Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- సీఎం సీటు రొటేషన్ లేదన్న జేడీఎస్ నేత
- 24 గంటల్లోపే బలం నిరూపించుకుంటామని వెల్లడి
- కాంగ్రెస్ నేత పరమేశ్వరకు డిప్యూటీ పదవి !
బెంగళూరు : కర్నాటక సీఎంగా జేడీ(ఎస్) శాసనసభా పక్ష నేత హెచ్డి కుమారస్వామి బుధవారం ప్రమాణం చేయనున్నారు. ప్రమాణస్వీకారం సోమవారమే చేయాలని తొలుత భావించినా.. దివంగత ప్రధాని రాజీవ్గాంధీ వర్ధంతి(మే 21) నేపథ్యంలో వాయిదా వేసినట్టు పార్టీ జనరల్ సెక్రెటరీ డానిష్ అలీ అన్నారు. కుమారస్వామికి ప్రాంతీయ పార్టీల నేతలు అభినందనలు తెలిపినట్టు ఆయన వివరించారు. ప్రమాణస్వీకార కార్యక్రమానికి హాజరు కావాలని కాంగ్రెస్ సీనియర్ నాయకురాలు సోనియాగాంధీ, పార్టీ జాతీయాధ్యక్షులు రాహుల్గాంధీలను ప్రత్యేకంగా ఆహ్వానించినట్టు తెలిపారు. దాంతోపాటు తెలుగు రాష్ట్రాల ముఖ్యమంత్రులు కె చంద్రశేఖరరావు, చంద్రబాబు, బెంగాల్ సీఎం మమతా బెనర్జీ.. ఇతర ప్రాంతీయ పార్టీల నేతలందరికీ ఆహ్వానం పంపామని చెప్పారు. కర్నాటక ముఖ్యమంత్రిగా గురువారం ప్రమాణస్వీకారం చేసిన యడ్యూరప్ప.. తనకు సరైన మెజార్టీ లేదంటూ శనివారం రాజీనామా చేసిన సంగతి తెలిసిందే. దీంతో కాంగ్రెస్, జేడీఎస్ కూటమిని
కుమారస్వామి ప్రభుత్వ ఏర్పాటుకు ఆహ్వానించడం గవర్నర్కు అనివార్యమైంది.
మరోవైపు.. ప్రభుత్వ ఏర్పాటుకు సంబంధించిన విధి విధానాలు, క్యాబినెట్ కూర్పు, తదితర అంశాలపై చర్చించేందుకు సోమవారం సోనియాగాంధీ, రాహుల్తో ఢిల్లీలో సమావేశం కానున్నట్టు కుమారస్వామి వెల్లడించారు. ఆదివారం ఆయన మీడియాతో మాట్లాడుతూ.. సీఎం పదవి నిర్ణీత కాలవ్యవధి ఆధారంగా ఇరు పార్టీలు పంచుకోనున్నాయని వస్తున్న ఊహాగానాలను ఆయన కొట్టిపారేశారు. సీఎం సీటు రొటేషన్ ఉండదని, ఐదేండ్లపాటు తానే ముఖ్యమంత్రిగా కొనసాగుతానని ఆశాభావం వ్యక్తం చేశారు. బల నిరూపణ కోసం గవర్నర్ వాజూభారు వాలా ఇచ్చిన 15 రోజుల గడువు తమకు అవసరమే లేదన్నారు. ముఖ్యమంత్రిగా ప్రమాణస్వీకారం చేసిన 24 గంటల్లోనే బలం నిరూపించుకుంటామని తెలిపారు. కాంగ్రెస్, జేడీఎస్ కూటమిలో 116 మంది సభ్యులున్న నేపథ్యంలో కుమారస్వామి బల పరీక్ష నెగ్గడం కష్టమైన పనేం కాదని తెలుస్తోంది.
క్యాబినెట్లో కాంగ్రెస్కు చోటు
ప్రభుత్వ ఏర్పాటు కోసం జేడీఎస్కు బయటి నుంచి మద్దతిస్తామని అసెంబ్లీ ఫలితాలు వెలువడుతుండగానే కాంగ్రెస్ ప్రకటించింది. కానీ, కుమారస్వామి ప్రభుత్వంలో కాంగ్రెస్ ఎమ్మెల్యేలకూ కీలక మంత్రి పదవులు దక్కే అవకాశమున్నట్టు తెలుస్తున్నది. ఆర్థిక శాఖను కుమారస్వామి దగ్గరే ఉంచుకుంటారని వార్తలొస్తుండగా.. కాంగ్రెస్ కర్నాటక చీఫ్ జి పరమేశ్వరకు డిప్యూటీ సీఎం పదవితో పాటు హోం మంత్రిత్వ శాఖను అప్పగించనున్నట్టు సమాచారం. అంతేకాక, విశ్వాస పరీక్షకు సంబంధించి ఎమ్మెల్యేలు జారిపోకుండా చూడటంలో కీలకంగా వ్యవహరించిన కాంగ్రెస్ ఎమ్మెల్యే డికె శివకుమార్ క్యాబినెట్లో కీలక పదవి ఆశిస్తున్నట్టు సమాచారం.
ఇచ్చిపుచ్చుకునే ధోరణిలోనే : ఖర్గే
కర్నాటకలో కొత్త ప్రభుత్వం పనితీరు ఇచ్చిపుచ్చుకునే ధోరణిలోనే ఉంటుందని కాంగ్రెస్ సీనియర్ నేత మల్లికార్జున్ ఖర్గే అన్నారు. క్యాబినెట్ కూర్పుపై పార్టీ హైకమాండ్ తుది నిర్ణయం తీసుకుంటుందని తెలిపారు. కాంగ్రెస్ జాతీయ పార్టీ అయినప్పటికీ రాజ్యాంగ విలువలు, ప్రజాస్వామ్య పరిరక్షణ కోసం జేడీఎస్కు మద్దతు తెలిపినట్టు ఆయన వివరించారు. ఎమ్మెల్యేల సంఖ్యాబలం ఆధారంగా రాష్ట్ర మంత్రివర్గంలో కాంగ్రెస్ నుంచి 20 మంది, జేడీఎస్ నుంచి 13 మందికి చోటు విశ్వసనీయ సమాచారం. అయితే.. సోనియా, రాహుల్తో కుమారస్వామి భేటీ తర్వాతే దీనికి సంబంధించి ఓ స్పష్టత వచ్చే అవకాశమున్నట్టు తెలుస్తోంది.