Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- జోసెఫ్ పదోన్నతికి కేంద్రం విముఖత
- కొలీజియం సిఫారసును తిప్పి పంపిన వైనం
- న్యాయవ్యవస్థలో మోడీ సర్కారు జోక్యం: సుప్రీంకోర్టు బార్ అసోసియేషన్
న్యూఢిల్లీ : అనుకున్నదే జరిగింది. కొలీజియం సిఫారసుపై నాన్చుడు ధోరణి అవలంభిస్తూ వచ్చిన మోడీ సర్కారు చివరకు తాననుకున్న రీతిలోనే నిర్ణయం తీసుకున్నది. సుప్రీంకోర్టు న్యాయమూర్తులు గా ఇద్దరికి పదోన్నతి ఇవ్వాలని కొలీజియం ప్రతి పాదిస్తే వారిలో ఒక్కరికే కేంద్రం ఆమోదం తెలుప డంపై సర్వత్రా విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. సీని యర్ న్యాయవాది ఇందూ మల్హోత్రాకు సుప్రీంకోర్టు న్యాయమూర్తిగా పదోన్నతి కల్పించేందుకు ఒకే చెప్పిన కేంద్రం.. ఉత్తరాఖండ్ హైకోర్టు చీఫ్ జస్టిస్ కెఎం జోసెఫ్కు నో చెప్పడం చర్చనీయాంశంగా మారింది. జోసెఫ్కు సంబంధించిన ప్రతిపాదనను గురువారం తిరిగి కొలీజియంకు పంపిన కేంద్రం.. దీనిపై పునఃపరిశీలించాలని తెలిపింది. కాగా.. న్యాయవ్యవస్థలో కేంద్రప్రభుత్వం జోక్యం చేసుకుంటోందని సుప్రీంకోర్టు బార్ అసోసియేషన్(ఎస్సీబీఏ) ఆరోపించింది. ఈ సందర్భంగా ఎస్సీబీఏ చీఫ్, సీనియర్ న్యాయవాది వికాస్సింగ్ గురువారం మాట్లాడుతూ.. మల్హోత్రాకు పదోన్నతిపై తమకు ఎలాంటి అభ్యంతరమూ లేదని, కానీ జోసెఫ్ విషయంలో కేంద్రం తీరును తప్పు పడుతున్నట్టు వివరించారు. సుప్రీంకోర్టు న్యాయవాదిగా మల్హోత్రా గొప్పగా రాణిస్తారని తెలిపారు. ఇద్దరిని సుప్రీంకోర్టు జడ్జిలుగా పదోన్నతి కల్పించాలని ప్రతిపాదిస్తే.. ఒక్కరికే ఆమోదం తెలపడం ద్వారా న్యాయవ్యవస్థ కార్యకలాపాల్లో కేంద్రం జోక్యం చేసుకుందని, దీనిని తీవ్రంగా పరిగణించాలని ఆయన చెప్పారు. కెఎం జోసెఫ్, ఇందూ మల్హోత్రాలకు సుప్రీంకోర్టు న్యాయమూర్తులుగా పదోన్నతి కల్పించాలని భారత ప్రధాన న్యాయమూర్తి దీపక్ మిశ్రా నేతృత్వంలోని కొలీజియం ఈ యేడాది జనవరి 10న కేంద్రానికి ప్రతిపాదనలు పంపింది. కాగా.. మూడు నెలలైనా దీనిపై ఎలాంటి నిర్ణయమూ తీసుకోకపోవడంపై సుప్రీంకోర్టు సీనియర్ న్యాయమూర్తి కురియన్ జోసెఫ్ బహిరంగానే విమర్శలు గుప్పించారు. కేంద్రం నిర్లక్ష్యంపై సత్వరమే చర్యలు తీసుకోవాలని, లేదంటే చరిత్ర మనల్ని క్షమించదని పేర్కొంటూ దీపక్మిశ్రాకు ఈనెల 9న ఆయన లేఖ రాశారు. అయితే.. కొలీజియం సూచించిన పేర్లలో మల్హోత్రాకు సంబంధించి కేంద్రం తొలుత నుంచి సానుకూలంగా ఉన్నా.. కెఎం జోసెఫ్ విషయంలో మాత్రం నిరాసక్తత కనబరుస్తూ వచ్చిందని సమాచారం. 2016లో ఉత్తరాఖండ్లో విధించిన రాష్ట్రపతి పాలనను రద్దు చేసిన రాష్ట్ర హైకోర్టు ధర్మాసనానికి జోసెఫ్ నేతృత్వం వహించారు. ఈ కారణంగానే ఆయనకు పదోన్నతి కల్పించొద్దని కేంద్రం భావిస్తున్నట్టు వార్తలొచ్చాయి. కాగా.. గురువారం కేంద్రం తీసుకున్న నిర్ణయం ఈ అనుమానాలకు మరింత బలాన్ని చేకూర్చినట్టయ్యింది.
ప్రతీకార ఫలితమే : కాంగ్రెస్
కెఎం జోసెఫ్కు కేంద్రం పదోన్నతి కల్పించకపోవడాన్ని కాంగ్రెస్ పార్టీ నాయకులు, పలువురు ప్రముఖ న్యాయవాదులు తీవ్రంగా తప్పుబడుతున్నారు. ఇది రాజకీయపరమైన ప్రతీకారమేనని కాంగ్రెస్ నేత రణదీప్ సూర్జేవాలా గురువారం విమర్శించారు. 2016లో ఉత్తరాఖండ్లో విధించిన రాష్ట్రపతి పాలనను కెఎం జోసెఫ్ నేతృత్వంలోని ధర్మాసనం రద్దు చేసినందుకే కేంద్రం ఆయనపై కక్ష గట్టిందని ఆరోపించారు. 'జోసెఫ్ విషయంలో కేంద్రం తీరు వెనుక కారణాలేంటి? ఆయన మతమా? రాష్ట్రమా? లేదంటే ఉత్తరాఖండ్ విషయంలో ఇచ్చిన సంచలన తీర్పునా? ' అని కాంగ్రెస్ సీనియర్ నేత పి చిదంబరం.. మోడీ ప్రభుత్వాన్ని ప్రశ్నించారు. 'కొలీజియం ప్రతిపాదనలు ఆమోదించేందుకు కేంద్రం సిద్ధంగా లేదు. తమకు అనుకూలంగా ఉన్న వారికే పదోన్నతులు కల్పించాలని భావిస్తోంది' అని ఆ పార్టీకి చెందిన మరో నేత కపిల్ సిబల్ ఎద్దేవా చేశారు. 'ఉత్తరాఖండ్ విషయంలో బీజేపీకి వ్యతిరేకంగా జోసెఫ్ తీర్పునిచ్చినందుకే ఆయన పదోన్నతికి కేంద్రం విముఖత చూపించింది. స్వతంత్ర న్యాయవ్యవస్థలో ఇలా తీర్పివ్వడం ముఖ్యం కాదా? అని సీనియర్ న్యాయవాది కపిల్ సిబల్ అన్నారు.
స్టే విధించలేం : సుప్రీంకోర్టు
మరోవైపు.. మల్హోత్రాకు పదోన్నతి కల్పిస్తూ కేంద్రం తీసుకున్న నిర్ణయంపై స్టే విధించలేమని సుప్రీంకోర్టు గురువారం తేల్చి చెప్పింది. కొలీజియం ఇద్దరి పేర్లను ప్రతిపాదిస్తే ఒక్కరికే ఆమోదం తెలుపడం సరికాదని, మల్హోత్రా పదోన్నతిని నిలుపుదల చేయాలని సీనియర్ న్యాయవాది ఇందిరా జైసింగ్ చేసిన అభ్యర్థనను చీఫ్ జస్టిస్ దీపక్ మిశ్రా నేతృత్వంలోని ధర్మాసనం తోసిపుచ్చింది. కొలీజియం ప్రతిపాదనను పునఃపరిశీలన కోసం వెనక్కి పంపే అధికారం కేంద్రానికి ఉందని ఈ సందర్భంగా వెల్లడించింది.