Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- 'సుప్రీం' కేసులతో ఉక్కిరి బిక్కిరి
- ముంపుపై అధ్యయానానికి రంగం సిద్ధం
- పట్టు బిగిస్తున్న తెలంగాణ, ఒడిషా
నవతెలంగాణ ప్రత్యేక ప్రతినిధి
కేంద్రానికి పోలవరం వరద దెబ్బ తగులుతున్నది. ఎగువ ప్రాంతంలో ముంపుపై తాజా అధ్యయనానికి ఒడిషా, తెలంగాణ చేస్తున్న న్యాయపోరాటంతో అటు కేంద్రంతో పాటు ఏపీ ప్రభుత్వం కూడా ఉక్కిరి బిక్కిరి అవుతున్నది. పోలవరం ప్రాజెక్టు నిర్మాణంతో తమ రాష్ట్రంలోని ఆదివాసీ గ్రామాలు మునిగిపోతాయని అంచనా వేసిన ఒడిషా ప్రభుత్వం గత పదేండ్లుగా ఈ ప్రాజెక్టుకు వ్యతిరేకంగా న్యాయ పోరాటం చేస్తుండగా ఇటీవల తెలంగాణ కూడా ఇదే రకమైన వాదనతో ముందుకు రావటంతో కేంద్రం ఆయోమయంలో పడిపోయింది. ఈ ప్రాజెక్టుకు సంబంధించిన ముంపుతో పాటు, ఆదివాసీ, అటవీ హక్కుల చట్టం ఉల్లంఘన, పునరావాస. పర్యావరణ సమస్యలు వెంటాడుతూనే ఉన్నాయి. చట్టాల ఉల్లంఘనలపై ఇప్పటికే సుప్రీం కోర్టులో దాఖలైన ఏడు పిటిషన్లపై పూర్తిస్థాయి విచారణ జరపటానికి సుప్రీం కోర్టు ఇటీవల నిర్ణయించింది. ఒడిషా దాఖలు చేసిన రెండు పిటిషన్లతో పాటూ' రేలా' స్వచ్ఛంద సంస్థ దాఖలు చేసిన పిటిషన్లు కీలకం కానున్నాయి. దాదాపు రెండు లక్షల మంది ఆదివాసీలు ముంపునకు గురయ్యే ఈ ప్రాజెక్టుకు వ్యతిరేకంగా దాఖలైన పలు పిటిషన్లు 2007 నుంచి పెండింగ్లో ఉన్నాయి. ఇటీవల విచారణకు వచ్చిన మూడు పిటిషన్లతో పాటూ డాక్టర్ బ్రహ్మదేశ్ శర్మ, ప్రొఫెసర్ కోదండరామ్ , కల్వకుంట్ల కవిత, ఛత్తీస్గఢ్ ప్రభుత్వం దాఖలు చేసిన పిటిషన్లు త్వరలో విచారణకు వచ్చే అవకాశం ఉన్నది. ప్రధానంగా పోలవరం ప్రాజెక్టు నిర్మాణం వల్ల మూడు రాష్ట్రాల్లో ముంపు ప్రభావంపై అధ్యయనం జరగాలని ఆదివాసీలు డిమాండ్ చేస్తున్నారు. ఇటీవల ఒడిషా పిటిషన్ విచారణకు వచ్చిన సందర్భంగా సుప్రీం కోర్టు కూడా ఈ విషయంపై కేంద్రంతో పాటూ ఆంధ్రప్రదేశ్ అభిప్రాయాన్ని కోరింది. ముంపుపై పూణేలోని సెంట్రల్ పవర్ రీసెర్చ్ ఇనిస్టిట్యూట్తో అధ్యయనం చేయటానికి తమకు అభ్యంతరం లేదని కేంద్ర ప్రభుత్వం సుప్రీం కోర్టుకు ఇటీవల తెలిపింది. 36 లక్షల క్యూసెక్కుల వరద అంచనాతో మొదట ఈ ప్రాజెక్టును రూపకల్పన చేయగా ఇటీవల ప్రాజెక్టు డిజైన్ను 49 లక్షల క్యూసెక్కులకు పెంచటం తాజా వివాదానికి కారణమైంది. 1986లో రికార్డు స్థాయిలో గోదావరికి వరద వచ్చినప్పుడు 36 లక్షల క్యూసెక్కులుగా అంచనా వేశారు. డ్యాం లేనప్పుడే వరద ప్రభావం ఈ స్థాయిలో ఉంటే డ్యాం కట్టిన తర్వాత వరద ముంపు తమ భూభాగంలో ఎక్కువగా ఉంటుందని ఒడిషా, తెలంగాణ రాష్ట్రాలు ఇటీవల వాదించాయి. ప్రాజెక్టు నిర్మాణం తర్వాత వరద ప్రభావం తెలంగాణలో 100 కిలోమీటర్లు ఉంటుందని తెలంగాణ సుప్రీం కోర్టుకు తెలిపింది. భద్రాచలం పట్టణంతో పాటూ ఎగువ ప్రాంతంలోని ఏడు మండలాల్లో 100 గ్రామాలు మునిగిపోతాయని, సింగరేణి బొగ్గుగునులు, హెవీ వాటర్ ప్లాంట్, దుమ్ముగూడెం హెడ్ వర్క్స్ ప్రాంతం ముంపునకు గురవుతాయని వాదించింది. తెలంగాణ తరఫున సీనియర్ న్యాయవాది వైద్యనాథన్ సుప్రీంలో వాదనలు వినిపించారు. ముంపుపై తాజాగా అధ్యయనం చేయిస్తే గతంలో ఇచ్చిన అనుమతులన్నీ మళ్లీ సమీక్షించాల్సి ఉంటుందని అటు కేంద్రంతో పాటూ ఇటు ప్రభావిత రాష్ట్రాలు కూడా భావిస్తున్నాయి. దీనితో ఏపీ ప్రభుత్వ అధికారులు ఉరుకులూ పరుగులు పెడుతున్నారు. జాతీయ హోదా ప్రకటించిన పోలవరం ప్రాజెక్టు నిర్మాణ వ్యయాన్ని 16 వేల కోట్ల నుంచి ఇటీవల 43 వేల కోట్లకు పెంచారు. ముంపుపై అధ్యయనం జరిగితే ఈ వ్యయం మరింత పెరిగే అవకాశం ఉన్నది.
ఈ నేపధ్యంలో పర్యావరణ అనుమతుల కొనసాగింపు ఉత్తర్వుల మళ్లీ కేంద్రం ఇస్తుందో లేదో అనే సంశయాన్ని ఏపీ ప్రభుత్వ అధికారులు వ్యక్తం చేస్తున్నారు. వచ్చే జూన్ నెలతో గతంలో ఇచ్చిన కొనసాగింపు ఉత్తర్వుల కాలపరిమితి ముగుస్తుంది. తెలంగాణ, ఒడిషా రాష్ట్రాల్లో ముంపు ప్రాంతం పెరిగితే ఈ రెండు రాష్ట్రాల అభ్యంతరాలను అధింగమించటంతో పాటూ ప్రజాభిప్రాయ సేకరణ కూడా జరపాల్సి ఉంటుంది.