Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- జేఎన్యూలో ప్రభాత్ పట్నాయక్ ఆఫీసు గదికి తాళాలు
- వామపక్ష ఆర్థిక విధానాలకు మద్దతు ఇస్తున్నారని అక్కసు
- ఆర్ఎస్ఎస్కు సన్నిహితుడైన వైస్ ఛాన్స్లర్ ఆదేశాలు
న్యూఢిల్లీ : దేశవ్యాప్తంగా వర్సిటీల్లో ఆర్థికశాస్త్రం చదివే విద్యార్థి లోకానికి పరిచయం అక్కర్లేని ప్రొఫెసర్లు ప్రభాత్ పట్నాయక్, ఆయన భార్య ఉత్స పట్నాయక్. కారల్ మార్క్స్ ఆర్థిక సిద్ధాంతాలపై అపారమైన కృషి, దానిని భారత్ వంటి పేద దేశాలకు అన్వయించిన తీరు ప్రభాత్ పట్నాయక్ దంపతులకు ఎనలేని గుర్తింపు తెచ్చిపెట్టింది. ప్రపంచస్థాయి గుర్తింపు అందుకున్న ఈ ఇద్దరు రిటైర్ట్ ప్రొఫెసర్లను జేఎన్యూ వర్సిటీ పాలనా విభాగం అవమానించింది. వర్సిటీ క్యాంపస్లో వీరిద్దరికీ కేటాయించిన ఆఫీసు గదికి పాలనాధికారి వచ్చి తాళాలు వేసి, మీరు ఇక్కడ పనిచేయడానికి వీల్లేదు అన్నట్టుగా వ్యవహరించారు. దీనిపై వర్సిటీ అధికారుల్ని ఉత్స పట్నాయక్ వివరణ కోరగా సరైన స్పందన రాలేదు.
దేశంలోనూ, అటు ప్రపంచవ్యాప్తంగా ప్రఖ్యాత ఆర్థికశాస్త్ర ప్రొఫెసర్లుగా గుర్తింపు అందుకున్న ప్రభాత్ పట్నాయక్ దంపతులు రిటైర్ట్ ప్రొఫెసర్లుగా జేఎన్యూలో గౌరవ హోదాలో కొనసాగుతున్నారు. క్యాంపసు భవనం మూడో అంతస్తులో వారికి ఒక ఆఫీసు గదిని కూడా కేటాయించారు. వర్సిటీ నుంచి ఎలాంటి జీతభత్యాన్ని, గౌరవ వేతనాన్ని ఆశించకుండా, ఎన్నో సంవత్సరాలుగా ఇక్కడి విద్యార్థులకు నిస్వార్థ సేవలు అందిస్తున్నారు. ఆర్ఎస్ఎస్తో సన్నిహిత సంబంధాలు కలిగివున్న వర్సిటీ వైస్ ఛాన్స్లర్ ఎం.జగదీష్ కుమార్ ఆదేశాల ప్రకారం, ప్రభాత్ పట్నాయక్ ఆఫీస్ గదికి తాళం వేసినట్టు సమాచారం. వామపక్ష ఆర్థిక విధానాలకు బలమైన మద్దతుదారులన్న అక్కసుతోనే వారిని లక్ష్యంగా చేసుకున్నారని తెలుస్తోంది.