Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- అవిశ్వాస నోటీసుకు ఆరోసారి అనుమతి నిరాకరణ
- ఉభయసభలు మంగళవారానికి వాయిదా
నవతెలంగాణ-న్యూఢిల్లీబ్యూరో
పార్లమెంట్ ప్రతిష్టంభన వీడటం లేదు. విపక్షాల డిమాండ్లపై కేంద్రం మౌనం దాల్చడంతో ఉభయసభలు మరోసారి వాయిదాలకే పరిమితమయ్యాయి. ప్రధానంగా రిజర్వేషన్ కోటా పెంపు, కావేరీ నదీ నిర్వహణ బోర్డుపై టీఆర్ఎస్, అన్నాడీఎంకే ఎంపీలు లోక్సభ, రాజ్యసభను కుదిపేశారు. ఫలితంగా ఉభయసభలు మంగళవారానికి వాయిదా పడ్డాయి. రామనవమి సందర్భంగా సోమవారం పార్లమెంట్కు సెలవు ప్రకటించారు. ఇక ఏపీ ప్రత్యేక హోదా డిమాండ్పై వైసీపీ, టీడీపీ ప్రవేశపెట్టిన అవిశ్వాస తీర్మానాలకు స్పీకర్ సుమిత్రా మహాజన్ ఆరో రోజూ అనుమతి నిరాకరించారు. సభ ఆర్డర్లో లేదని, తీర్మానాలను అనుమతించలేనని చెప్పారు.
ఉదయం లోక్సభ ప్రారంభమైన వెంటనే వివిధ డిమాండ్లపై టీడీపీ, వైసీపీ, టీఆర్ఎస్, అన్నాడీఎంకే ఎంపీలు వెల్లోకి దూసుకొచ్చి ప్రశ్నోత్తరాలను అడ్డుకున్నారు. దీంతో స్పీకర్ సుమిత్రా మహాజన్ సభను మధ్యాహ్నం 12 గంటలకు వాయిదా వేశారు. అనంతరం సభ ప్రారంభమైన తరువాత అవిశ్వాస తీర్మానాల నోటీసులపై స్పీకర్ ప్రకటన చేశారు. వైవీ సుబ్బారెడ్డి, తోట నరసింహం అందించిన అవిశ్వాస నోటీసులు అందాయని తెలిపారు. అయితే విపక్ష ఎంపీల ఆందోళనలతో ఈ నోటీసులకు మద్దతుగా నిల్చున్న ఎంపీలను లెక్కించడం సాధ్యపడటం లేదని తెలిపారు. కనీసం నోటీసులకు మద్దతిచ్చే ఎంపీలందరూ ఒకవైపుగా వస్తే లెక్కిస్తానని అన్నారు. ఇదే సమయంలో టీఆర్ఎస్, అన్నాడీఎంకే ఎంపీలు ఆందోళన తీవ్రతరం చేయడంతో సభను మంగళవారానికి వాయిదా వేశారు.
నిరవధిక వాయిదా గురించి అడుగుతున్నారు : చైర్మెన్ వెంకయ్యనాయుడు
మూడు వారాలుగా సభ సజావుగా సాగకపోవడంతో ఎందుకు నిరవధిక వాయిదా వేయడం లేదని శ్రేయాభిలాషులు, ప్రజలు తనను అడుగుతున్నారని చైర్మెన్ వెంకయ్యనాయుడు రాజ్యసభలో చెప్పారు. ఉదయం సభ ప్రారంభమైన తరువాత ఈ మేరకు ప్రకటన చేశారు. సభ వాయిదా వేయడం తన చేతిలో లేదని అన్నారు. కనీసం సోమవారానికైనా ఒక అవగాహనకు వచ్చి సభ సజావుగా జరిగేలా చూడాలని అధికార, ప్రతిపక్ష సభ్యులకు సూచించారు. మరోవైపు ప్రత్యేక హోదాతో పాటు కావేరీ నదీ జలాల అంశంపై టీడీపీ, అన్నాడీంకే ఆందోళన చేపట్టడంతో చైర్మెన్ సభను 27వ తేదీకి వాయిదా వేశారు.
భగత్సింగ్, రాజ్గురు, సుఖ్దేవ్లకు పార్లమెంట్ శ్రద్ధాంజలి...
షహీద్ భగత్సింగ్, రాజ్గురు, సుఖ్దేవ్ల వర్థంతి సందర్భంగా శుక్రవారం పార్లమెంట్ శ్రద్ధాంజలి ఘటించింది. విదేశీ పాలన నుంచి భారతదేశాన్ని విముక్తి చేసేందుకు ఈ వీరులు చేసిన ప్రాణత్యాగాలను స్మరించుకున్నది. ఉదయం లోక్సభ ప్రారంభమైన వెంటనే స్పీకర్ సుమిత్రా మహాజన్ శ్రద్ధాంజలి ఘటించారు. 'దేశాన్ని విదేశీపాలన బంధనాల నుంచి విముక్తి చేసేందుకు భగత్సింగ్, శివరాం హరి రాజ్గురు, సుఖేదేవ్ థాపర్లు 23 మార్చి 1931లో ప్రాణత్యాగం చేశారు' అని స్పీకర్ కొనియాడారు. 'ఈ అమరుల వీరత్వం, శౌర్యం, దేశభక్తి మనందరికీ ఎప్పుడూ ప్రేరణగా నిలుస్తుంది. ఈ నేపథ్యంలో షహీద్ భగత్సింగ్, రాజ్గురు, సుఖ్దేవ్లతో పాటు స్వాతంత్య్ర సంగ్రామంలో ప్రాణాలు అర్పించిన ప్రతి ఒక్కరికీ శ్రద్ధాంజలి ఘటిస్తున్నాం' అని అన్నారు. ఈ సందర్భంగా ఎంపీలు కొద్దిసేపు మౌనం పాటించారు. రాజ్యసభలోనూ చైర్మెన్ వెంకయ్యనాయుడు నివాళులర్పించారు.
కాంగ్రెస్ అవిశ్వాస అస్త్రం
- బీజేపీకి మరిన్ని చిక్కులు
- మంగళవారం సభ ముందుకు వచ్చే అవకాశం
కేంద్రంలోని మోడీ సర్కారుపై ప్రధాన ప్రతిపక్ష కాంగ్రెస్ పార్టీ అవిశ్వాస అస్త్రం సంధించింది. ఇప్పటి వరకు టీడీపీ, వైసీపీ ప్రవేశపెట్టిన అవిశ్వాస తీర్మానాలకు కాంగ్రెస్ పార్టీ మద్దతిస్తోంది. అయితే టీఆర్ఎస్, అన్నాడీఎంకే ఎంపీల ఆందోళనలతో గత ఆరు రోజులుగా అవిశ్వాస తీర్మానాలను స్పీకర్ అనుమతించలేదు. ఈ నేపథ్యంలో కాంగ్రెస్ పార్టీ స్వయంగా రంగంలోకి దిగింది. ఆ పార్టీ లోక్సభాపక్ష మల్లిఖార్జునఖర్గే శుక్రవారం లోక్సభా సెక్రెటరీ జనరల్కు అవిశ్వాస తీర్మాన నోటీసు అందించారు. మంగళవారం సభా జాబితాలో ఈ నోటీసు చేర్చాలని విజ్ఞప్తి చేశారు. ఈ సభ కేంద్రంపై అవిశ్వాసం వ్యక్తం చేస్తున్నదని నోటీసులో పేర్కొన్నారు. ఇప్పటికే వైసీపీ, టీడీపీ అవిశ్వాస తీర్మానాలతో నైతికంగా దెబ్బతిన్న బీజేపీకి.. కాంగ్రెస్ పార్టీ నుంచి గట్టిషాక్ తగిలినట్టయ్యింది. బీజేపీకి వ్యతిరేకంగా విపక్షాలను ఐక్యం చేయడంలో ఆ పార్టీ ప్రధాన పాత్ర పోషిస్తోంది. ఇటీవల కాంగ్రెస్ పార్టీ మాజీ అధ్యక్షురాలు సోనియాగాంధీ నేతృత్వంలో 17 విపక్ష పార్టీలకు చెందిన నేతలకు విందు ఏర్పాటు చేసిన విషయం తెలిసిందే. బీజేపీకి తామే ప్రత్యామ్నాయం అన్న సంకేతాన్ని దేశవ్యాప్తంగా పంపించడం, అదే సమయంలో ఏపీలో కోల్పోయిన పరపతిని తిరిగి రాబట్టుకోవడం లక్ష్యంగా అవిశ్వాస నోటీసు అందించినట్టు తెలుస్తోంది. అయితే కాంగ్రెస్ అవిశ్వాస నోటీసుపై టీఆర్ఎస్, అన్నాడీఎంకే ఏం వైఖరి తీసుకుంటాయో వేచిచూడాలి.