Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- కాశ్మీర్ యువతలో పెరుగుతోన్న నిరాశా, నిస్ఫృహ
శ్రీనగర్: ఎప్పుడూ అశాంతి, అల్లర్లతో అట్టుడికే జమ్మూకాశ్మీర్ యువతనిపుడు నిరుద్యోగ సమస్య కూడా వెంటాడుతోంది. బోంబే స్టాక్ ఎక్చేంజ్తో కలిసి సెంటర్ ఫర్ మానిటరింగ్ ఇండియన్ ఎకానమీ (సీఎంఐఈ) నిర్వహించిన తాజా సర్వే ప్రకారం జమ్మూకాశ్మీర్లో నిరుద్యోగ సమస్య 12.13 శాతంగా తేలింది. ఆ రాష్ట్ర ప్రభుత్వం నిర్వహించిన ఎకనామిక్ సర్వే ప్రకారం నిరుద్యోగ సమస్య 24.6 శాతంగా నమోదైంది. వీరిలో 18 నుంచి 29 ఏండ్ల మధ్య వయస్కుల్లో 13.2 శాతం నిరుద్యోగులని సర్వే నివేదిక వెల్లడించింది.
జమ్మూకాశ్మీర్లో నెలకొన్న అశాంతి పరిస్థితులు కూడా నిరుద్యోగ సమస్య తీవ్రమవడానికి కారణమయ్యాయని పరిశీలకులు చెబుతున్నారు. నిరుద్యోగ సమస్య ప్రజల్లో నిరాశా, నిస్ఫృహ, మానసిక ఒత్తిడిలను పెంచుతోందని ఫ్రీ ప్రెస్ కాశ్మీర్ ఎడిటర్ ఖాజీ జైదీ అన్నారు. నిరుద్యోగ సమస్యతో నిమిత్తం లేకుండానే కాశ్మీర్లో సంఘర్షణ కొనసాగుతోందని ఆయన స్పష్టం చేశారు. పలు సమస్యల్లో నిరుద్యోగ సమస్య ఒకటని ఆయన తెలిపారు. నిరుద్యోగ సమస్యకు మూల కారణం సంఘర్షణ. అంతేతప్ప సంఘర్షణకు అది కారణం కాదని ఆయన అన్నారు. మరోవైపు ఉద్యోగాల నిమామకం కోసం ప్రభుత్వ రిక్రూట్మెంట్ బోర్డు అధిక మొత్తంలో నిరుద్యోగుల నుంచి ఫీజుల్ని వసూలు చేస్తోంది. ఉద్యోగార్థుల నుంచి ఎలాంటి ఫీజులూ వసూలు చేయొద్దని పీపుల్స్ డెమోక్రటిక్ పార్టీ ఎమ్మెల్సీ మహ్మద్ ఖుర్షీద్ ఆలం ప్రభుత్వానికి విజ్ఞప్తి చేశారు. 2014లో నిరుద్యోగుల నుంచి రూ.20 కోట్లమేర ఫీజుల రూపంలో బోర్డు వసూలు చేసింది.