Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- పాఠశాలల్లో, పని ప్రదేశాల్లో దళితులు, ఆదివాసీలకు వివక్ష
- ఏండ్లుగా కొనసాగుతున్న సామాజిక రుగ్మత
- దేవాలయాలు, వివాహాల్లో...కుల పట్టింపులు
వాషింగ్టన్ : అత్యంత అభివృద్ధి చెందిన దేశంగా ప్రపంచమంతా భావిస్తున్న అమెరికాలో సైతం కుల వివక్ష వేళ్లూనుకుంటోంది. ఈ సామాజిక దుర్లక్షణం అమెరికాలో ఏన్నో ఎండ్లుగా కొనసాగుతోందన్న విషయాన్ని 'ఈక్వాలిటీ ల్యాబ్స్' 2016 ఏడాది సర్వే తేల్చి చెప్పింది. 'క్యాస్ట్ ఇన్ ద యునైటెడ్ స్టేట్స్' :ఏ సర్వే ఆఫ్ క్యాస్ట్ అమాంగ్ సౌత్ ఏసియన్ అమెరికన్స్'' అనే పేరుతో నివేదికను విడుదల చేశారు. వెకిలిమాటలతో వెక్కిరించటం, భౌతికమైన, లైంగిక దాడులు...మొదలైనవి అమెరికాలో స్థిరపడిన దక్షిణాసియా దళితులు, ఆదివాసీలు ఎదుర్కొంటున్నారు. అంతేకాకుండా, 'దక్షిణాసియా చరిత్ర'ను అమెరికాలోని పలు రాష్ట్రాల్లో హిందూత్వ కోణంలో చూడటం మొదలైంది.
నివేదికలోని మరిన్ని విషయాలు ఇలా ఉన్నాయి, ''అమెరికాలో పుట్టి పెరిగిన దక్షిణాసియా వాసులంతా నేడు కుల వివక్షకు గురవుతున్నారు. కుల వివక్ష ఎలా ఉంటుందో కూడా వీరికి అనుభవాలు ఏర్పడ్డాయి. అయితే ఇదంతా నిన్నా...మొన్నా ఏర్పడింది కాదు. ఏన్నో ఏండ్లుగా అమెరికాలో కుల వివక్షత బలపడుతోంది. కారణం ఇక్కడి మేథావులెవరూ దీనిపై దృష్టి పెట్టలేదు. సరైన సమాచారం కూడా అందుబాటులో లేదు. అధ్యయనం జరగలేదు'' అని ఈక్వాలిటీ ల్యాబ్స్ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్, నివేదిక సహ రచయితగా వ్యవహరించిన తెన్మోజీ సౌందర్యరాజన్ అన్నారు. తక్కువ కులానికి చెందిన వారిమని నిందిస్తూ, భౌతిక దాడుల చేశారని సర్వేలో పాల్గొన్న 26 శాతం మంది దళితులు చెప్పారు. పని ప్రదేశాల్లో కుల వివక్షకు గురయ్యామని 20 శాతం మంది చెప్పారు. నచ్చిన భాగస్వామిని ఎంపికచేసుకునే క్రమంలో తాము తిరస్కారానికి గురయ్యామని 40 శాతం మంది ఇక్కడి దళితులు ఆవేదన వ్యక్తం చేశారు. వ్యంగ్యంగా, వెటకారంగా, తక్కువ చేస్తూ తమపై వ్యాఖ్యానాలు చేశారని 60 శాతంపైగా దళితులు చెప్పారు.
'నీది ఏ కులం?'
2016 సర్వేలో బయటపడ్ట విషయాలు సాధారణమైనవి కావు. అమెరికాలో స్థిరపడ్డ దక్షిణాసియా వాసుల్లో నెలకొన్న 'అసమానత'ను ఈ అధ్యయనం గుర్తించింది. అయితే ఈ అసమానత కచ్చితంగా 'కుల వివక్ష'తో ముడిపడినదని అధ్యయనం తేల్చింది. 'నీది ఏ కులం ?' 'ఆచార వ్యవహారల్లో స్వచ్ఛత' 'తక్కువ కులం వాళ్లు' అన్నవి దక్షిణాసియాకు చెందిన అనేక సంస్థల్లో, దేవాలయాల్లో, వివాహాల్లో నాటుకుపోయాయి. ఇదే ఇక్కడి దళితులు, ఆదివాసీలపై కుల వివక్షకు దారితీసింది. ఈ కుల వివక్ష పోకడలు ఊహించని స్థాయిలో పెరిగిపోతున్నాయి. బలవంతంగా తమ కులగుర్తింపును సైతం దాచుకోవాల్సిన దుస్థితి వారికి ఏర్పడిందని సౌందర్యరాజన్ ఆందోళన వ్యక్తం చేశారు. అమెరికన్ తత్వవేత్త, 'డా.బీ.ఆర్.అంబేద్కర్' సాహిత్యంపై కేంబ్రిడ్జ్ వర్సిటీలో బోధిస్తున్న డా.కోర్నెల్ వెస్ట్ చేతుల మీదుగా 'క్యాస్ట్ ఇన్ ద యునైటెడ్ స్టేట్స్' :ఏ సర్వే ఆఫ్ క్యాస్ట్ అమాంగ్ సౌత్ ఏసియన్ అమెరికన్స్'' నివేదిక తాజాగా విడుదలైంది.
ప్రతీ ముగ్గురిలో ఒక్కరు...వివక్షకు గురవుతున్నారు..
- కులం కారణంగా తాము భౌతికమైన దాడికి, మాటల దాడికి గురయ్యామని 25 శాతం దళితులు చెప్పారు.
- విద్యాలయాల్లో కుల వివక్షను ఎదుర్కొన్నామని ప్రతీ ముగ్గురిలో ఒకరు చెప్పారు.
- దేవాలయాలు, మత సంబంధ కార్యక్రమాలకు తమను రానివ్వలేదని దళితులు, ఆదివాసీలు చెప్పారు. దీంతో దళితులు బలవంతంగా కులపరమైన గుర్తింపును దాచుకోవాల్సిన పరిస్థితి ఏర్పడింది.
- వర్తక, వాణిజ్య ప్రదేశాల్లో కుల వివక్ష ఉందని 20 శాతం మంది దళితులు తెలిపారు.
- ప్రతీ ఇద్దరి దళితుల్లో ఒకరు, ప్రతీ నలుగురి ఆదివాసీల్లో ఒక్కరు...ఒక రకమైన భయంతో బతుకుతున్నారు. కులం కారణంగా తమను సమాజం నుంచి దూరంగా ఉంచుతున్నారని వారు ఆందోళన చెందుతున్నారు.
అంతకంతకూ పెరుగుతోన్న ఆర్థిక అసమానత
- దక్షిణాసియావాసుల్లో ఆర్థిక అసమానతకు ప్రధాన కారణం కూడా కుల వివక్షే.
- ఏడాదికి 25 వేల డాలర్ల(రూ.16 లక్షలు)లోపు ఆర్జిస్తున్న కుటుంబాలు దళితుల్లో 33 శాతం, ఆదివాసుల్లో 25 శాతం ఉన్నాయి. బ్రాహ్మణుల్లో ఇది కేవలం 13 శాతం మాత్రమే ఉంది. ఏడాదికి రూ.1.6 కోట్లు ఆర్జిస్తున్నవారిలో అత్యధికులు వైశ్యులున్నారు. దళితులు కేవలం 2 శాతం మాత్రమే ఉన్నారు.
- పాఠశాలల్లో, పని ప్రదేశాల్లో, ఆధ్యాత్మిక, మత కార్యక్రమాల్లో నెలకొన్న కుల వివక్షను, హింసను రూపుమాపాలని 'ఈక్వాలిటీ ల్యాబ్స్' నివేదిక సూచన చేసింది.
''అంటరానితనం, కులవివక్షత, తక్కువ చేసిమాట్లాడటం...వంటి సామాజిక దుర్లక్షణాలు అమెరికాలో సైతం విస్తరిస్తున్నాయి. దక్షిణాసియా దేశాల నుంచి వచ్చి అమెరికాలో స్థిరపడిన తోటి భారతీయుల నుంచే దళితులు, ఆదివాసీలు...తీవ్రమైన కుల వివక్షను ఎదుర్కొంటున్నారు. వివాహాలు చేసుకోవాలంటే, దేవాలయాలకు వెళ్లాలంటే దళితులు, ఆదివాసీలు తమ కులపరమైన గుర్తింపు దాచుకోవాల్సిన దుస్థితి ఏర్పడింది''