Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- చేసిన వాగ్దానాలకే దిక్కులేదు
- కొత్త హామీలతో రైతు ముందుకు మోడీ
నవతెలంగాణ - జనరల్డెస్క్
దేశవ్యాప్తంగా దాదాపు 600 జిల్లాల్లో కృషి విజ్ఞాన్ కేంద్రాల ద్వారా ఎంపిక చేసిన రైతు గ్రూపులతో ప్రధాని మోడీ ఈ నెల 20న ఢిల్లీ నుంచి వీడియో కాన్ఫరెన్స్ ద్వారా ప్రధాని మోడీ రైతులతో ముచ్చటించారు. ప్రధాని ప్రసంగం ఊహించిన విధంగానే ఉంది. రైతు ఆత్మహత్యలు - వ్యవసాయ రంగంలో సంక్షోభం, అన్నదాత ఆందోళనలపై ప్రధాని మోడీ ఒక్కమాట కూడా మాట్లాడలేదు సరికదా.. వ్యవసాయరంగానికి మరిన్ని వాగ్దానాలు గుప్పించేశారు. ఇందులో కొత్తేమిటంటే.. తన వివాదాస్పద నమో యాప్ ద్వారా రైతుల గురించి నోరువిప్పటం. వ్యవసాయ సంక్షోభం దేశాన్ని కుదిపేస్తుండగా, దేశవ్యాప్తంగా వివిధ రాష్ట్రాల్లో లక్షలాది మంది రైతులు ఆందోళనలు చేస్తున్న సమయంలో మోడీ రైతులనుద్దేశించి ఈ ప్రసంగం చేయడం గమనార్హం.
మోడీ మాట్లాడిందేమిటి?
2014 ఎన్నికల ప్రచారం సందర్భంగా రైతులకు బీజేపీ చేసిన వాగ్దానాల్లో ఏ ఒక్కటీ మోడీ నెరవేర్చకపోయినప్పటికీ.. ఈ నాలుగేండ్లలో వ్యవసాయరంగ పరిస్థితి మెరుగుపడిందన్నారు. మోడీ తాజా వాగ్దానాల్లో '2022 నాటికి రైతుల ఆదాయం రెట్టింపు' ఒకటి. ఇందుకోసం ప్రభుత్వం ప్రధానంగా నాలుగు అంశాలపై కృషిచేస్తున్నదనీ చెప్పారు. ఇన్పుట్ వ్యయాన్ని తగ్గించడం, పంటకు గిట్టుబాటు ధర కల్పించడం, పంట నష్టాలను తగ్గించేందుకు, రైతుల ఆదాయం పెరుగుదలకు ప్రత్యామ్నాయ మార్గాల కోసం చర్యలు తీసుకుంటున్నామన్నారు. రైతుల ఆదాయర రెట్టింపునకు ప్రస్తుత బడ్జెట్లో వ్యవసాయానికి బడ్జెట్ కేటాయింపులు పెంచామన్నారు. అయితే.. సంక్షోభంలో కూరుకుపోతున్న వ్యవసాయ రంగంపై బీజేపీ రాజీ వైఖరిని ఈ నాలుగేండ్ల పాలన బహిర్గతం చేసింది.
డబుల్.. ఢమాలేనా..?
2022 నాటికి రైతు ఆదాయం రెట్టింపు కావాలంటే.. దేశ వ్యవసాయ వార్షిక వృద్ధి రేటు దాదాపు 15 శాతానికి చేరుకోవాలని ఆర్థికవేత్తల అంచనా. దీనిని వివాదం చేస్తూ.. 'రెట్టింపు' లక్ష్యాన్ని చేరుకోవాలంటే 10.4 శాతం వృద్ధిరేటు సరిపోతుందని నిటి ఆయోగ్ ఆర్థికవేత్తలు పేర్కొన్నారు. 10.4 శాతం వాదనే నిజమైనప్పటికీ.. ప్రస్తుత మోడీ పాలనలో దేశ వృద్ధిరేటు ధోరణిని ఒకసారి పరిశీలిద్దాం. 2013-14లో 5.6శాతంగా ఉన్న వ్యవసాయ వృద్ధిరేటు.. మోడీ అధికారం చేపట్టిన తర్వాత అంటే 2014-15లో 0.2 శాతం తగ్గింది. 2015-16లో 0.7 శాతం పెరిగింది. 2017-18లో 2.1% పెరుగుతుందని ఆర్థికవేత్తల అంచనా. అటువంటి అస్థిర పెరుగుదల సమయంలో కూడా... రైతుల ఆదాయం మాత్రం తీవ్రంగా పడిపోతున్నది. ప్రభుత్వ విధానాలు వ్యవసాయ సంక్షోభాన్ని మరింత పెంచేందుకు దోహదపడ్డాయి.
మరోవైపు, వ్యవసాయ రంగంలో పనిచేస్తున్న దాదాపు 55 శాతం మంది వ్యవసాయ కార్మికుల వేతనాలు పూర్తిగా నిర్లక్ష్యం చేయబడ్డాయి. గత నాలుగేండ్లుగా గ్రామీణ వేతనాలు నిలకడగా ఉన్నాయని ఇటీవలి అధ్యయనాలు సూచిస్తున్నాయి. ఇటువంటి బలహీన వృద్ధిరేటు ఉన్నప్పటికీ.. 2018-19కిగాను వ్యవసాయరంగం కోసం కేటాయించిన బడ్జెట్ రూ. 2.1 లక్షల కోట్లు.. అంటే మొత్తం బడ్జెట్లో 2.36 శాతం మాత్రమే.
అన్ని పంటలకూ ఉత్పత్తి వ్యయంపై 1.5 రెట్లు కలిసి కనీస మద్దతు ధర (ఎంఎస్పీ)ను నిర్ణయించినట్టు ప్రధాని మోడీ చెప్పారు. అన్ని పంటలనూ అందులో చేర్చకపోవడం ఒక ఎత్తయితే.. ఉత్పత్తి వ్యయాన్ని లెక్కకట్టిన మోడీ సూత్రం నిపుణుల విమర్శలను ఎదుర్కొన్నది. సి2+50 శాతం సూత్రం ప్రకారం మద్దతుధరను నిర్ణయిస్తామని వాగ్దానం చేసిన ప్రధాని, అందుకు బదులుగా ఎ2+ఎఫ్ఎల్+50% సూత్రంతో మద్దతుధరను నిర్ణయించడాన్ని రైతు సంఘాలు తప్పుపడుతున్నాయి.
ఎ2+ఎఫ్ఎల్ ఫార్ములా పరిగణలోకి తీసుకుని... వాస్తవిక వ్యయం, పంట ఉత్పత్తిలో కుటుంబ కార్మికుల వాస్తవిక శ్రమను కలిసి మద్దతు ధర నిర్ణయించారు. కానీ వాస్తవిక ధరలో సి2 సూత్రం ప్రకారం.. మద్దతు ధరను నిర్ణయించడానికి ఇతర వ్యయాలతోపాటు... భూమికి చెల్లించే అద్దె, పెట్టుబడిపై వడ్డీని కూడా కలపాలని రైతు సంఘాలు డిమాండ్ చేస్తున్నాయి. ఇవి చేర్చకుండా.. మద్దతు ధర నిర్ణయించడంవల్ల తమకు ఒరిగిందేమీ లేదని విమర్శించాయి. మొత్తం రైతుల్లో 86 శాతానికిపైగా చిన్న, సన్నకారు రైతులకు ప్రభుత్వం నిర్ణయించిన మద్దతు ధరవల్ల ఏ మాత్రం లాభం చేకూరదని ఆ సంఘాలు ఆరోపిస్తున్నాయి.
ఆత్మహత్యల ప్రస్తావనేలేని ప్రసంగంఊహించిన విధంగానే వ్యవసాయ రంగ సంక్షోభం- రైతుల ఆత్మహత్యలు - దేశవ్యాప్తంగా అన్నదాత ఉద్యమాల గురించి ప్రధాని మోడీ ఒక్క మాట కూడా మాట్లాడలేదు. బీజేపీ అధికారంలోకి వచ్చిన మొదటి మూడేండ్లలో దాదాపు 36 వేల మంది రైతులు ఆత్మహత్యలు చేసుకున్నట్టు గణాంకాలు స్పష్టం చేస్తున్నాయి. బీజేపీ ప్రభుత్వ విధానాలు చిన్న, సన్నకారు రైతులు, వ్యవసాయ కార్మికులను నిర్లక్ష్యానికి గురిచేశాయి. నిరాశా, నిస్పృహలతో ఉన్న రైతులను తాజా వాగ్దానాల భ్రమలు శాంతిపచేస్తాయా?