Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- ఎం.ఫిల్, పీహెచ్డీ విద్యార్థుల అడ్మిషన్లపై యూజీసీ నిర్ణయం స్వాగతించిన విద్యార్థులు
న్యూఢిల్లీ: ఎం.ఫిల్, పీహెచ్డీ విద్యార్థుల అడ్మిషన్ల కొరకు మౌఖిక పరీక్షలకు 100 శాతం వెయిటేజ్ను రద్దుచేయాలని యూనివర్సిటీ గ్రాంట్స్ కమిషన్ నిర్ణయించింది. మౌఖిక పరీక్షకు 100 శాతం వెయిటేజ్ ఇస్తూ 2016లో తీసుకున్న నిబంధనలను సవరించింది. యూజీసీ తాజాగా తీసుకున్న నిర్ణయం మేరకు 70 శాతం రాతపరీక్ష, 30 శాతం మౌఖిక పరీక్షను పరిగణనలోకి తీసుకోనున్నారు. ఈ నిర్ణయాన్ని విద్యార్థులు, ఉపాధ్యాయులు స్వాగతిస్తున్నారు. ఎం.ఫిల్, పీహెచ్డీ విద్యార్థుల ఎంపికలో మౌఖిక పరీక్షకు 100 శాతం వెయిటేజ్ ఇస్తూ తీసుకున్న నిర్ణయంపట్ల గత రెండేండ్లుగా జేఎన్యూ సహా ఇతర విద్యార్థులు తీవ్ర ఆందోళనలు చేస్తున్నారు. ఈ ఉత్తర్వుల వల్ల గ్రామీణ ప్రాంతాల నుంచి వచ్చే విద్యార్థులు.. సరైన కమ్యూనికేషన్ స్కిల్స్ లేని కారణంగా పై చదువులకు వెళ్లలేక నష్టపోతారని విద్యార్థి సంఘాలు ఆందోళన వ్యక్తం చేశాయి. దీంతో పాత విధానాన్ని (70+30) అమలుచేయాలని యూజీసీ తాజాగా నిర్ణయం తీసుకుంది. అలాగే.. విద్యార్థులు ఎంట్రెన్స్ టెస్ట్లో అర్హత పొందడానికి అన్ని కేటగిరీల వారికి 50 శాతం మార్కులుగా ఉండే నిబంధనను కూడా యూజీసి సడలించింది. ఎస్సీ, ఎస్టీ, ఓబీసీ విద్యార్థులకు 45 శాతం మార్కులు పొందితే అర్హత సాధించే అవకాశాన్ని కల్పించింది. దీంతోపాటు విద్యార్థులకు గైడ్గా వ్యవహిరించే ప్రొఫెసర్.. ముగ్గురు ఎం.ఫిల్, ఎనిమిది మంది పీహెచ్డీ విద్యార్థులకరటే ఎక్కువమందికి గైడ్గా ఉండకూడదంటూ మార్గనిర్ధేశకాలు జారీ చేసింది. అసోసియేట్ ప్రొఫెసర్.. ఇద్దరు ఎం.ఫిల్, ఆరుగురు పీహెచ్డీ స్కాలర్లకు, అసిస్టెంట్ ప్రొఫెసర్ అయితే.. గరిష్టంగా ఒక్క ఎం.ఫిల్, నలుగురు పీహెచ్డీ విద్యార్థులకంటే ఎక్కువ మందికి గైడ్గా వ్యవహరించకూడదు.
ఆన్లైన్లో డిగ్రీ, పీజీ, డిప్లొమా కోర్సులు
విద్యాసంస్థలు ఇకనుంచి ఆన్లైన్లో డిగ్రీ, పీజీ, డిప్లొమా కోర్సులను అందించవచ్చు. ఈ మేరకు యూజీసీ తాజాగా ఉత్తర్వులు జారీ చేసింది. దీని ప్రకారం.. దేశంలోని విద్యార్థులే కాక విదేశీ విద్యార్థులు కూడా ఈ సంస్థల నుంచి ఆన్లైన్లో డిగ్రీలు పొందవచ్చు. కానీ, ఆ విద్యాసంస్థలు అందించే కోర్సులు సంబంధిత విద్యా సంస్థలో రెగ్యులర్ కోర్సులుగా ఉండాలి. యూజీసీ తాజా నిర్ణయంపట్ల జేఎన్యూ విద్యార్థి సంఘం హర్షం వ్యక్తం చేసింది.