహకులు అన్ని జాగ్రత్తలూ తీసుకున్నారు. విజయవాడలో బెంజిసర్కిల్, రామవ రప్పాడు వద్ద తమ ఆందోళన వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా సీపీఐ(ఎం)ఏపీ రాష్ట్ర కార్యదర్శి మధు మాట్లాడుతూ బీజేపీ రాష్ట్రాలను ఇబ్బం దులు పెడుతున్నదని తెలిపారు. హోదా ఇస్తామని ఎందుకు ఇవ్వలేదో ఇంత వరకు సమాధానం చెప్పడం లేదని ఆగ్రహం వ్యకం చేశారు. తెలుగుదేశం కూడా ఇప్పుటి వరకూ ఏం చేయకుండా ఇప్పుడు హోదా కోసం పోరాడు తున్నట్టు ఫోజు పెడుతోందన్నారు. సీపీఐ ఏపీ రాష్ట్ర కార్యదర్శి రామకృష్ణ మాట్లాడుతూ హోదాపై బీజేపీ పూర్తి అన్యాయం చేస్తోందని తెలిపారు.