Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- మద్దతు తెలిపిన 117మంది సభ్యులు
- ఓటింగ్కు ముందే వాకౌట్ చేసిన బీజేపీ ఎమ్మెల్యేలు
- స్పీకర్గా రమేశ్కుమార్ ఏకగ్రీవం
బెంగళూరు: కర్నాటకలో కాంగ్రెస్, జేడీ(ఎస్) సంకీర్ణ ప్రభుత్వం ఆ రాష్ట్ర అసెంబ్లీలో విశ్వాస పరీక్ష నెగ్గింది. కర్నాటక ముఖ్యమంత్రి, జేడీ(ఎస్) నేత హెచ్డి కుమారస్వామి శుక్రవారం ఆ రాష్ట్ర అసెంబ్లీలో ప్రవేశపెట్టిన విశ్వాస తీర్మానం మూజువాణి ఓటుతో నెగ్గింది. విశ్వాస పరీక్షకు కొన్ని నిమిషాల ముందే బీజేపీ ఎమ్మెల్యేలు, ఆ పార్టీ సీనియర్ నేత, మాజీ సీఎం యడ్యూరప్ప నేతృత్వంలో అసెంబ్లీ నుంచి వాకౌట్ చేశారు. 224మంది సభ్యులుండే కర్నాటక అసెంబ్లీలో(రెండు స్థానాలకు ఎన్నిక జరగాల్సి ఉన్నది) కుమారస్వామికి 117మంది సభ్యుల మద్దతు లభించింది. దాంతో, కాంగ్రెస్, జేడీఎస్ ప్రభుత్వం విశ్వాస పరీక్షలో విజయం సాధించినట్టు స్పీకర్ రమేశ్కుమార్ ప్రకటించారు.
కుమారస్వామి విశ్వాస పరీక్షకు ముందు ఆ రాష్ట్ర అసెంబ్లీ స్పీకర్గా కాంగ్రెస్ నేత రమేశ్కుమార్ ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. స్పీకర్ ఎన్నిక కోసం ఓటింగ్ జరగడానికి ముందే ఆ స్థానం కోసం పోటీపడ్డ బీజేపీ ఎమ్మెల్యే సురేశ్కుమార్ తన నామినేషన్ ఉపసంహరించుకున్నారు. దాంతో, రమేశ్కుమార్ ఏకగ్రీవంగా ఎన్నికైనట్టు ప్రొటెం స్పీకర్ బోపయ్య ప్రకటించారు. శుక్రవారం మధ్యాహ్నం ఆ రాష్ట్ర అసెంబ్లీ ప్రారంభం కాగానే మొదట స్పీకర్ ఎన్నిక చేపట్టారు. స్పీకర్ రమేశ్కుమార్కు బీజేపీ శాసనసభా పక్షం నేత యడ్యూరప్ప అభినందనలు తెలిపారు. స్పీకర్ స్థానానికున్న గౌరవాన్ని నిలబెట్టేందుకే తమ అభ్యర్థి నామినేషన్ ఉపసంహరించు కున్నట్టు ఆయన తెలిపారు.
కర్నాటక అసెంబ్లీకి ఈ నెల 12న ఎన్నికలు జరగగా, 15న ఓట్ల లెక్కింపు నిర్వహించారు. బీజేపీకి 104, కాంగ్రెస్కు 78, జేడీఎస్కు 37, బీఎస్పీకి 1, స్వతంత్రులకు 2 స్థానాలు లభించాయి. ఏ పార్టీకీ స్పష్టమైన మెజారిటీ రాలేదు. దాంతో, అత్యధిక స్థానాలు సాధించిన పార్టీగా తొలుత బీజేపీని ప్రభుత్వ ఏర్పాటుకు గవర్నర్ వాజూభారు వాలా ఆహ్వానించారు. ఈ నెల 17న ముఖ్యమంత్రిగా యడ్యూరప్ప ప్రమాణ స్వీకారం చేశారు. అయితే, అసెంబ్లీలో బలం నిరూపించుకోలేక యడ్యూరప్ప విశ్వాస పరీక్షకు ముందే తన పదవికి రాజీనామా చేశారు. మూడు రోజులకే బీజేపీ ప్రభుత్వం కూలిపోయింది. దాంతో, ప్రభుత్వ ఏర్పాటుకు కాంగ్రెస్-జేడీఎస్ కూటమి ముందుకు వచ్చింది. అందుకు అంగీకరించిన గవర్నర్ వాజూభారు బుధవారంనాడు(ఈ నెల 23న) కుమారస్వామి చేత సీఎంగా ప్రమాణ స్వీకారం చేయించారు.