Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- కేసు నమోదు చేసిన పోలీసులు
పాట్నా : బీజేపీ నేత తనయులపై లైంగికదాడి యత్నం కేసు నమోదైంది. పాట్నాలోని గాంధీ మైదాన్ ప్రాంతంలోని మహిళా పోలీసు స్టేషన్లో ఈ నెల 19న బాధితురాలి ఇచ్చిన ఫిర్యాదు మేరకు బీహార్ ఎమ్మెల్సీ అవదేశ్ నారాయణ్ తనయులు సుశాంత్ రాజన్, ప్రశాంత్ రాజన్లపై కేసు నమోదుచేసినట్టు పోలీసులు తెలిపారు. అవదేశ్ నితీశ్ కుమార్ ప్రభుత్వంలో మంత్రిగా కూడా పనిచేశారు. అవదేశ్ నారాయణ్కు కేటాయించిన ప్రభుత్వ బంగ్లాలో తనను తీవ్రంగా కొట్టి, లైంగికదాడికి యత్నించినట్టు బాధితురాలు తన ఫిర్యాదులో పేర్కొందని పోలీసు అడిషనల్ సూపరింటెండెంట్ డి అమర్కేశ్ చెప్పారు. బంగ్లాలో ఉన్న సీసీటీవీ ఫుటేజ్ను సేకరించామనీ, వాటిని పరిశీలిస్తున్నామనీ తెలిపారు. బంగ్లావద్ద ఉన్న సిబ్బందిని కూడా ప్రశ్నిస్తున్నామన్నారు. ఒక ప్రయివేటు ఎయిర్ క్యారియర్లో పనిచేస్తున్న తనకు కొద్ది రోజుల క్రితం వారితో పరిచయమైందనీ, ఈ నెల 16న ప్రభుత్వ బంగ్లాకు తనను తీసుకెళ్ళి దారుణానికి ఒడిగట్టే ప్రయత్నం చేశారనీ ఆమె ఆరోపిస్తున్నది. ప్రాథమిక దర్యాప్తు తర్వాత అరెస్టు విషయమై నిర్ణయం తీసుకుంటామని అమర్కేశ్ తెలిపారు. కాగా, ఈ ఆరోపణలను ఎమ్మెల్యే కొట్టిపారేశారు.