Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- బీఏఏ, ఏఐకేఎస్ నేతల మండిపాటు
న్యూఢిల్లీ: ఈశాన్య రాష్ట్రాలకు ప్రత్యేక హోదాను నిలిపివేయడం, ఆ ప్రాంతంలో కాషాయ ఉగ్రవాదం పెరిగిపోవడం పట్ల భూమి అధికార్ ఆందోళన్ (బీఏఏ) ఆగ్రహం వ్యక్తం చేసింది. త్రిపురలో బీజేపీ అధికారం చేపట్టిన తర్వాత రాజకీయాల్లో, సమాజంలో కాషాయీకరణకు ప్రయత్నిస్తూ ప్రతిపక్షాలు, అసమ్మతి గొంతులపై అణచివేత చర్యలకు పాల్పడుతోందని బీఏఏ ఆందోళన వ్యక్తం చేసింది. ఓ ప్రణాళికగా సీపీఐ(ఎం) కార్యకర్తలు, సానుభూతి పరులపై దాడులకు పాల్పడుతూ, పార్టీ ఆఫీసులు, ఆస్తుల్ని ధ్వంసం చేస్తూ భయానక వాతారణం సృష్టించారని బీఏఏ మండిపడింది. 1969 నుంచి ఈశాన్య రాష్ట్రాలకు అమలు చేస్తున్న ప్రత్యేక హోదాను తొలగించడం వల్ల ఆర్థిక వ్యవస్థ సంక్షోభంలోకి నెట్టబడిందని కృషక్ ముక్తి సంగ్రామ్ సమితి నేత అఖిల్గొగోరు అన్నారు. హోదా నిలిపివేతతో కేంద్రం నుంచి ఈశాన్య రాష్ట్రాలకు రావాల్సిన నిధులకు కోత పడిందని ఆయన గుర్తు చేశారు. హోదా ఉన్న రాష్ట్రాలకు కేంద్ర పథకాలకు అయ్యే ఖర్చులో 90శాతం కేంద్రమే భరించాలి. ఈ పథకాలకు మిగతా రాష్ట్రాలకైతే కేంద్రం 60శాతం మాత్రమే భరిస్తుందన్నది గమనార్హం. జీఎస్టీ అమలులోకి రావ డంతో ఈ రాష్ట్రాలకు పన్నుల ఆదాయం కూడా లేకుండా పోయిందని గొగోరు అన్నారు. ప్రత్యేక హోదా కింద ఈశాన్య పరిశ్రమల పెట్టుబడుల ప్రోత్సాహక విధానం(ఎన్ఈఐఐపీపీ) అమలులో ఉండేదని, రాయితీలు, ప్రోత్సాహకాలు ఈ ప్రాంతంలో పరిశ్రమల వృద్ధికి ఊతమిచ్చేవని గొగోరు తెలిపారు. దానిస్థానంలో మధ్యకాలికంగా ఈశాన్య పారిశ్రామిక అభివృద్ధి పథకాన్ని(ఎన్ఈఐడీఎస్) అమలులోకి తెచ్చారని ఆయన గుర్తు చేశారు. దీంతో, కేంద్ర బడ్జెట్లో 8 ఈశాన్య రాష్ట్రాలకు 2020 వరకూ రూ.3000 కోట్లకే నిధుల్ని పరిమితం చేశారని ఆయన తెలిపారు. ఈప్రాంతంలో 32శాతంమంది సన్నకారు రైతులు, 28 శాతం భూమి లేని పేదలు ఉన్నారని ఆయన తెలిపారు. భూసంస్కరణలు అమలు చేయడం పట్ల కేంద్ర ప్రభుత్వానికి శ్రద్ధ లేదని ఆయన దుయ్యబట్టారు. ఈ ప్రాంత సామాజి క సామరస్యతకు విఘాతం కలిగించే ఈ చట్టానికి వ్యతిరేకంగా పోరాడనున్నట్టు ఆయన తెలిపారు. అస్సాంలాంటి ఈశాన్య రాష్ట్రాలు ఒకప్పుడు ఎంతో సంపన్న ప్రాంతాలని భారత ఉపఖండం విభజన తర్వాత చికెన్ కారిడార్ పేరుతో నిర్లక్ష్యాని కి గురై వెనకబడ్డాయని ఏఐకేఎస్ జాయింట్ సెక్రెటరీ, త్రిపుర ఎంపీ జితేంద్ర చౌదరి తెలిపారు. హిందూ దేశంగా మార్చాలన్న లక్ష్యంతో బీజేపీ అధికారం చేపట్టి న తర్వాత ఈ దేశంలోని వైవిధ్య సంస్కృతి దాడులకు గురవుతోందని డాక్టర్ సునీ లమ్ అన్నారు. విభజించి పాలించు సూత్రాన్ని బీజేపీ అనుసరిస్తున్నదని సునీలమ్ దుయ్యబట్టారు. ఏఐకేఎస్ నేత మొల్లా మాట్లాడుతూ బీఏఏను 14 రాష్ట్రాల్లో ఏర్పాటు చేశామని, రాష్ట్ర కమిటీల ఏర్పాటు ప్రక్రియ ప్రారంభించామని తెలిపారు. దేశంలోని అన్ని ప్రాంతాలకూ విస్తరించి రైతుల సమస్యలపై సంఘటిత పోరాటాలు నిర్వహించడంపై దృష్టి సారించనున్నట్టు ఆయన తెలిపారు.