Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- పంట బీమా పంపిణీ కింద అందించిన తమిళనాడు ప్రభుత్వం
- యోగి బాటలో పళని స్వామి
చెన్నై : భయంకరమైన కరువు పరిస్థితులను ఎదుర్కొన్న తమిళనాడు రైతులు గతేడాది దేశ రాజధాని ఢిల్లీలో 144 రోజులపాటు వినూత్న ఆందోళన చేపట్టిన విషయం తెలిసిందే. వారి ఆందోళన దేశవ్యాప్తంగా చర్చనీయాంశమైంది. కనీస మద్దతు ధర కల్పించాలని, ఎంఎస్ స్వామినాథన్ కమిటీ సిఫారసులను అమలుచేయాలని రైతులు పెద్దఎత్తున ఆందోళన చేపట్టారు. వారి ఆందోళన వివిధ రాష్ట్రాల్లో రైతుల ఉద్యమానికి బాట వేసింది. కాగా, ఇప్పుడు తమిళనాడు రైతులు మరో విపత్కర పరిస్థితిని ఎదుర్కొన్నారు. పంట బీమా పథకం కింద తమిళనాడు ప్రభుత్వం రైతులకు గత నెలలో చెక్కులు అందించింది. వాటిని చూసిన రైతులు అవాక్కయ్యారు. దిండిగల్, నగపట్టణం జిల్లాల్లోని రైతుకు రూ. 3 నుంచి మొదలుకొని రూ. 10 వరకూ మొత్తాలతో కూడిన చెక్కులను ఇచ్చారు. ప్రతిపక్ష డీఎంకే ఎమ్మెల్యేలు అసెంబ్లీలో శుక్రవారం ఈ అంశాన్ని లేవనెత్తడంతో విషయం వెలుగులోకి వచ్చింది. పంట నష్టపరిహారం కింద ఇన్సూరెన్స్ కంపెనీల ద్వారా రాష్ట్ర రైతులకు ఎకరా వరికి రూ. 26 వేలు, పప్పుధాన్యాల పంటకు ఎకరాకు రూ. 12వేలు, చిరుధాన్యాలకు రూ. 20 వేలు చెల్లించాలి. దిండిగల్లో రైతులకు కేంద్ర కో-ఆపరేటివ్ బ్యాంకు లిమిటెడ్ పంట నష్టపోయిన రైతులకు ఫిబ్రవరిలో ఈ చెక్కులను అందించింది. దీనిపై అసెంబ్లీలో మంత్రులు మాట్లాడుతూ పొరపాటు జరిగిందని.. దానిని సరిచేస్తా మని చెప్పారు. వ్యవసాయ శాఖ మంత్రి దొరైకన్ను మాట్లాడుతూ త్వరలో ఈ సమస్యను పరిష్కరిస్తామని చెప్పారు. గతంలోనూ ఉత్తరప్రదేశ్ ప్రభుత్వం గత ఏడాది సెప్టెంబరులో రైతులకు రుణమాఫీ కింద రూ. 10ల మొత్తంతో చెక్కులను అందించింది. అంతేకాదు, 17 వేల మందికి పైగా రైతులకు రూ. .1,000ల రుణమాఫీ సర్టిఫికెట్లను అందించింది. దీనిపై యూపీ ప్రభుత్వం తీవ్ర విమర్శలు ఎదుర్కొన్నది.