Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- మొదటి రెండు స్థానాల్లో అమెరికా, చైనా
- ఆఫ్రేసియా బ్యాంక్ గ్లోబల్ వెల్త్ నివేదిక
న్యూఢిల్లీ: ప్రపంచంలోని సంపన్న దేశాల జాబితాలో 8,23,000 కోట్ల డాలర్లతో భారత్ ఆరో స్థానంలో నిలిచింది. అత్యంత ధనిక దేశంగా 62,58,400 కోట్ల డాలర్లతో అమెరికా మొదటి స్థానంలో, 24,80,300 కోట్ల డాలర్లతో చైనా రెండో స్థానంలో నిలిచాయి. 19,52,200 కోట్ల డాలర్లతో జపాన్ మూడో స్థానంలో, 9,91,900 కోట్ల డాలర్లతో బ్రిటన్ నాలుగో స్థానంలో, 9,66,000 కోట్ల డాలర్లతో జర్మనీ ఐదో స్థానంలో నిలిచాయి. ఆఫ్రేసియా బ్యాంక్ గ్లోబల్ వెల్త్ మైగ్రేషన్ నివేదికలో 2017వ సంవత్సరానికి ఈ ర్యాంకులిచ్చింది. భారత్ తర్వాతి స్థానాల్లో వరుసగా ఫ్రాన్స్, కెనడా, ఆస్ట్రేలియా, ఇటలీ నిలిచాయి. ఈ ర్యాంకుల కోసం ఆయా దేశాల మొత్తం సంపదను పరిగణనలోకి తీసుకున్నట్టు నివేదిక రూపకర్తలు తెలిపారు. మొత్తం సంపద అంటే ఆ దేశంలో నివసించే ప్రతి ఒక్కరి సంపదతోపాటు స్థిరాస్తి, నగదు,ఈక్విటీలు, వ్యాపారాలను లెక్కలోకి తీసుకున్నారు. అయితే, ప్రభుత్వ ఆస్తులను లెక్కలోకి తీసుకోలేదు. మరో పదేండ్ల తర్వాత అంటే 2027లో భారత్ నాలుగో స్థానానికి చేరుకోనున్నట్టు ఈ నివేదిక పేర్కొన్నది. ఆ సమయానికి 75,10,100 కోట్ల డాలర్లతో అమెరికా మొదటి స్థానంలో,69,44,900 కోట్ల డాలర్లతో చైనా రెండో స్థానంలో,25,37,800 కోట్ల డాలర్లతో జపాన్ మూడో స్థానంలో, 24,69,100 కోట్ల డాలర్లతో భారత్ నాలుగో స్థానంలో, 10,91,100 కోట్ల డాలర్లతో బ్రిటన్ ఐదో స్థానంలో, 10,62,600 కోట్ల డాలర్లతో జర్మనీ ఆరో స్థానంలో నిలువనున్నట్టు ఆ నివేదిక పేర్కొన్నది. ప్రస్తుతం, ప్రపంచంలోని ప్రయివేట్ వ్యక్తుల మొత్తం సంపద విలువ 215 లక్షల కోట్ల డాలర్లుగా నివేదిక తెలిపింది. ఇది మరో పదేండ్లలో 50 శాతం పెరిగి 2027 వరకల్లా 321 లక్షల కోట్ల డాలర్లవుతుందని నివేదిక పేర్కొన్నది. శ్రీలంక, భారత్, వియత్నాం, చైనా, మారిషస్లను వేగంగా అభివృద్ధి చెందుతున్న మార్కెట్లుగా నివేదిక తెలిపింది. ప్రపంచ మార్కెట్లలోని అధ్వాన్నమైన మొదటి 8 దేశాల్లో వరుసగా పాకిస్థాన్, నైజీరియా, వెనీజులా, టర్కీ, ఖతార్, రష్యన్ ఫెడరేషన్, ఇరాన్, సౌదీ అరేబియా ఉన్నాయి.