Authorization
Mon Jan 19, 2015 06:51 pm
శ్రీనగర్: కాశ్మీర్లో కుప్వారా జిల్లాలోని హఫ్రదు అడవిలో జరిగిన ఎన్కౌంటర్లో నలుగురు ఉగ్రవాదులు మృతి చెందారు. ఈ ఎన్కౌంటర్ లైన్ ఆఫ్ కంట్రోల్(ఎల్ఓసీ)కు సమీపంలో చోటుచేసుకున్నదని ఆర్మీ అధికారులు శనివారం తెలిపారు. మిలిటెంట్లు ఉన్నారన్న ముందస్తు సమాచారం మేరకు శుక్రవారం షా నగ్రి గ్రామంలోని అటవీప్రాంతంలో ఆర్మీ, పోలీసులు సంయుక్తంగా ఆపరేషన్ చేపట్టారు. అయితే ఇంకొందరు మిలిటెంట్లు ఉన్నట్టుగా భావిస్తున్నామని..ఆపరేషన్ ఇంకా కొనసాగుతోందని అధికారులు తెలిపారు. సెర్చ్ ఆపరేషన్ చేపడుతుండగా మిలిటెంట్లు కాల్పులకు తెగబడ్డారని..వాటిని ప్రతిఘటిస్తూ తామూ కాల్పులు జరిపామని చెప్పారు. ముగ్గురు ఉగ్రవాదుల శుక్రవారం మరణించగా మరొకరు శనివారం ఉదయం మృతి చెందారని వెల్లడించారు. మృతులను గుర్తించాల్సి ఉన్నదని తెలిపారు. మృతిచెందినవారిని ఇటీవల ఎల్ఓసీ గుండా అక్రమంగా ప్రవేశించినవారిగా భావిస్తున్నట్టు తెలిపారు.