Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- మీడియా ఇష్టాగోష్టిలో సీతారాం ఏచూరి
కోల్కతా: ప్రతిపక్షాల మధ్య ఏ పొత్తు అయినా ఎన్నికల తర్వాతేనని సీపీఐ(ఎం) ప్రధాన కార్యదర్శి సీతారాం ఏచూరి చెప్పారు. గురువారం నాడిక్కడ మీడియా గోష్టిలో ఆయన మాట్లాడుతూ, గత అనుభవం కూడా ఇదేనన్నారు. బీజేపీకి వ్యతిరేకంగా జాతీయ స్థాయిలో కూటమి ఏర్పాటు గురించి జోరుగా చర్చ జరుగుతున్న నేపథ్యంలో ఏచూరి ఈ ప్రకటన చేశారు. ఎన్నికలకు ముందు జాతీయ స్థాయిలో ఇలాంటి కూటమి ఏర్పాటు సాధ్యం కాదన్నారు. 1996 లేదా 2004 అనుభవాన్ని చూసినా ఎన్నికల తర్వాతే పొత్తులు ఏర్పడ్డాయి తప్ప ముందు ఏర్పడలేదు. ఇప్పుడు కూడా లోక్సభ ఎన్నికల తర్వాతే ఏ పొత్తు అయినా ఏర్పడగలదు. భారత్ లాంటి ఎంతో వైవిధ్యం కలిగిన దేశంలో మూసపోసినట్టు ఒకే విధమైన వ్యవస్థ వుండదు. చాలా రాష్ట్రాల్లో ప్రాంతీయ పార్టీలు ప్రధాన పోటీదారులుగా వుంటాయని ఏచూరి వివరించారు. కర్నాటక అనుభవాన్ని ఏచూరి ఇక్కడ ప్రత్యేకంగా ప్రస్తావిస్తూ ఇది ప్రతిపక్షాలకు ఉత్సాహాన్నిస్తుందన్నారు. బీజేపీ ఇతర రాష్ట్రాల్లో రాజ్యాంగ నిబంధనలన్నింటినీ తుంగలో తొక్కి ఎన్నికల ప్రక్రియను హైజాక్ చేసినట్టు కర్నాటకలోనూ చేయాలని చూసిందన్నారు. కానీ, ఇక్కడ ఆ పప్పులుడకలేదని ఏచూరి వ్యాఖ్యానించారు. ఎన్నికల్లో బీజేపీ ఓడిపోయినా ప్రభుత్వాలను ఏర్పాటు చేసే కళలో కాషాయ పార్టీ నేత అమిత్షా దిట్ట అని ఏచూరి ఆరోపించారు.
పశ్చిమబెంగాల్లో తృణమూల్ ప్రభుత్వ క్రూర నిర్బంధకాండకు ప్రజల నుంచి ప్రతిఘటన పెరుగుతుండడం ఒక మంచి పరిణామమన్నారు.
బెంగాల్లో బీజేపీ, తృణమూల్ కాంగ్రెస్ రెండూ ప్రమాదకరమైనవి, ఒకే నాణేనికి వున్న రెండు పార్శ్వాల వంటివని ఏచూరి వ్యాఖ్యానించారు. బెంగాల్లో ఇటీవల జరిగిన పంచాయతీ ఎన్నికల్లో ప్రజాస్వామ్యం ఖూనీ అయిందన్నారు. బెంగాల్లో స్థానిక ఎన్నికలు జరిగినంత ఘోరంగా దేశంలో ఎక్కడా జరిగి ఉండవని, ఎన్నికల ప్రక్రియను తృణమూల్ ప్రభుత్వం పూర్తిగా తుంగలోకి తొక్కిందని ఏచూరి విమర్శించారు. ఎన్నికల ప్రక్రియలో ప్రతి దశలోనూ బీజేపీ, తృణమూల్ కాంగ్రెస్ అరాచకాలకు పాల్పడుతూ, మతోన్మాదాన్ని రెచ్చగొట్టడంలో ఒకదానికొకటి పోటీ పడుతూ, మతం పేరిట ప్రజల్లో చీలిక తెచ్చేందుకు యత్నించాయని, ప్రజాస్వామ్యాన్ని అథ్ణపాతాళానికి నెట్టాయని ఆయన విమర్శించారు.
తృణమూల్ కాంగ్రెస్తో తమ పార్టీ ఇప్పుడే కాదు, ఎప్పుడూ ఎలాంటి పొత్తు కుదుర్చుకునే ప్రసక్తే లేదని విలేకరులు అడిగిన ఒక ప్రశ్నకు సమాధానంగా ఏచూరి చెప్పారు. తృణమూల్ చర్యలు రాష్ట్రంలో బీజేపీ ఎదగడానికి తోడ్పడుతున్నాయని, అయితే మీడియా ముందు మాత్రం ఈ రెండు పార్టీల నేతలు బద్ధ శత్రువుల్లా ఫోజులు పెడుతుంటారని సీపీఐ(ఎం) నేత తెలిపారు.
ఇస్లామిక్ ఉగ్రవాదాన్ని ఒక పాఠ్యాంశంగా జేఎన్యూలో ప్రవేశపెట్టేందుకు మోడీ ప్రభుత్వం చేస్తున్న యత్నాల గురించి ప్రస్తావిస్తూ ఉన్నత విద్యను హిందూ పురాణఇతిహాసాల మయం చేస్తోందని ఏచూరి విమర్శించారు. ఆరెస్సెస్ ఫాసిస్టు ఎజెండాకు అనుగుణంగా ప్రభుత్వం విద్యా విధానాన్ని మార్చేస్తున్నదన్నారు. ఈ ప్రభుత్వాన్ని గద్దె దించాల్సిన సమయం ఆసన్నమైందన్నారు. బీజేపీని గద్దె దించి దేశాన్ని కాపాడాలి, తృణమూల్ను ఓడించి బెంగాల్ను కాపాడాలి అన్న నినాదాన్ని తాము ఇవ్వడంలో ఉద్దేశమిదేనన్నారు.
ఆశ్రిత పెట్టుబడిదారీ రాక్షసత్వానికి నిదర్శనం
ఆశ్రిత పెట్టుబడిదారీ వ్యవస్థ రాక్షసత్వానికి తూత్తుకుడి కాల్పుల ఉదంతం ఒక తిరుగులేని నిదర్శనమని సీపీఐ(ఎం) ప్రధాన కార్యదర్శి సీతారాం ఏచూరి చెప్పారు. విదేశీ దాతలు దేశంలోని పాలకపార్టీ ఖాతాలకు విరాళాల రూపంలో పెద్దమొత్తం లో సమకూర్చినందున, వారి ప్రయోజనాలను కాపాడేందుకే ప్రభుత్వం ప్రజలపైకి తుపాకులు ఎక్కుపెడుతుందని ఆయన అన్నారు. విదేశీ దాతల ప్రయోజనాల కోసం సొంత ప్రజలను హతమార్చడానికి కూడా వెనుకాడడం లేదన్నారు. స్టెరిలైట్ ప్రాజెక్టువల్ల తమిళనాడులో భూగర్భజలాలు కలుషితమవుతున్నాయని, నీటి వనరులు హరించుకుపోతున్నాయని, ఈ పరిస్థితుల్లో ఈ ప్రాజెక్టుకు వ్యతిరేకంగా ప్రజలు నిరసన తెలియజేస్తే వారిపై పోలీసులతో కాల్పులు జరిపించడం అత్యంత దుర్మార్గమైన చర్య అన్నారు. కాల్పులు జరపాల్సి వచ్చినప్పుడు పోలీసులు పాటించాల్సిన కనీస నియమాలను కూడా పాటించలేదన్నారు. నిరసనకారులను చెదరగొట్టేందుకు వారి ప్రాణాపాయం లేని రీతిలో తూటాలను ప్రయోగించవచ్చు. కానీ, తూత్తుకుడిలో పోలీసులు నిరసనకారుల వీపుపైన, గుండెలపైన, తలపైన కాల్పులు జరపడం పోలీస్ మాన్యువల్ కే విరుద్ధమని ఆయన విమర్శించారు. కాల్పులు జరిపారు. ఈ కాల్పులకు నిరసనగా దీక్ష చేసిన మా పార్టీ రాష్ట్ర కార్యదర్శిని అరెస్టు చేశారు. ఇటువంటి నిర్బంధకాండకు స్వస్తి చెప్పి తూత్తుకుడి స్టెరిలైట్ ప్రాజెక్టును వెంటనే మూసివేయాలని, ఏచూరి డిమాండ్ చేశారు.