Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- మంత్రివర్గంలో ఇద్దరు డిప్యూటీ సీఎంలు
- ప్రమాణస్వీకార కార్యక్రమానికి సీతారాం ఏచూరి, మాయావతికి ఆహ్వానం
న్యూఢిల్లీ : జేడీఎస్ చీఫ్ కుమారస్వామి సోమవారం సాయంత్రం కాంగ్రెస్ అగ్రనేతలు రాహుల్ గాంధీ, సోనియా గాంధీలతో భేటీ అయ్యారు. సోనియా నివాసంలో జరిగిన ఈ సమావేశం సందర్భంగా బుధవారం జరిగే తన ప్రమాణ స్వీకారం కార్యక్రమానికి హాజరు కావాల్సిందిగా కుమారస్వామి వారిని ఆహ్వానించారు. కర్నాటక సీఎంగా పాలనా పగ్గాలు చేపడుతున్న క్రమంలో కుమారస్వామి కూటమి భాగస్వామ్య పార్టీ నేతలతో పలు అంశాలు ప్రస్తావించారు. క్యాబినెట్ కూర్పు, శాఖల కేటాయింపుపైనా సంప్రదింపులు జరిపినట్టు సమాచారం. ఢిల్లీ చేరుకున్న వెంటనే ప్రమాణ స్వీకార కార్యక్రమానికి హాజరు కావాలని కోరుతూ తొలుత బీఎస్పీ అధినేత్రి మాయావతి నివాసానికి స్వయంగా వెళ్లి ఆహ్వానించారు. సీపీఐ(ఎం) ప్రధాన కార్యదర్శి సీతారాం ఏచూరికి ఫోన్ చేసి బెంగళూర్లో జరిగే తన ప్రమాణ స్వీకార కార్యక్రమానికి హాజరు కావాలని కోరారు. కాగా, ప్రమాణస్వీకార కార్యక్రమానికి రాహుల్ గాంధీ, సోనియా గాంధీలు హాజరవుతారని కుమారస్వామి చెప్పారు.
ఇద్దరికి ఉపముఖ్యమంత్రి పదవులు
కర్నాటకలో కాంగ్రెస్-జేడీ(ఎస్) కూటమి ఏర్పాటు చేయబోయే ప్రభుత్వంలో ఇద్దరు ఉపముఖ్యమంత్రులు ఉండే అవకాశం ఉన్నట్టు విశ్వసనీయ వర్గాల సమాచారం. ఈ పదవులకు సంబంధించి కాం గ్రెస్ పీసీసీ ఛీఫ్ జి.పరమేశ్వర, డికె.శివకుమార్, ఎంబి పాటిల్ల పేర్లు ప్రముఖంగా వినబడుతున్నాయి. క్యాబినెట్ కూర్పు మంగళ వారం నాటికల్లా పూర్తవుతుందని తెలుస్తోంది. కాంగ్రెస్-జేడీ(ఎస్) సంకీర్ణ కూటమి నుంచి ముఖ్యమంత్రిగా కుమారస్వామి బుధవారం ప్రమాణస్వీకారం చేయనున్న విషయం తెలిసిందే. ఈ కూటమికి మొత్తం 117 మంది ఎమ్మెల్యేల మద్దతు ఉన్నది. అయితే, మిగతా సభ్యులు మాత్రం అసెంబ్లీలో విశ్వాస పరీక్ష జరిగిన తర్వాత అదే రోజు ప్రమాణస్వీకారం చేయనున్నారు. అధికారాన్ని కాంగ్రెస్, జేడీ(ఎస్)లు చెరో 30 నెలలు పంచుకోనుందని వచ్చిన వార్తలను కుమారస్వామి ఆదివారం తోసిపుచ్చారు. మరోపక్క, కాంగ్రెస్కు చెందిన చట్టసభ్యుడు శమనూరు శివశంకరప్పను కొత్తగా ఏర్పడబోయే ప్రభుత్వంలో హోంమంత్రిగా నియమించాలని డిమాండ్ చేస్తూ అఖిల భారత వీరశైవ మహాసభ కుమారస్వామికి లేఖ రాసింది. అదేవిధంగా తమ సామాజిక వర్గానికే చెందిన ఐదుగురికి మంత్రి పదవులు కేటాయించాలని కోరింది.
'కర్నాటక గవర్నర్ నిర్ణయాన్ని నిలిపేయాలి'
కర్నాటక గవర్నర్ నిర్ణయంపై మరోమారు సుప్రీంకోర్టులో పిటిష న్ దాఖలైంది. జేడీఎస్ చీఫ్ కుమారస్వామిని ప్రభుత్వ ఏర్పాటుకు ఆహ్వానిస్తూ కర్ణాటక గవర్నర్ వజుభారు వాలా తీసుకున్న నిర్ణయాన్ని వెంటనే నిలుపుదల చేయాలని అఖిల భారత హిందూ మహాసభ (ఏడీహెచ్ఎం) సుప్రీంకోర్టును అభ్యర్థించింది. ఎన్నికల ఫలితాల అనంతరం పార్టీలు పొత్తు పెట్టుకోవడం రాజ్యాంగ విరుద్ధమని, ఆ కోణంలో కుమారస్వామికి గవర్నర్ పిలుపు కూడా రాజ్యాంగ విరుద్ధమే అవుతుందని ఏడీహెచ్ఎం తన పిటిషన్లో పేర్కొంది. కాగా, ఈ పిటిషన్ను కోర్టు విచారణకు స్వీకరించేది, లేనిది తెలియాల్సి ఉంది.
ఓటమిని విజయంగా చిత్రీకరిస్తున్నారు : అమిత్ షా
కర్నాటక ప్రజలు కాంగ్రెస్కు వ్యతిరేకంగా తీర్పునిచ్చినా.. ఓటమిని ఆ పార్టీ విజయంగా చిత్రీకరిస్తున్నదని అమిత్ షా అన్నారు. కన్నడ ప్రజలు అయోమయ తీర్పు ఇవ్వలేదనీ, కాంగ్రెస్కు వ్యతిరేకంగా స్పష్టమైన తీర్పునిచ్చారని చెప్పారు. ఒకవేళ మేం ప్రభుత్వ ఏర్పాటుకు ముందుకు రాకుంటే అది ప్రజల తీర్పుకు వ్యతిరేకమవుతుంది. ప్రభుత్వ ఏర్పాటుకు మేం చేసిన ప్రయత్నాన్ని సమర్ధించుకుంటున్నామని అమిత్ తెలిపారు.