Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- చైనా కమ్యూనిస్టు పార్టీ ప్రతినిధి బృందం
- ఉభయ దేశాల కమ్యూనిస్టు పార్టీల సమాచార మార్పిడి
న్యూఢిల్లీ : న్యూఢిల్లీలోని సీపీఐ(ఎం) ప్రధాన కార్యాలయమైన ఎ.కె. గోపాలన్ భవన్ను ఆదివారం చైనా కమ్యూనిస్టు పార్టీ (సీపీసీ) ప్రతినిధి బృందం సందర్శించింది. ఈ బృందంలో నలుగురు సభ్యులున్నారు. సీపీఐ(ఎం) ఆహ్వానం మేరకు సీపీసీ ప్రతినిధి బృందం నాలుగు రోజులపాటు భారత్లో పర్యటించేందుకు ఇక్కడకు చేరుకుంది. ఈ నెల 16 నుంచి 20 వరకు సీపీసీ బృందం భారత్లో పర్యటించింది. రెండు దేశాల కమ్యూనిస్టు పార్టీలు పరస్పరం సమాచారాన్ని మార్పిడి చేసుకోవడంలో భాగంగా సీపీసీ బృందం భారత్ పర్యటనకు వచ్చింది. ఈ సందర్భంగా పార్టీ కార్యాలయంలో జరిగిన చర్చలకు సీపీఐ(ఎం) తరపున పొలిట్ బ్యూరో సభ్యులు ఎం.ఎ. బేబి నేతృత్వం వహించారు. సీపీసీ ఫుజియన్ ప్రొవిన్షియల్ పార్టీ స్కూల్ వైస్ ప్రెసిడెంట్ జియు యుయిలీ చైనా బృందానికి నేతృత్వం వహించారు. దేశంలోని ప్రస్తుత రాజకీయ పరిస్థితులను, ఇటీవలే జరిగిన పార్టీ 22వ పార్టీ జాతీయ మహాసభల్లో తీసుకున్న నిర్ణయాలను సీపీసీ బృందానికి బేబి సంక్షిప్తంగా వివరించారు. జియు యుయిలీ కూడా సీపీసీ 19వ జాతీయ మహాసభల నిర్ణయాలను, చైనాలో పార్టీ పాఠశాలల నిర్మాణం, పనితీరులను బేబి నేతృత్వంలోని బృందానికి వివరించి చెప్పారు. భారత్ చేరుకున్న సీపీసీ బృందం తొలుత కోల్కతాలో పర్యటించింది. అనంతరం ఢిల్లీ చేరుకుంది. చైనా కమ్యూనిస్టు పార్టీ అంతర్జాతీయ విభాగానికి చెందిన ఝ కింగ్పింగ్, హు వంజున్, ఝాంగ్ షవోకిలు సీపీసీ ప్రతినిధి బృందంలో ఉన్నారు. సీపీఐ(ఎం) ప్రతినిధి బృందంలో బేబితో పాటు కేంద్ర కమిటీ సభ్యులు హరిసింగ్ కాంగ్, రాజేంద్ర శర్మ, మురళీధరన్ తదితరులున్నారు.