Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- కాశ్మీర్ యువతను కోరిన ప్రధాని
- జోజిల సొరంగ మార్గానికి శంకుస్థాపన
శ్రీనగర్: ఉగ్రవాద సంస్థల్లో చేరిన యువత.. తిరిగి జనజీవనంలోకి వచ్చి శాంతియుతంగా జీవించాలని జమ్మూకాశ్మీర్ పర్యటనలో ఉన్న ప్రధాని మోడీ కోరారు. శ్రీనగర్లో 330 మెగావాట్ల కిషన్గంగ హైడల్ ప్రాజెక్టు ప్రారంభం, శ్రీనగర్ రింగ్రోడ్డుకు శంకుస్థాపన చేసిన అనంతరం అక్కడి షెర్-ఈ-కాశ్మీర్ ఇంటర్నేషనల్ కన్వెన్షన్ సెంటర్(ఎస్కెఐసీసీ)లో ఏర్పాటు చేసిన అధికారిక కార్యక్రమంలో మోడీ ప్రసంగించారు. ఇండ్లు, కుటుంబాలు వదిలి మిలిటెన్సీలో చేరిన యువతను తిరిగి తీసుకువచ్చేందుకు రాష్ట్ర ప్రభుత్వం ప్రయత్నిస్తోందని మోడీ అన్నారు. ఇక్కడి ప్రజలు లౌకికత్వాన్ని కలిగి ఉంటారని, ఆహ్వానిస్తారని అన్నారు. వాజ్పేయి దారిలోనే తానూ కాశ్మీరియత్కే మద్దతునిస్తారని చెప్పారు. అన్ని సమస్యలకు పరిష్కారం అభివృద్ధేనని, హింసాత్మక మార్గాలను అవలంభించిన దేశాలన్ని ఇప్పుడు వాటిని వదిలి పరిష్కారాలను వెతుకుతున్నాయని వివరించారు. రంజాన్ సందర్భంగా రాష్ట్రంలో కాల్పుల విరమణ చేపట్టడం.. ఇస్లాం పేరిట ఉగ్రవాదాన్ని నెరుపుతున్నవారికి మేలుకొలుపు పిలుపు అని చెప్పారు. ఈ కార్యక్రమానికి ముందుగా లే నగరంలో 14.15 కిలోమీటర్ల పొడవుగల జోజిల సొరంగ మార్గానికి శంకస్థాపన చేసి తన జమ్మూకాశ్మీర్ పర్యటనను ప్రధాని ప్రారంభించారు. అనంతరం మోడీ మాట్లాడుతూ..ఇది దేశంలోనే అతిపెద్ద సొరంగ మార్గమే కాకుండా ఆసియాలోనే రెండువైపుల దారులున్న అతిపెద్ద టన్నెల్ అని తెలిపారు. జమ్మూకాశ్మీర్లో ప్రధాని పర్యటన నేపథ్యంలో రాష్ట్రంలో అధికారులు హై అలర్ట్ ప్రకటించారు. హైస్పీడ్ మొబైల్ ఇంటర్నెట్ సేవలను నిలిపివేశారు. విద్యాసంస్థలను మూసివేశారు.