Authorization
Mon Jan 19, 2015 06:51 pm
ప్రతిపక్షాలు ఐక్యంగా నిలిచి బీజేపీని ఓడించినందుకు గర్వంగా ఉన్నదని కాంగ్రెస్ అధ్యక్షుడు రాహుల్గాంధీ అన్నారు. ఇది ప్రజాస్వామ్య విజయమని ఆయన వ్యాఖ్యానించారు. ఇదే తీరును కొనసాగిస్తామని రాహుల్గాంధీ తెలిపారు. విశ్వాస పరీక్షకు ముందే కర్నాటకలో యడ్యూరప్ప ప్రభుత్వం కూలిపోవడంపై మీడియాతో మాట్లాడుతూ రాహుల్ ఈ వ్యాఖ్యలు చేశారు. కర్నాటకలో ఎమ్మెల్యేల కొనుగోలును ప్రధాని బహిరంగంగానే ప్రోత్సహించారని రాహుల్ దుయ్యబట్టారు. అవినీతికి వ్యతిరేకంగా తాను పోరాడుతున్నానంటూ ప్రధాని దేశవ్యాప్తంగా ప్రచారం చేసుకుంటున్నారని, అది పచ్చి అబద్ధమని రాహుల్ విమర్శించారు. ఎమ్మెల్యేలతో ఫోన్ల ద్వారా జరిపిన బేరసారాలు బహిర్గతమయ్యాయని రాహుల్ గుర్తు చేశారు. కర్నాటక విధానసభలో ఏంజరిగిందో అంతా చూశారని..స్పీకర్, బీజేపీ ఎమ్మెల్యేలు జాతీయగీతం ఆలపించకుండానే అసెంబ్లీ నుంచి బయటకు వెళ్లారని రాహుల్ విమర్శించారు. ఆర్ఎస్ఎస్, మోడీ, అమిత్షాలు ప్రభుత్వ వ్యవస్థలను అగౌరవపరుస్తున్నారని రాహుల్ విమర్శించారు. ఎన్ని ప్రలోభాలు పెట్టినా కాంగ్రెస్, జేడీ(ఎస్) ఎమ్మెల్యేలు ఐక్యంగా నిలిచారంటూ రాహుల్ వారిని అభినందించారు. దేశ ప్రజలు, వ్యవస్థల కంటే ప్రధాని గొప్పవారేమీ కాదని, ఇది ఆయనకు తానిచ్చే సందేశమని రాహుల్ అన్నాను. ప్రధాని ప్రజాస్వామ్య నమూనాను అనుసరిం చడంలేదని, నియంతలా వ్యవహరిస్తున్నారని రాహుల్ అన్నారు. ఆ విషయం సుప్రీంకోర్టుకూ, ప్రధానికి కూడా తెలుసునని రాహుల్ అన్నారు. పాలించేందుకు మాత్రమే ప్రజలు అధికారమిచ్చారని ఆయన గుర్తు చేశారు. జేడీ(ఎస్) అగ్రనేత దేవెగౌడ, కర్నాటక ప్రజలకు రాహుల్ అభినందనలు తెలిపారు.