Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- బీజేపీ మాజీ నేత యశ్వంత్ సిన్హా
ఛండీగఢ్, పుదుచ్చేరి: ప్రధాని నరేంద్ర మోడీ కాదు, దేశ ప్రజలు ఎదుర్కొంటున్న సమస్యలే ప్రధానమని బీజేపీ మాజీ నేత యశ్వంత్ సిన్హా అన్నారు. రాష్ట్ర మంచ్ దేశవ్యాప్తంగా నిర్వహించస్తున్న సమావేశాల్లో భాగంగా.. ఛండీగఢ్లో ఆదివారం ఏర్పాటు చేసిన కార్యక్రమంలో ఆయన విలేకరులతో మాట్లాడారు. దేశంలో వ్యవసాయం, రైతులు సంక్షోభంలో చిక్కుకున్నారని అన్నారు. దేశ ఆర్థిక వ్యవస్థ వృద్ధి మందగించిందని తెలిపారు. ఈ రాష్ట్ర మంచ్ వేదికగా దేశంలోని సమస్యలను లేవనెత్తుతున్నామని చెప్పారు. తాము వ్యక్తుల గురించి కాకుండా ప్రభుత్వం చేస్తున్న తప్పిదాల గురించి వివరించాలని ప్రయత్నిస్తున్నామని అన్నారు. జవహర్ లాల్ నెహ్రూ, ఇందిరా గాంధీ, మన్మోహన్ సింగ్లు ఏం చేశారో చూసి 2019 సార్వత్రిక ఎన్నికల్లో ఓట్లు వేయరని, ఐదేండ్లలో బీజేపీ ప్రభుత్వం ఏం చేసిందనే అంశాన్ని పరిగణలోకి తీసుకునే ఓట్లు వేస్తారని స్పష్టం చేశారు. 2014 ఎన్నికలకు ముందు చేసిన హామీలన్నింటినీ బీజేపీ తుంగలో తొక్కిందని చెప్పారు. వచ్చే 11నెలలు భారత రాజకీయాల్లో అత్యంత కీలకమైనవని అన్నారు.
బీజేపీ గురించి నిజం మాట్లాడటం
తప్పంటే.. తిరుగుబాటుదారున్నే: శత్రుఘ్న సిన్హా
తాను పార్టీ నిబంధనలను ఎన్నడూ ఉల్లంఘించలేదని, ఒకవేళ పార్టీ గురించి నిజాలు మాట్లాడితేనే తప్పుబడితే తాను తిరుగుబాటుదారున్నేనని బీజేపీ ఎంపీ శత్రుఘ్న సిన్హా వ్యాఖ్యానించారు. యశ్వంత్ సిన్హాతో పాటు ఛండీగఢ్ కార్యక్రమంలో ఆయన మాట్లాడారు. వాజ్పేయి సమక్షంలో తాను బీజేపీలో చేరారని..కానీ ఇప్పుడు ఆ పార్టీ మోడీ పార్టీగా మారిందని అన్నారు. పెద్దనోట్ల రద్దు సాధారణ పౌరులను తీవ్ర ఇబ్బందులకు గురిచేసిందని చెప్పారు. చిన్న చిన్న వ్యాపారులు తమ వ్యాపారాన్ని నిలుపుకోలేక ఆపసోపాలు పడ్డారని తెలిపారు.
'కర్నాటక' నుంచి బీజేపీ పాఠం నేర్చుకోవాలి: పుదుచ్చేరి సీఎం
కుట్రలు, కుతంత్రాలతో అధికారంలోకి రావాలని ప్రయత్నించి భంగపడ్డ బీజేపీ.. 'కర్నాటక' నుంచి పాఠాలు నేర్చుకోవాలని పుదుచ్చేరి ముఖ్యమంత్రి వి. నారాయణ స్వామి అన్నారు. పుదుచ్చేరిలో విలేకరులతో మాట్లాడుతూ... ఎమ్మెల్యేలను డబ్బు, అధికారంతో కొనాలని చూసిన బీజేపీకి కాంగ్రెస్, జేడీ (ఎస్) ఎమ్మెల్యేలు సరైన గుణపాఠం చెప్పారన్నారు. ఎమ్మెల్యేలను కొని అధికారాన్ని చేజిక్కించుకోవాలని చూసిన బీజేపీ పాచికలు పారలేదని.. ఆ పార్టీ దీన్నురచి గుణపాఠం నేర్చుకోవాలని సూచించారు. గవర్నర్, లెఫ్ట్నెంట్ గవర్నర్లను బీజేపీ తమ సొంత ప్రయోజనాల కోసం ఉపయోగించుకుంటుందని ఆరోపించారు.