Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- ప్రభుత్వాన్ని నడపడం కుమారస్వామికి సవాలే..!
- ఇప్పటికైతే ధీమా వ్యక్తం చేస్తున్న కూటమి
- మున్ముందు పరిణామాలు ఎలా మారనున్నాయో ?
బెంగళూరు : బీజేపీకి భంగపాటు ఎదురుకావడంతో కుమారస్వామి కొలువు దీరేందుకు మార్గం సుగమమైంది. ఇప్పటికైతే ఎలాంటి ఇబ్బందీ లేకున్నా.. కాంగ్రెస్, జేడీఎస్ కూటమితో ఏర్పడిన సంకీర్ణ ప్రభుత్వం పూర్తికాలం అధికారంలో ఉంటుందా? అన్న ప్రశ్న ఇప్పుడు రాజకీయవర్గాల్లో మెదులుతున్నది. విశ్వాస పరీక్షలో నెగ్గడమే లక్ష్యంగా బీజేపీ చేసిన కుట్రలను కూటమి విజయవంతంగా అడ్డుకోగలిగింది. కానీ, ఇప్పుడు మంత్రి పదవుల విషయంలో కాంగ్రెస్, జేడీఎస్ మధ్య, సొంత పార్టీల్లోనూ లుకలుకలు బయటపడుతున్నాయి. ఎమ్మెల్యేలు బీజేపీ చెంతన చేరకుండా కాపాడటంలో తిరుగులేని పాత్ర పోషించిన కాంగ్రెస్ సీనియర్ నేత డికె శివకుమార్ డిప్యూటీ సీఎం పదవి కోసం పట్టుబట్టగా నిరాశే ఎదురైనట్టు సమాచారం. అంతేకాదు.. కాంగ్రెస్, జేడీఎస్ మధ్య జరిగిన సమావేశంలో సీఎం పదవి రొటేషన్ విషయం కూడా చర్చకు వచ్చినట్టు తెలిసింది. అయితే.. ముఖ్యమంత్రి సీటు రొటేషన్ ఉండదని కుమారస్వామి తేల్చడంతో ఆ ఊహాగానాలకు తెరపడినట్టయ్యింది. కుమార స్వామి, సోనియా, రాహుల్ల సమక్షంలో క్యాబినెట్ తుదిరూపు దిద్దుకుంటుందని వార్తలు వినిపిస్తున్న తరుణంలో అసంతృప్తులను బుజ్జగించడమే ఇప్పుడు పార్టీల ముందున్న ప్రధాన కర్తవ్యంగా మారింది. సంకీర్ణ ప్రభుత్వాన్ని నడపడం కుమారస్వామికి కష్టంతో కూడుకున్న పనే అయినప్పటికీ గత అనుభవాలను దృష్టిలో పెట్టుకొని ఆయన ఆచి తూచి అడుగులు వేసే అవకాశాలే ఎక్కువున్నాయి.
ఎన్నికల ఫలితాలు వెలువడే వరకు కాంగ్రెస్, జేడీఎస్లు ప్రత్యర్థి పార్టీలే.. కొన్ని అసెంబ్లీ స్థానాల్లో ఈ రెండు పార్టీల మధ్యనే ప్రధాన పోటీ నెలకొన్నది. అంతేకాదు.. జేడీఎస్ను బీజేపీ బీ పార్టీగా అభివర్ణిస్తూ వచ్చారు కాంగ్రెస్ నేతలు. ఫలితాలు వెలువడుతున్న సమయంలో సీన్ ఒక్కసారిగా మారిపోయింది. అయితే.. శత్రుత్వాన్ని మరిచి ఇరు పార్టీలు ఒక్కటవడంపై దేశమంతా స్వాగతించింది. ప్రజాస్వామ్య పరిరక్షణ కోసం తక్కువ స్థానాలు వచ్చిన ప్రాంతీయ పార్టీకి మద్దతు ఇవ్వాల్సి వచ్చిందని కాంగ్రెస్ సీనియర్ నేత ఖర్గే వెల్లడించారు. దీన్ని బట్టి బీజేపీపై ప్రజల్లో ఎంత వ్యతిరేకత ఉందో అర్థమవుతున్నది. గవర్నర్ అధికారాలను ఉపయోగిం చుకొని బీజేపీ లబ్ది పొందాలని చూసినా సుప్రీంకో ర్టులో తగిలిన ఎదురుదెబ్బలకు కోలుకోలేక చతికిల పడింది. అంతేకాక చివరి నిమిషం వరకు విశ్వాస పరీక్ష నెగ్గేందుకు బీజేపీ చేయాల్సిన ప్రయత్నాలన్నీ చేసింది. ఇవన్నీ బెడిసి కొట్టడంతో బీజేపీ వెనుకడుగు వేయక తప్పలేదు. విశ్వాసానికి వెళ్లి ఓడిపోయే కంటే ముందే సర్దుకుంటే మేలన్న ఉద్దేశంతో యడ్యూరప్ప సీఎం పదవికి రాజీనామా చేశారు.
కాంగ్రెస్ తలచుకుంటే..
శాసనసభలో జేడీఎస్ సంఖ్యాబలం 38 ఉంటే కాంగ్రెస్ ఎమ్మెల్యేలు 78 మంది ఉన్నారు. అయితే.. తక్కువ సభ్యులున్న జేడీఎస్ను కాంగ్రెస్ ప్రభుత్వ ఏర్పాటుకు ఆహ్వానించడంతో మున్ముందు పరిణామాలు కీలకంగా మారనున్నాయి. జేడీఎస్కు ఎప్పుడు మద్దతు ఉపసంహరించినా ప్రభుత్వం కూలిపోవడం ఖాయం. లేదంటే ఇంతలో బీజేపీ ఏదైనా కుట్రలు పన్ని కొందరు ఎమ్మెల్యేలను తమ వైపునకు తిప్పుకున్నా ప్రమాదమే.. బీజేపీ ఈ ప్రయత్నంలో విజయం సాధించి ప్రభుత్వంపై అవిశ్వాసానికి వెళ్తే ప్రభుత్వం కూలిపోయే అవకాశాలున్నాయి. ఏదేమైనా యడ్యూరప్పను దించడంతో విజయవంతమైన కూటమి..2019 లోక్సభ ఎన్నికల్లో కలిసే పోటీ చేసే అవకాశాలు మెండుగా ఉన్నాయని ఊహాగానాలు వినిపిస్తున్నాయి.