Authorization
Mon Jan 19, 2015 06:51 pm
న్యూఢిల్లీ : కర్నాటక సంక్షోభానికి ప్రస్తుతానికి తెరపడింది. రెండు రోజుల పాటు ముఖ్యమంత్రిగా కొనసాగిన యడ్యూరప్ప తన పదవికి రాజీనామా చేస్తున్నట్టు అసెంబ్లీలో ప్రకటించారు. గతంలో 2007లో ముఖ్యమంత్రి పదవి చేపట్టినప్పుడు కూడా యడ్యూరప్ప ఇలాగే వారం రోజుల్లోగానే రాజీనామా చేయాల్సి వచ్చింది. ఆ తర్వాత, 2008 నుంచి 2011 వరకు దాదాపు మూడేళ్ల పాటు ఆయన కర్నాటక ముఖ్యమంత్రిగా పని చేశారు. భారత రాజకీయాల్లో ఇలాంటి ఆసక్తికరమైన పరిస్థితి ఇదే మొదటిసారి కాదు. రాజకీయ చరిత్రలో ఇలాంటి ఘటనలు ఎన్నో ఉన్నాయి.
1979: ప్రమాణం చేసిన 15 రోజుల్లోనే పడిపోయిన చరణ్ సింగ్ ప్రభుత్వం
దేశంలో అత్యవసర పరిస్థితి విధించిన దాదాపు రెండేండ్ల తర్వాత ప్రతిపక్షాల ప్రభావం పెరిగినట్టు గమనించిన ప్రధాన మంత్రి ఇందిరా గాంధీ, లోక్సభను రద్దుచేసి ఎన్నికలు నిర్వహించాలని సిఫారసు చేశారు. అత్యవసర పరిస్థితి విధించాలనే నిర్ణయం కాంగ్రెస్కు ఎన్నికల్లో చాలా నష్టం కలిగించింది.
30 ఏండ్ల తర్వాత కేంద్రంలో కాంగ్రెసేతర ప్రభుత్వం ఏర్పడింది. జనతా పార్టీ భారీ మెజార్టీతో అధికారంలోకి వచ్చింది. మొరార్జీ దేశారు ప్రధాన మంత్రి అయ్యారు. చరణ్ సింగ్ ఆ ప్రభుత్వంలో ఉప ప్రధాని, హోంమంత్రి పదవులు దక్కాయి. పార్టీలో అంతర్గత కలహాలతో మొరార్జీ దేశారు ప్రభుత్వం పడిపోయింది. ఆ తర్వాత కాంగ్రెస్, సీపీఐ మద్దతుతో చరణ్ సింగ్ 1979 జులై 28న ప్రధాన మంత్రిగా ప్రమాణం చేశారు. బలం నిరూపించుకోడానికి రాష్ట్రపతి నీలం సంజీవరెడ్డి ఆయనకు ఆగస్టు 20 వరకు గడువు ఇచ్చారు. కానీ ఒక రోజు ముందే అంటే ఆగస్టు 19న ఇందిరాగాంధీ తన మద్దతు వెనక్కు తీసుకున్నారు. దాంతో ఫ్లోర్ టెస్ట్ ఎదుర్కోకుండానే ఆయన తన రాజీనామా సమర్పించారు.
1989: బీహార్లో రథయాత్ర ఆగింది, ఢిల్లీ ప్రభుత్వం కూలింది
1989కి ఒక ఏడాది ముందు అంటే 1988లో జయప్రకాశ్ నారాయణ్ జన్మదినం అక్టోబర్ 11న జనమోర్చా, జనతా పార్టీ, లోక్దళ్, కాంగ్రెస్(ఎస్) విలీనం అయ్యాయి. కొత్తపార్టీ జనతాదళ్ ఆవిర్భవించింది. విపి సింగ్ జనతాదళ్ అధ్యక్షుడుగా ఎన్నిక య్యారు. ఆయన నేతృత్వంలో ఎన్నో ప్రాంతీయ పార్టీలు ఒకే గొడుకు కిందకు వచ్చాయి. నేషనల్ ఫ్రంట్ ఏర్పడింది.
1989లో ఎన్నికలు జరిగాయి. నేషనల్ ఫ్రంట్ మంచి మెజారిటీ సాధించింది. అంతేకాదు అది ప్రభుత్వం కూడా ఏర్పాటు చేసింది. బీజేపీ, వామపక్షాలు బయటి నుంచి మద్దతు ఇవ్వడంతో నేషనల్ ఫ్రంట్ ప్రభుతాన్ని ఏర్పాటు చేసింది. విపి సింగ్ ప్రధాన మంత్రి అయ్యారు. ఏడాది తర్వాత బీజేపీ రథయాత్ర ప్రారంభించింది. రథం చాలా రాష్ట్రాల నుంచి వెళ్తూ బీహార్కు చేరుకుంది. బీహార్లో జనతా దళ్ ప్రభుత్వం ఉంది. అప్పుడు లాలూ ప్రసాద్ యాదవ్ ముఖ్యమంత్రిగా ఉన్నారు. ఆయన ఎల్కె అద్వానీ రథ యాత్రను లాలూ అడ్డుకున్నారు. ఆయనను అరెస్ట్ చేయించారు. దాంతో బీజేపీ కేంద్ర ప్రభుత్వానికి తమ మద్దతు ఉపసంహరించుకుంది. దాంతో విపి సింగ్ సర్కారు కూలిపోయింది.
1990: రాజీవ్ గాంధీపై నిఘా, కూలిన ప్రభుత్వం
విపి సింగ్ రాజీనామా తర్వాత జనతాదళ్ నేత చంద్రశేఖర్, తన మద్దతుదారులతో పార్టీని వీడారు. సమాజ్వాదీ జనతా పార్టీ ఏర్పాటు చేశారు. ఎన్నికలు జరిగాయి. సమాజ్వాదీ జనతా పార్టీ 64 స్థానాల్లో విజయం సాధించింది. లోక్సభలో జరిగిన ఫ్లోర్ టెస్ట్లో కాంగ్రెస్ ఆయనకు మద్దతు ఇచ్చింది. చంద్రశేఖర్ ప్రధాన మంత్రి అయ్యారు. ఏడు నెలల తర్వాత జరిగిన ఒక ఘటన చంద్రశేఖర్ను తన పదవికి రాజీనామా చేసేలా చేసింది. 1991 మార్చి 2న రాజీవ్ గాంధీ నివాసం 10 జన్ పథ్ బయట నిఘా పెట్టారనే ఆరోపణలతో హర్యానా పోలీస్ కానిస్టేబుళ్లు ప్రేమ్ సింగ్, రాజ్ సింగ్ అరెస్ట్ అయ్యారు. ఇద్దరూ మఫ్టీలో ఉన్నారు, కొంత సమాచారం సేకరించడానికి తమను పంపించారని అరెస్ట్ తర్వాత వారిద్దరూ అంగీకరించారు. ఈ విషయంపై రాజకీయ కలకలం రేపింది. కేంద్ర ప్రభుత్వానికి తమ మద్దతును ఉపసంహరిస్తున్నట్టు కాంగ్రెస్ ప్రకటించింది. ఆ తర్వాత పార్లమెంటులో విశ్వాస పరీక్ష నిర్వహించవలసి వచ్చింది. ఫ్లోర్ టెస్ట్ జరగడానికి ముందే చంద్రశేఖర్ అందరికీ షాక్ ఇచ్చారు. 1991 మార్చి 6న ప్రధాని పదవికి రాజీనామా చేశారు.
1992: కుర్చీ కోసం సొంతంగా బల పరీక్షకు సిద్ధమైన మాయావతి
అత్యంత ఆసక్తికరమైన బల పరీక్ష ఉత్తర ప్రదేశ్లో జరిగింది. 1992లో ములాయం సింగ్ యాదవ్ సమాజ్ వాదీ జనతా పార్టీ నుంచి విడిపోయి, సమాజ్వాదీ పార్టీ స్థాపించారు. ఒక ఏడాది తర్వాత ఉత్తర్ ప్రదేశ్లో వివాదాస్పద నిర్మాణాన్ని కూల్చివేశారు. ఈ ఘటనతో రాష్ట్రంలో అధికారంలో ఉన్న కల్యాణ్ సింగ్ ప్రభుత్వం రద్దయింది. ఆ తర్వాత ఎన్నికలు జరిగాయి. సమాజ్వాదీ పార్టీ, మాయావతి బహుజన్ సమాజ్వాదీ పార్టీ (బీఎస్పీ) పొత్తు పెట్టుకున్నాయి. ఈ రెండు పార్టీలూ కలిసి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేశాయి. కానీ ఈ సంకీర్ణ ప్రభుత్వం ఐదేండ్లు అధికారంలో ఉండలేకపోయింది.
బీఎస్పీ తన మద్దతు వెనక్కు తీసుకుంది, ఉత్తరప్రదేశ్ అసెంబ్లీలో విశ్వాస పరీక్ష జరిగింది. బీజేపీ మద్దతుతో మాయావతి ముఖ్యమంత్రి అయ్యారు. సమాజ్వాదీ పార్టీ అధికారానికి దూరమైంది.
1999: ఒక్క ఓటుతో కూలిన వాజ్పేయి ప్రభుత్వం
1998లో లోక్సభ ఎన్నికలు జరిగాయి. ఎన్నికల్లో ఏ పార్టీకీ మెజార్టీ లభించలేదు. కానీ అన్నాడీఎంకే మద్దతుతో కేంద్రంలో ఎన్డీయే ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసింది. 13 నెలల తర్వాత అన్నాడీఎంకే తన మద్దతును ఉపసంహ రించుకుంది. ప్రభుత్వం మైనారిటీలో పడిపోయింది. విపక్షాల డిమాండ్తో బలాన్ని నిరూపించుకోవాలని రాష్ట్రపతి ప్రభుత్వాన్ని ఆదేశించారు. లోక్సభలో ఫ్లోర్ టెస్ట్ జరిగింది. అటల్ బిహారీ వాజ్పేయి ప్రభుత్వం ఒక్క ఓటుతో పడిపోయింది.