Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- రికార్డు స్థాయికి పెరిగిన పెట్రోల్, డీజిల్ ధరలు
- ఎన్నికలు ముగియడంతో బాదుడు
- డీజిల్ ధరలు హైదరాబాద్లో అధికం
న్యూఢిల్లీ: పెట్రోల్, డీజిల్ ధరలు ఆదివారం ఆల్ టైం రికార్డు స్థాయికి చేరుకున్నాయి. కర్నాటక ఎన్నికలతో 19 రోజులు స్తబ్దంగా ఉన్న ఆయిల్ ధరలు.. అనంతరం పెరుగుతూ వస్తున్నాయి. ప్రభుత్వరంగ ఆయిల్ కంపెనీలు పెరిగిన ధరలను ప్రకటిస్తూ నోటిఫికేషన్ను
జారీ చేశాయి. దీంతో ఢిల్లీలో లీటర్ పెట్రోల్ ధర 33 పైసలు పెరిగి రూ. 76.24కు చేరింది. గతేడాది జూన్ నుంచి రోజువారీ ధరలు అమలులోకి వచ్చినప్పటి నుంచి ఇదే అధికం. అదేవిధంగా లీటర్ డీజిల్ ధర అధికంగా 26 పైసలు పెరిగి రూ. 67.57కు చేరుకున్నది. అయితే, దేశంలోని మెట్రోనగరాలు, రాష్ట్ర రాజధానుల్లో ఉండే ధరలతో పోల్చుకుంటే దేశరాజధానిలోని ధరలు మాత్రం తక్కువగా ఉన్నాయి. అయితే, ఆయా రాష్ట్రాల్లో విధించే పన్నుల కారణంగా ఈ ధరలు ప్రాంతాన్ని బట్టి మారనున్నాయి. దేశంలోని పలు నగరాల్లో పెరిగిన పెట్రోల ధరలు ఈ విధంగా ఉన్నాయి. అధిక స్థానిక పన్నులతో దేశ వాణిజ్య రాజధాని ముంబయిలో లీటర్ పెట్రోల్ ధర రూ. 84.07గా ఉంది. కోల్కతాలో రూ. 79.91, చెన్నైలో రూ. 79.13, భోపాల్లో రూ. 81.83, పాట్నాలో రూ. 81.73, శ్రీనగర్లో రూ. 80.35గా ఉన్నాయి. ఇక హైదరాబాద్లో మాత్రం లీటర్ పెట్రోల్ ధర రూ.80.76 కు చేరింది. గోవా రాజధాని పనాజీలో మాత్రం లీటర్ పెట్రోల్ ధర రూ. 70.26తో అతితక్కువగా ఉన్నది.
ఇక డీజిల్ విషయానికొస్తే..హైదరాబాద్లో ధరలు అధికంగా ఉన్నాయి. స్థానికంగా విధించే అధిక పన్నులతో ఇక్కడ లీటర్ డీజిల్ ధర రూ. 73.45గా ఉంది. ఇక దేశంలోని ప్రధాన నగరాలైన ముంబయిలో రూ.71.94, కోల్కతాలో రూ.70.12, చెన్నైలో రూ.71.32గా డీజిల్ ధరలు ఉన్నాయి. పోర్ట్ బ్లెయిర్లో డీజిల్ ధర అత్యల్పంగా రూ. 63.35 ఉండగా, కేరళ రాజధాని త్రివేండ్రంలో 73.34గా ఉంది. కర్నాటక ఎన్నికల కారణంగా 19 రోజుల విరామం అనంతరం ఆయిల్ కంపెనీలు రోజువారి ధరలను పెంచాయి. కాగా, ఇంధన ధరలు పెరగడం ఇది ఏడోరోజు. గతవారం లీటర్ పెట్రోల్ పై రూ. 1.61 పెరగగా, డీజిల్ పై రూ. 1.64 పెరిగింది.