Authorization
Mon Jan 19, 2015 06:51 pm
న్యూఢిల్లీ: సామాజిక మాధ్యమాల్లో బెదిరింపులను ఎదుర్కొన్న జర్నలిస్ట్ రానా అయూబ్కు రక్షణ కల్పించాలని భారత అధికారులను యూఎన్ మానవ హక్కుల సంస్థ కోరింది. అయూబ్కు ప్రాణహాని ఉన్నదని తాము భావిస్తున్నట్టు యునైటెడ్ నేషన్స్ హ్యూమన్ రైట్స్ కమిషనర్ తన వెబ్సైట్లో పేర్కొంది. ప్రాణహాని తలపెడతామనే బెదిరింపులెదుర్కొన్నవారికి భద్రత కల్పించడం ప్రభుత్వ బాధ్యత అని వివరించింది. 'చిన్నారులపై లైంగికదాడికి పాల్పడినవారికి మరణ శిక్ష విధించేలా హిందూత్వ ప్రభుత్వం తీసుకొచ్చిన ఆర్డినెన్స్ ముస్లింలను ఉరితీయడానికే. ముస్లింలకు ఈ దేశం సురక్షితం కాదు' అనే ట్వీట్లను గతనెల 22న ఓ ట్విట్టర్ ఖాతాలో రానా అయూబ్ ట్వీట్ చేసినట్టు పోస్టు చేశారు. వాస్తవానికి ఆమె ఖాతాను హ్యాక్ చేసి వేరేవరో అలా పోస్టు చేశారు. దీని తర్వాత అయూబ్కు అనేక విద్వేషపూరిత సందేశాలు..చంపేస్తామని, సామూహిక లైంగికదాడి చేస్తామని ఫోన్ కాల్స్ వచ్చాయి. పాకిస్థాన్ వెళ్లిపోవాలని ఆన్లైన్లో బెదిరింపులకు పాల్పడ్డారు. భారత్ను, భారతీయులను ద్వేషిస్తానని తాను ట్వీట్ చేసినట్టు తప్పుగా ట్వీట్ చేశారని ది న్యూయార్క్ టైమ్స్కు అయూబ్ రాసిన వ్యాసంలో పేర్కొన్నారు. వేరే మహిళ దేహానికి తన ముఖాన్ని జోడించిన(మార్ఫింగ్ చేసిన) అశ్లీల వీడియోలను ఆన్లైన్లో వ్యాపితం చేశారని తెలిపారు. కాగా, అయూబ్పై బెదిరింపులను తాము పరిగణనలోకి తీసుకున్నామని...ఆమెపై పాల్పడిన బెదిరింపుల దృష్ట్యా అయూబ్ ప్రమాదంలో ఉన్నదని భావిస్తున్నామని యూఎన్ నిపుణులు తెలిపారు. దీన్ని సంబంధిత భారత అధికారుల దృష్టికి తీసుకొచ్చారు. కాగా, పోలీసులు ఈ బెదిరింపులపై దర్యాప్తు మొదలుపెట్టారు. కానీ, అయూబ్కు ఇంకా పోలీసు భద్రత కల్పించలేదు. దాదాపు 2వేల మంది చనిపోయిన గుజరాత్ అల్లర్లలో..ప్రధాని మోడీ, బీజేపీ అధ్యక్షుడు అమిత్ షాల పాత్రలను దర్యాప్తు చేస్తూ రానా అయూబ్ గుజరాత్ ఫైల్స్ అనే పుస్తకాన్ని రాసిన విషయం తెలిసిందే.