Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- క్యాంపస్లోకి ఎలా అనుమతిస్తున్నారు?
- జేఎన్యూను ప్రశ్నించిన ఢిల్లీ హైకోర్టు
న్యూఢిల్లీ : లైంగికవేధింపుల ఆరోపణలు ఎదుర్కొంటున్న ఆ ప్రొఫెసర్ను క్యాంపస్లో అడుగుపెట్టేందుకు ఎందుకు అనుమతిస్తున్నారని జేఎన్యూ పరిపాలనా యంత్రాంగాన్ని ఢిల్లీ హైకోర్టు ప్రశ్నించింది. విద్యార్థినుల విజ్ఞాపనలను ఫిర్యాదులుగా స్వీకరించాలనీ, లైంగికవేధింపులకు సంబంధించి ఆ ప్రొఫెసర్పై దర్యాప్తు ప్రారంభించాలని కోర్టు ఆదేశించింది. ప్రొఫెసర్పై చర్యలు ఎందుకు తీసుకోలేదంటూ వర్సిటీపై ఆగ్రహం వ్యక్తంచేసింది. సురక్షితంగా చదువుకునేలా వాతావరణం కల్పించాలనీ, ప్రొఫెసర్ అతుల్ కుమార్ జోహ్రిని సస్పెండ్ చేయాలనీ, అతడిని క్యాంపస్లోకి ప్రవేశించకుండా చూడాలంటూ విద్యార్థినులు పిటిషన్లో పేర్కొన్న అంశాలపై కూడా కోర్టు స్పందించింది. తాము పలుసార్లు విజ్ఞాపనలు చేసినా జోహ్రీపై వర్సిటీ ఎలాంటి చర్యా తీసుకోలేదనీ విద్యార్థులు తమ పిటిషన్లో పేర్కొన్నారు. 'విచారణ పూర్తయ్యేవరకూ క్యాంపస్లోకి అడుగుపెట్టవద్దని మీరు (జేఎన్యూ) ఎందుకు చెప్పలేదు? విద్యార్థినుల విజ్ఞాపనలను ఫిర్యాదులుగా ఎందుకు పరిగణించలేదు? విద్యార్థినులు క్యాంపస్లో సురక్షితంగా ఉండాలన్నది ప్రధాన అంశం. ప్రాథమిక విచారణ జరిపించండి. మీ విద్యార్థులను ఇలా బయటకులాగకూడదు.. ముందు ఆ ప్రొఫెసర్పై విచారణ ప్రారంభించండి' అని న్యాయమూర్తి రాజీవ్ షక్దేర్ వ్యాక్యానించారు. విద్యార్థినుల విజ్ఞాపనలను ఫిర్యాదులుగా పరిగణించి జోహ్రాపై వెంటనే చర్యలు ప్రారంభించాలని ఆదేశించారు. తొలుత వర్సిటీ తీసుకున్న చర్యలేమిటో చెప్పాలని జేఎన్యూ తరఫు న్యాయవాదిని కోర్టు ప్రశ్నించింది. వర్సిటీకిగానీ, అంతర్గత ఫిర్యాదుల కమిటీకిగానీ విద్యార్థులు ఫిర్యాదు చేయలేదనీ, అందువల్లే అతనిపై వర్సిటీ ఏ చర్యా తీసుకోలేదని జేఎన్యూ తరఫు న్యాయవాది జిన్ని రౌటరీ కోర్టుకు తెలిపారు. ఎఫ్ఐఆర్ దాఖలుకోసం విద్యార్థినులు పోలీసులను ఆశ్రయించడంతో, చట్టం తన పని తాను చేసుకుంటుందని అన్నారు. అయితే, వర్సిటీకి విద్యార్థినులు పలుసార్లు విజ్ఞాపనా పత్రాలు ఇచ్చారనీ, ప్రొఫెసర్పై ఎలాంటి చర్యా తీసుకోకపోవడంతో పోలీసులను ఆశ్రయించారని వారి తరఫున హాజరైన న్యాయవాది వ్రిందా గ్రోవర్ స్పష్టం చేశారు. ఆ విజ్ఞాపనలను ఫిర్యాదులుగా స్వీకరించి అతనిపై చర్యలు ప్రారంభించాలని కోర్టు జేఎన్యూను ఆదేశించింది.