Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- రాజ్యసభలో కేంద్రం వెల్లడి
దేశానికి రైతు వెన్నెముక అని పాలకులు ప్రసంగాల్లో దంచేస్తుంటారు. నిజంగా అలాంటి పరిస్థితులులేవన్నది మాత్రం నిర్వివాదాంశం. గిట్టుబాటుధరలేక.. పెట్టిన పెట్టుబడుల రాక..రైతాంగం రోడ్డెక్కుతున్న ఘటనలు ఎన్డీయే సర్కారు ఎక్కువవుతున్నాయి. ఇలాంటి పరిస్థితుల్లో.. అన్నదాతకు నెలకు వస్తున్న ఆదాయం ఎంత..? నేటి పరుగుల జీవితంలో అతనికి వచ్చే ఆదాయం సరిపోతుందా..! ఇంతకీ కేంద్రం నివేదికల్లో రైతు ఆదాయం గురించి చెప్పిన లెక్కలేంటీ.?
నవతెలంగాణ-న్యూఢిల్లీబ్యూరో
దేశంలో ఒక రైతు కుటుంబం అన్ని వనరుల నుంచి పొందే సగటు ఆదాయం నెలకు కేవలం రూ.6,426 మాత్రమేనని కేంద్ర వ్యవసాయ శాఖ సహాయ మంత్రి గజేంద్రసింగ్ షెకావత్ తెలిపారు. రాజ్యసభలో వైసీపీ ఎంపీ విజయసాయిరెడ్డి అడిగిన ఓ ప్రశ్నకు శుక్రవారం ఈ మేరకు రాతపూర్వక సమాధానం ఇచ్చారు. దేశంలో వ్యవసాయంపై ఆధారపడి జీవించే రైతు కుటుంబాల వార్షిక ఆదాయ గణంకాలను జాతీయ శాంపిల్ సర్వే ఆధ్వర్యంలో 2013 జనవరి నుంచి డిసెంబర్ వరకు సేకరించినట్టు మంత్రి తెలిపారు.
ఆ సర్వే వివరాల ప్రకారం దేశంలో ఒక రైతు కుటుంబం నెలసరి ఆదాయం రూ. 6,426 అంచనా వేసినట్టు వివరించారు. జులై 2018-జూన్ 2019 వ్యవసాయ సంవత్సరానికి సంబంధించి రైతు కుటుంబాల వార్షిక ఆదాయ గణంకాల సేకరణ కార్యక్రమాన్ని నేషనల్ శాంపిల్ సర్వే జనవరి 2019 నుంచి డిసెంబర్ 2019 మధ్య చేపట్టనున్నదని మంత్రి తెలిపారు. అయితే మైక్రో ఇరిగేషన్ పద్ధతులను అనుసరించడం వల్ల సేద్యపుఖర్చులను తగ్గించుకోవడంతో పాటు పంట ఉత్పాదకను పెంచుకోవచ్చని, రైతుల ఆదాయం గణనీయంగా పెరుగుతుందని ఒక అధ్యయనం ద్వారా వెల్లడైందని పేర్కొన్నారు. ప్రస్తుతం రైతుకు వచ్చే నెలవారీ ఆదాయాన్ని పెంచటానికి ఏవిధంగా సహకరించారో చెప్పమని రైతుసంఘాలు నిలదీస్తుంటే.. 2022 లో వ్యవసాయఉత్పత్తులకు రెండింతలు చేస్తామంటున్నది మోడీ సర్కారు.