Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- ఆఫీసుకు రాలేను
- గుజరాత్ ప్రభుత్వాధికారి సమాధానం
అహ్మదాబాద్: 'దేశంలో మంచి వర్షాలు కురవడానికి నేను ఇంటిలో తపస్సు చేస్తున్నాను. నేను విష్ణు పదో అవతారమైన కల్కీని. నేను ఆఫీసుకు రాలేను ' అంటూ తన గైర్హాజరీ పై ఒక గుజరాత్ ప్రభుత్వాధికారి ఉన్నతాధికారులకు సమాధానమిచ్చారు. సర్దార్ సరోవర్ పునర్వాస్వత్ ఏజెన్సీ సూపరింటెండెంట్ ఇంజనీర్ అయిన రమేశ్చంద్ర ఫెఫార్.. గత ఎనిమిది నెలల్లో కేవలం 16 రోజులు మాత్రమే వడోదరాలోని కార్యాలయంలో విధులకు హాజరయ్యారు. దీంతో ఉన్నతాధికారులు ఆయనకు షోకాజ్ నోటీసు జారీ చేశారు. దీనికి ప్రతిస్పందనగా ఆయన పై వ్యాఖ్యలు చేశారు. 'నేను విష్ణు పదో అవతారమైన కల్కీని. రానున్న రోజుల్లో దీన్ని నిరూపిస్తాను. 2010లో నేను ఆఫీసులో ఉండగా నేను కల్కీ అవతారాన్ని అని గ్రహించాను. అప్పటి నుంచే నాకు అతీత శక్తులున్నాయి' అంటూ రాజ్కోట్లోని తన ఇంటిలో మీడియాకు శుక్రవారం తెలిపారు. 'నేను ఇంటిలో కూర్చోని తపస్సు చేస్తున్నాను. ఇలాంటి తపస్సును ఆఫీసులో కూర్చోని చేయలేను. నేను ఆఫీసులో కూర్చోని టైంపాస్ చేయాలో లేదా దేశాన్ని కరువు నుంచి కాపాడటానికి తపస్సు పై శ్రద్ద వహించాలో ఏజెన్సీయే తప్పక నిర్ణయం తీసుకోవాలి' అంటూ షోకాజ్ నోటీసుకు సమాధానమిచ్చారు. పైగా తాను కల్కీ అవతారం కావడం వల్లే 19 ఏండ్ల నుంచి దేశంలో సమృద్ధిగా వర్షాలు కురుస్తూ వస్తున్నాయని ఫెఫార్ పేర్కొనడం గమనార్హం.