Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- త్రిపురలో జరుగుతున్నదేమిటి?
- త్రిపురలో ప్రతిపక్ష పార్టీల ఆఫీసుల్ని కూలగొడ్తూ భయోత్పాతం సృష్టిస్తున్న సంకీర్ణ ప్రభుత్వం
- 13 రోజుల్లోనే 41 సీపీఐ(ఎం) ఆఫీసులు, 20 కాంగ్రెస్ ఆఫీసుల ధ్వంసం
త్రిపురలో బీజేపీ-ఐపీఎఫ్టీ సంకీర్ణ ప్రభుత్వం అధికారం చేపట్టిన తర్వాత వామపక్ష పార్టీల కార్యకర్తలపై పెద్దఎత్తున హింసాత్మక దాడులకు పాల్పడిన విషయం తెలిసిందే. ఇప్పుడు ఈ కూటమి లక్ష్యం ఆ రాష్ట్రంలో ప్రతిపక్షాల ఉనికినే లేకుండా చేయాలన్నట్టుగా ఉన్నదని ఈ నెలలో జరిగిన సంఘటనలను చూస్తే అర్థమవుతోంది. ప్రతిపక్ష పార్టీలు, కార్మిక సంఘాల కార్యాలయాల ధ్వంస రచనకు ఈ నెల 8న బీజేపీ నేతృత్వంలోని సంకీర్ణ ప్రభుత్వం శ్రీకారం చుట్టింది. ఈ నెల 20 వరకు పలు సబ్డివిజన్లలో సీపీఐ(ఎం)కు చెందిన 41 ఆఫీసులు, కాంగ్రెస్కు చెందిన 20 ఆఫీసులు, సీఐటీయూ, ఐఎన్టీయూసీలకు చెందిన 5 ఆఫీసుల్ని ఆ ప్రభుత్వం బుల్డోజర్లను ఉపయోగించి కూలగొట్టింది. కూల్చివేత బృందాలకు రక్షణగా పెద్ద సంఖ్యలో పారా మిలిటరీ దళాలను రప్పించింది. మే 20న ఒకే ఒక్కరోజున సీపీఐ(ఎం)కు చెందిన 16 ఆఫీసుల్ని బీజేపీ ప్రభుత్వం కూల్చివేసింది. వీటిలో సబ్రూమ్లోని సబ్డివిజన్ కమిటీ ఆఫీస్ కూడా ఉన్నది.
ప్రభుత్వ చర్యలను సవాల్ చేస్తూ అగర్తలలో ఐఎన్టీయూసీ కోర్టును ఆశ్రయించగా ఇంజెక్షన్ ఆర్డరిచ్చింది. అయినా, ఆ జిల్లా కలెక్టర్ కోర్టు ఆదేశాలను పక్కకు పెట్టి కూల్చివేతల్ని కొనసాగించారు. సబ్రూమ్లో సీపీఐ(ఎం) కోర్టును ఆశ్రయించగా, సమాధానమిచ్చేందుకు కొంత సమయం కావాలని ప్రభుత్వం కోరింది. ఓవైపు కేసు విచారణలో ఉండగా అక్కడి పార్టీ ఆఫీస్ను కూల్చివేయడం ద్వారా ప్రభుత్వం కోర్టు ధిక్కరణకు పాల్పడింది. మరోవైపు ప్రభుత్వ చర్యలకు నిరసన తెలపకుండా 144వ సెక్షన్ కింద నిషేధాజ్ఞలు విధించింది. రాజ్యాంగం హామీ ఇచ్చిన ప్రాథమిక హక్కుల్ని కాలరాస్తూ త్రిపురలోని బీజేపీ ప్రభుత్వం నియంతృత్వ పోకడలను అనుసరిస్తోంది.
త్రిపురలోని బీజేపీ సంకీర్ణ ప్రభుత్వం అక్కడి వామపక్ష పార్టీల కార్యకర్తలపై బెదిరింపులు, వేధింపులు, దాడులకు పాల్పడుతుండగా.. ప్రజలు అండగా నిలిచి ధైర్యాన్నిస్తున్న సంఘటనలూ ఉన్నాయి. ఈ నెల 16న రాత్రి వేళ ఎస్ఎఫ్ఐ కమల్పూర్ సబ్డివిజన్ కార్యదర్శి సులేమాన్ అలీ ఇంటిపై(మోహన్పూర్ గ్రామంలో) బీజేపీ గూండాలు దాడి చేసి ఆయన సోదరుడినీ, వొదిననూ గాయపరిచారు. దాంతో, స్థానిక మహిళలు తమ ఇండ్లలోంచి బయటకు వచ్చి కర్రలతో గూండాలను చితక బాదారు. నలుగురిని బంధించి పోలీసులకు అప్పగించారు. అయితే, పోలీసులు ముగ్గురిని ఆ తర్వాత విడుదల చేశారు. ఈ నెల 17న ఓ పాత కేసులో హాజరయ్యేందుకు సబ్డివిజన్ కోర్టుకు వెళ్లిన సులేమాన్ అలీపై దాడికి బీజేపీ గూండాలు యత్నించారు. విషయం తెలుసుకున్న మోహన్పూర్ మహిళలు కోర్టు వద్దకు చేరుకొని ఆయనకు రక్షణ కల్పించారు. అలీపై దాడి జరిగితే పోలీసులే బాధ్యత వహించాలని హెచ్చరించారు. కమల్పూర్-మలయా రహదారిని దిగ్బంధించారు. దాంతో, క్యాబినెట్ మంత్రి మనోజ్దేవ్సహా బీజేపీ స్థానిక నేతలు దిగిరాక తప్పలేదు. అలీకి రక్షణ కల్పిస్తామని మంత్రితోపాటు ఆ జిల్లా కలెక్టర్ హామీ ఇవ్వడంతో మహిళలు ఆందోళన విరమించారు. ఈ నెల 16 రాత్రి మరో సంఘటనలోనూ ప్రజల నుంచి అనూహ్య స్పందన వచ్చింది. విద్యుత్శాఖలో ఉద్యోగి,పార్టీ సానుభూతిపరుడైన నిర్మల్దాస్ ఇంటిపై బీజేపీ గూండాలు దాడికి యత్నించగా స్థానికులు ఎదరుతిరగడంతో కాలికి బుద్ది చెప్పారు. త్రిపురలో పెద్ద ఎత్తున వామపక్ష పార్టీల నేతలు, కార్యకర్తలపై బీజేపీ గూండాలు దాడులకు పాల్పడుతుండగా కొన్నిచోట్లనైనా ప్రజలు ధైర్యంగా ఎదురు తిరుగుతున్న సంఘటనలు రానున్న ప్రతిఘటనకు సంకేతంగా నిలుస్తున్నాయి.