Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- జేఎన్యూ విద్యార్థులు, ఉపాధ్యాయులపై పోలీసుల దౌర్జన్యం
- పార్లమెంట్ మార్చ్ను అడ్డుకునేందుకు వాటర్ కెనాన్ల ప్రయోగం
- అయినా వెనక్కి తగ్గని విద్యార్థులు.. నినాదాలతో హోరెత్తిన ఢిల్లీ వీధులు
న్యూఢిల్లీ : విద్య ప్రయివేటీకరణకు వ్యతిరేకంగా, లైంగికవేధింపుల ఆరోపణలు ఎదుర్కొంటున్న ప్రొఫెసర్ అతుల్ జోహ్రీని సస్పెండ్ చేయాలని డిమాండ్ చేస్తూ జేఎన్యూ విద్యార్థులు, ఉపాధ్యాయులు చేపట్టిన పార్లమెంట్ మార్చ్పై పోలీసులు విరుచుకుపడ్డారు.
ప్రదర్శన ఇలా..
గత కొద్ది రోజులుగా ఆందోళన చేస్తున్న జేఎన్యూ విద్యార్థులు మాము చేస్తున్న ఆందోళనను ప్రభుత్వం,పోలీసులు నిమ్మకునీరెత్తినట్టుగా వ్యవహరిస్తున్నారంటూ పార్లమెంట్ మార్చ్కు సిద్ధమయ్యారు. ఈ నిరసనప్రదర్శనలో పాల్గొనాలని జేఎన్యూ స్టూడెంట్ యూనియన్ పలు వర్సిటీల విద్యార్థులను కోరింది. దీంతో పలు వర్సిటీలకు చెందిన విద్యార్థులంతా భారీ సంఖ్యలో తరలివచ్చారు. జవహర్లాల్ నెహ్రూ విశ్వవిద్యాలయ విద్యార్థులు,ప్రొఫెసర్లు వర్సిటీ క్యాంపస్ నుంచి పార్లమెంటు వరకూ ర్యాలీ చేపట్టారు. మధ్యాహ్నం రెండుగంటలకు ర్యాలీ మొదలైంది. సుమారు రెండువేలకు పైగా విద్యార్థులు నిరసన కార్యక్రమంలో పాల్గొన్నారు. ఈ ప్రదర్శన పార్లమెంట్ మార్చ్కు బయలుదేరటంతో.. పోలీసులు అప్రమత్తమయ్యారు. ఎక్కడికక్కడ బ్యారికేడ్లు ఏర్పాటు చేశారు. భారీగా వస్తున్న నిరసనకారులను రోప్ టీమ్లతో అడ్డుకునే ప్రయత్నం చేశారు.
ఈ సందర్భంగా.. విద్యార్థిసంఘ నేతలు మాట్లాడుతూ.. తాము చేస్తున్న ఆందోళనకు పరిష్కారం చూపాలంటూ నినాదాలు చేశారు. పలువురు విద్యార్థినులను కొంతకాలంగా లైంగికంగా వేధిస్తున్న జోహ్రీని వెంటనే సస్పెండ్ చేయాలని, విద్య ప్రయివేటీకరణను ఆపాలని, స్వయం ప్రతిపత్తి పేరుతో ప్రభుత్వ విద్యను నాశనం చేసే ప్రక్రియ రద్దు చేయాలి. విద్యా ప్రైవేటీకరణ, కాషాయికరణకు వ్యతిరేకించాలన్న నినాదాలతో ఆ ప్రాంతంలో మారుమోగింది. జెఎన్యు నార్త్ గేట్ వద్ద నుంచి వేలాది మందితో ప్రారంభమైన లాంగ్ మార్చ్ శాంతి యుతంగా వివిధ ప్రధాన ప్రాంతాల మీదుగా కాలిబాటన విద్యార్థులు, ప్రొఫెసర్ల నినాదాల చేసుకుంటూ ఐఎన్ఎ మార్కెట్ ప్రాంతంలో సంజరు పార్క్ వద్దకు చేరుకున్నారు. ఢిల్లీ పోలీసులు అక్కడ రోడ్డును బ్లాక్ చేసి లాంగ్ మార్చ్ను ముందుగు సాగనివ్వలేదు. దీంతో విద్యార్థులు పెద్ద ఎత్తున ప్రతిఘటించారు. పోలీసులు ఏకంగా వాటర్ కెనాన్స్ ఉపయోగించి విద్యార్థులను, ప్రొఫెసర్లను చెల్లా చెదురు చేశారు. అంతటితో ఆగకుండా విద్యార్థులు, ప్రొఫెసర్లపై మోడీ సర్కార్ పోలీసులు లాఠీచార్జీకి పాల్పడ్డారు. విద్యార్థినులని కూడా చూడకుండా లాఠీలను ఝులిపించారు. చదువుల చెప్పే గురువులపై పోలీసులు తమ ప్రతాపం చూపించారు. పోలీసుల దాడిలో పలువురు విద్యార్థులు, ప్రొఫెసర్లు తీవ్రంగా గాయపడ్డారు. 23 మంది విద్యార్థులను అరెస్టు చేసి స్థానిక లైసెన్సింగ్ కాలనీ డిఫెన్స్ యూనిట్ పోలీస్ స్టేషన్కు తరలించారు. అరెస్టు అయిన వారిలో ఎనిమిది మంది విద్యార్థినీలు కూడా ఉన్నారు. అరెస్టు చేసిన తరువాత కూడా పోలీస్ స్టేషన్లో పెట్టి చితకబాదారు.
సీపీఐ(ఎం) సంఘీభావం
విద్యార్థుల అరెస్టు విషయం తెలుసుకున్న సీపీఐ(ఎం) పొలిట్ బ్యూరో సభ్యులు సుభాషిణీ అలీ, ఎంపీ సోం ప్రసాద్, కేంద్ర కమిటీ సభ్యుడు విజూ కృష్ణన్ పోలీస్ స్టేషన్కు వెళ్లి విద్యార్థులకు అండగా నిలిచారు. పోలీసుల తీరుపై మండిపడ్డారు. విద్యార్థుల పట్ల వ్యవహరించే తీరు ఇదా.. అంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు.
అరెస్టు చేసిన విద్యార్థులను విడుదల చేయాలని ఆందోళన
మరోవైపు అరెస్టు చేసిన విద్యార్థులను వెంటనే విడుదల చేయాలని వేలాది మంది విద్యార్థులు ఐఎన్ఏ మార్కెట్ వద్ద రోడ్డుపైనే ఆందోళనకు దిగారు. ఆరు గంటల నుంచి రాత్రి 10 గంటల వరకు ఆందోళన సాగించారు. విద్యార్థుల ఆందోళన వద్ద చేరుకున్న సీపీఐ(ఎం) పొలిట్ బ్యూరో సభ్యులు బృందా కరత్, సీపీఐ(ఎం) ఎంపీలు ఎండి సలీం, ఐద్వా నేత మరియం దావలే, కాంగ్రెస్ ఎంపీ సుస్మిత దేవ్, మాజీ ఎంపీ అశోక్ తన్విర్ సంఘీభావాన్ని ప్రకటించారు. శాంతియుతంగా నిర్వహించిన లాంగ్ మార్చ్పై చేసిన దాడిని సీపీఐ(ఎం) తీవ్రంగా ఖండించింది.
న్యాయాన్ని హత్య చేశారు : బృందాకరత్
ఈ సందర్భంగా బృందా కరత్ మాట్లాడుతూ లైంగిక వేధింపులకు పాల్పడిన ప్రొఫెసర్ అతుల్ జోహ్రీకి బెయిల్ ఇచ్చి న్యాయాన్ని హత్య చేశారని విమర్శించారు. ఎనిమిది మంది విద్యార్థినీలు ఆయనపై ఫిర్యాదు చేయగా, విద్యార్థులు, ప్రొఫెసర్ల ఆందోళనతో నాలుగు రోజుల తరువాత ఆయనను అరెస్టు చేశారు. అరెస్టు అయిన వెంటనే 80 నిమిషాలకే బెయిల్ మంజూరు చేశారని విమర్శించారు. విద్యా రంగం పట్ల మోడీ సర్కార్ దారుణంగా ఉందని, ప్రైవేటీకరణకు, కాషాయ కరణకు తలుపులు బార్ల తీసి ఉంచారని విమర్శించారు. జేఎన్యూఎస్యూ ప్రధాన కార్యదర్శి దుగ్గిరాల శ్రీకృష్ణ మాట్లాడుతూ శాంతియుతంగా చేస్తోన్న లాంగ్మార్చ్పై మోడీ సర్కార్ పోలీసులు దాడి చేశారని, మోడీ కాలం చెల్లిందని అన్నారు. ఆందోళన చేస్తున్న విద్యార్థులకు, ప్రొఫెసర్లకు భారత ప్రజాతంత్ర మహిళ సంఘం(ఐద్వా) వాటర్, బిస్కెట్లను అందించింది. ఈ కార్యక్రమంలో ఢిల్లీ యూనివర్శిటీ విద్యార్థులు, వివిధ ప్రజా సంఘాల నేతలు పాల్గొన్నారు.