Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- రాష్ట్రంలో 20 శాతం మంది పేదలే!
- సమ్మిళిత వృద్ధితోనే అసమానతలకు చెక్ : ఆర్థిక మంత్రి యనమల
అమరావతి : . రాష్ట్రంలోని 73 శాతం సంపద కేవలం ఒక్క శాతం మంది వద్దే ఉండి పోయిందని, అసమానతలు తగ్గడం లేదని ఆర్థిక మంత్రి యనమల రామకృష్ణుడు అన్నారు. ఆర్థికాభివృద్ధిలో అందరినీ భాగస్వాములుగా చేయకుంటే ఈ అసమానతలు పెరుగుతాయని స్పష్టం చేశారు. 344వ నిబంధన కింద సమ్మిళిత వృద్ధి అనే అంశంపై శుక్రవారం అసెంబ్లీలో ఆయన మాట్లాడారు. తాజాగా ఆక్సఫర్డ్ యూనివర్సిటీ వారు చేసిన మల్టీ డైమన్షనల్ సర్వే ప్రకారం రాష్ట్రంలో పేదలు 21 శాతంమని తేలిందన్నారు. పేదరిక నిష్పత్తి తగ్గినా పేదల సంఖ్య పెరిగిందని మంత్రి స్పష్టం చేశారు.
ఆంధ్రప్రదేశ్ను పావర్టీ ఫ్రీ స్టేట్గా చేయడానికి రాష్ట్ర ప్రభుత్వం అనేక చర్యలు చేపడుతోందని, అయితే అభివృద్ధిలో పేదలకు స్థానం లేకపోవడం సమస్యకు కారణమని ఆయన విశ్లేషించారు. సర్వీస్ సెక్టార్ బావుంటే అసమా నతలు తగ్గి రాష్ట్రంలో సమ్మిళిత అభివృద్ధి సాధ్యమవుతుందని యనమల అంచనా వేశారు. అందుకే సంక్షేమం కోసం ఈ ఏడాది బడ్జెట్లో సుమారు రూ.67 వేల కోట్లు కేటాయించామన్నారు. పేదల ఆదాయం పెరగాలన్న ముఖ్యమంత్రి చంద్రబాబు ఉద్దేశానికి అనుగుణంగా కేటాయింపులు చేసినట్లు వివరించారు. సోషల్ ఎంట్రప్రెన్యూర్స్ని తయారు చేయాలనే లక్ష్యంతో ముందుకెళ్తున్నామన్నారు. ఎస్సీ, ఎస్టీ, బిసిలను పారిశ్రామికంగా అభివృద్ధి చేసి వారు కూడా పెట్టుబడులు పెట్టగలిగేలా ప్రణాళికలు రూపొందిస్తున్నట్లు పేర్కొన్నారు. వ్యవసాయ ఆధారిత ఆంధ్రప్రదేశ్లో 71 శాతం జనాభా గ్రామాల్లో ఉండటం కూడా సమ్మిళిత వృద్ధి కుంటుబడటానికి కారణాలని తెలిపారు. ముందు ఈ అంశంపై ఎమ్మెల్యేలు బండారు సత్యనారాయణమూర్తి, సుగణమ్మ, తంగిరాల సౌమ్య మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమ పథకాలపై హర్షం వ్యక్తం చేశారు.