Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- యుద్ధాల్లో కంటే సూసైడ్లే అధికం
- ఏడాదికి సగటున 9000 మంది సిబ్బంది స్వచ్ఛంద రాజీనామా
న్యూఢిల్లీ: గత ఆరేండ్ల కాలంలో దాదాపు 700మంది జవాన్లు ఆత్మహత్యలకు పాల్పడ్డారని కేంద్రహోం మంత్రిత్వ శాఖ వెల్లడించింది. యుద్ధాల్లో మరణించిన వారి కంటే ఆత్మహత్యలు చేసుకున్నవారే అధికంగా ఉన్నారని బీజేపీ నేత మురళి మనోహర్ జోషి నేతృత్వంలోని పార్లమెంటరీ ప్యానల్కు తెలిపింది. స్వచ్ఛందంగా రాజీనామా చేసే సిబ్బంది సంఖ్య యేటా 9000మంది వరకు ఉన్నారని పేర్కొంది. దీనికి మానసిక అస్థిరత, ఒంటరితనం, అంతర్గతంగా ఏర్పడే ఘర్షణలు, కలహాలే ప్రధాన కారణమని వివరించింది. భద్రతాసిబ్బంది ఆత్మహత్యలు, స్వచ్ఛంద రాజీనామాలపై పార్లమెంటరీ కమిటీ అడిగిన సమాచారానికిగాను కేంద్ర హోం కార్యదర్శి నేతృత్వంలో హోం మంత్రిత్వ శాఖ ఈ మేరకు తెలిపింది. అయితే కచ్చితంగా ఆరేండ్ల కాలం కాకుండా వివిధ ఏండ్లలో ఆర్మ్డ్ ఫోర్సెస్లో సంభవించిన ఘటనలను వెల్లడించింది. హోం మంత్రిత్వ శాఖ తెలిపిన వివరాల ప్రకారం..2012లో సెంట్రల్ రిజర్వ్ పోలీస్ ఫోర్స్(సీఆర్పీఎఫ్)లో 189మంది ఆత్మహత్యలు చేసుకోగా, 175మంది యుద్ధాల్లో మరణించారు. 2001లో బోర్డర్ సెక్యూరిటీ ఫోర్స్(బీఎస్ఎఫ్)లో 529మంది సూసైడ్లకు పాల్పడగా, 491మంది యుద్ధాల్లో చనిపోయారు. 2013లో సెంట్రల్ ఇండిస్టీయల్ సెక్యూరిటీ ఫోర్స్(సీఐఎస్ఎఫ్)లో 63మంది ఆత్మహత్యలు చేసుకోగా, ఒక్క జవాన్ మాత్రమే డ్యూటీలో చనిపోయారు. 2013లో సశస్త్ర సీమా బల్(ఎస్ఎస్బీ)లో 32మంది ఆత్మహత్యలకు పాల్పడగా, నలుగురు యుద్ధాల్లో మరణించారు. 2014లో అస్సాం రైఫిల్స్లో 27మంది సిబ్బంది సూసైడ్లకు పాల్పడగా, 33మంది యుద్ధాల్లో చనిపోయారు. అస్థిరత, ఒంటరితనం, కలహాలతో పాటు ఇంటినుంచి 10-11నెలలు దూరంగా ఉండటంతో వైవాహిక జీవితంలో ఆటంకాలు ఏర్పడటం, అనుమానాలు, ఆరోపణలు తలెత్తడంతో అవి ఆత్మహత్యలకు దారితీస్తున్నాయని కేంద్ర హోం కార్యదర్శి వివరించారు. హోం మంత్రిత్వ శాఖ కింద చేసే ఉద్యోగుల్లో అధికంగా పని భారం పడటం, వ్యక్తిగత సెలవులు లేకపోవడంతో పాటు ఓ ప్రాంతంలో స్థిరంగా ఉండకుండా దేశంలోని వివిధ ప్రాంతాలకు తిరుగుతుండటం కూడా ఆత్మహత్యలకు పురికొల్పే అంశాలుగా ఉన్నాయని తెలిపారు.