Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- సెప్టెంబర్ 5న పార్లమెంట్ ముట్టడి
- రైతు, కార్మిక, వ్యవసాయ కార్మిక సంఘాల నిర్ణయం
- నాలుగు లక్షల మందితో ముట్టడికి సన్నాహాలు
- ఆగస్టు 9న దేశవ్యాప్తంగా జైల్భరో
- పది కోట్ల మంది రైతుల సంతకాల సేకరణ
నవతెలంగాణ-న్యూఢిల్లీబ్యూరో
కేంద్రంలోని నరేంద్రమోడీ సర్కారు అవలంబిస్తున్న ప్రజా, కార్మిక, రైతు వ్యతిరేక విధానాలకు నిరసనగా రైతు, కార్మిక సంఘాలు మరో చారిత్రక పోరుకు సన్నద్ధమవుతున్నాయి. గతేడాది నవంబర్ నెలలో కార్మిక, రైతు సంఘాలు వేర్వేరుగా ఢిల్లీలో భారీ ప్రదర్శన నిర్వహించిన విషయం తెలిసిందే. ఈ యేడాది సెప్టెంబర్ 5వ తేదీన ఢిల్లీలో మరింత హోరుగా సుమారు నాలుగు లక్షల మంది రైతుల, కార్మికులతో ఉమ్మడిగా పార్లమెంట్ ముట్టడి చేపట్టాలని నిర్ణయం తీసుకున్నాయి. ఈ మేరకు 15 డిమాండ్లతో సీఐటీయూ, అఖిలభారత రైతు సంఘం(ఏఐకేఎస్), అఖిలభారత వ్యవసాయ కార్మిక సంఘం(ఎఐఎడబ్ల్యుయూ) జాతీయస్థాయిలో ఒకే వేదికపైకి వచ్చాయి. పార్లమెంట్ ముట్టడి సన్నాహకంలో భాగంగా ఆగస్టు నెలలో దేశవ్యాప్తంగా నిరసన కార్యక్రమాలు నిర్వహించనున్నాయి. ఆగస్టు 9వ తేదీన జైల్భరో, 14వ తేదీన 'సామూహిక జాగరణ' చేపట్టి రైతులను, కార్మికులను చైతన్యపరచనున్నట్టు నేతలు తెలిపారు. అదేవిధంగా ప్రతి రైతు ఇంటికి వెళ్లి సంతకాల సేకరణ చేయనున్నట్టు చెప్పారు.
ఈ మేరకు గురువారం ఢిల్లీలోని సీఐటీయూ ప్రధాన కార్యాలయంలో సంయుక్తంగా ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఏఐకేఎస్ ప్రధాన కార్యదర్శి హన్నన్మొల్లా, సీఐటీయూ ప్రధాన కార్యదర్శి తపన్సేన్ వివరించారు. నరేంద్రమోడీ సర్కారు అధికారం చేపట్టిన తరువాత ప్రజల స్థితిగతులు రాజకీయంగా, ఆర్థికంగా, సామాజికంగా, సాంస్కృతికంగా మరింత దుర్భరంగా మారాయని హన్నన్మొల్లా ఆవేదన వ్యక్తం చేశారు. 'నాలుగు సంవత్సరాల మోడీ సర్కారు పాలనలో రైతులను, కార్మికులను వంచించారు. ప్రజల ప్రజాస్వామ్య హక్కులపై దాడులు చేస్తున్నారు. మతం, కులం పేరిట విద్వేషాలు రెచ్చగొడుతూ మైనార్టీలపై, ఆదివాసీలపై, మహిళలపై దాడులు జరుపుతున్నారు' అని విమర్శించారు. 'ప్రజా హక్కులపై పాలకవర్గం దాడి తీవ్రతరమైన నేపథ్యంలో ఐక్యపోరాటాలను బలోపేతం చేసేందుకు కార్మిక, రైతు, వ్యవసాయ కార్మిక సంఘాలుగా ఏకమయ్యాం' అని వివరించారు. మోడీ సర్కారు వైఫల్యాలపై గత కొన్ని సంవత్సరాలుగా వేర్వేరుగా తాము పోరాటం చేస్తున్నామని, అయితే 15 డిమాండ్ల సాధన లక్ష్యంగా ఇకపై ఉమ్మడి పోరు కొనసాగిస్తామని చెప్పారు. దేశవ్యాప్తంగా రైతుల్లో అశాంతి నెలకొందని తెలిపిన హన్నన్మొల్లా... రైతు సంఘం ఆధ్వర్యంలో ఆగస్టు 9వ తేదీలోగా పది కోట్ల సంతకాలు సేకరించి.. ఆ రోజు జిల్లా కలెక్టర్లకు అందజేస్తామని చెప్పారు. అదేరోజున జైల్భరో నిర్వహిస్తామని తెలిపారు. ఇక సెప్టెంబర్ 5వ తేదీన జాతీయస్థాయిలో ఢిల్లీలో సుమారు నాలుగు లక్షల మంది రైతులతో, కార్మికులతో పార్లమెంట్ ముట్టడి చేపడతామని చెప్పారు. మోడీ పాలనలో దేశంలో సంక్షోభం నెలకొందని కానీ ప్రధానమంత్రి, కేంద్రమంత్రులు ఇంకా ప్రజలకు భ్రమలు కల్పిస్తున్నారని సీఐటీయూ ప్రధాన కార్యదర్శి తపన్సేన్ విమర్శించారు. దేశ ఆర్థికపరిస్థితి చాలా క్లిష్టంగా ఉందని వివరించారు. పారిశ్రామిక వృద్ధి మందగించిందని, గత నాలుగేండ్లలో ఉపాధిలో వృద్ధి లేదని తెలిపారు. '2022 వరకు రైతుల ఆదాయం రెండింతలు చేస్తామని ప్రధానమంత్రి నమ్మబలుకుతున్నారు. కానీ వాస్తవం ఏమిటంటే ప్రభుత్వ లెక్కల ప్రకారం గత యేడాదిన్నరకాలంగా గ్రామీణ ఆదాయ స్థాయి రెండు శాతానికి పైగా క్షీణించింది' అని విమర్శించారు. అన్ని రంగాలను ప్రయివేటుపరం చేస్తున్నారని, చివరకు వ్యూహాత్మకరంగమైన రక్షణరంగంలోనూ విదేశీ పెట్టుబడులకు అవకాశం కల్పించారని వివరించారు. 'ప్రభుత్వరంగ సంస్థలను ఇతర రంగాలను ప్రయివేటుపరం చేస్తున్నారు. మోడీ ప్రభుత్వం సైతం కార్పొరేట్ల సేవకుడిగా పని చేస్తోంది' అని విమర్శించారు. మోడీ ప్రభుత్వ పాలనపై కార్మికుల్లో తీవ్రమైన అసంతృప్తి ఉందని, దేశవ్యాప్తంగా వివిధ రాష్ట్రాల్లో వివిధ రంగాల్లో కార్మికులు సమ్మెబాట పట్టేందుకు సిద్ధమవుతున్నారని తెలిపారు. కార్మికుల్లో వ్యక్తమవుతున్న అసంతృప్తికి జాతీయస్థాయిలో ఒక రూపం ఇచ్చేందుకు సెప్టెంబర్ 5న పోరుకు సన్నద్ధమవుతున్నట్టు తెలిపారు. అఖిలభారత రైతు సంఘం జాతీయ అధ్యక్షుడు అశోక్ధావలే మాట్లాడుతూ... కాంగ్రెస్ హయాంలో ప్రారంభించిన నయాసరళీకరణ ఆర్థిక విధానాలను మోడీ సర్కారు మరింత వేగంగా అమలు చేస్తోందని దుయ్యబట్టారు. 70 యేండ్ల స్వాతంత్య్ర భారతదేశంలో మోడీ సర్కారు వంటి కార్మిక, రైతు వ్యతిరేక ప్రభుత్వాన్ని చూడలేదని అన్నారు. ఈ విలేకరుల సమావేశంలో సీఐటీయూ అధ్యక్షురాలు హేమలత పాల్గొన్నారు.
గతేడాది నవంబర్లో కార్మికసంఘాలు 'మహాపడావ్' పేరిట మూడు రోజులు, అఖిలభారత రైతు పోరాట సమన్వయ కమిటీ ఆధ్వర్యంలో రైతులు రెండు రోజుల పాటు దేశరాజధాని ఢిల్లీలో లక్షలాదిగా తమ నిరసన వ్యక్తం చేసిన విషయం తెలిసిందే.
కార్మిక, రైతు సంఘాల డిమాండ్లు ఇవే
- నిత్యావసరాల ధరలు నియంత్రించాలి. ప్రజాపంపిణీ వ్యవస్థను సార్వత్రికం చేయాలి.
- ఉపాధి కల్పనకు నిర్ధిష్ట చర్యలు చేపట్టాలి.
- కార్మికులందరికీ కనీస వేతనం రూ.18 వేలు ఇవ్వాలి.
- కార్మిక చట్టాల సవరణ నిలుపుదల చేయాలి.
- స్వామినాథన్ సిఫార్సులకనుగుణంగా రైతులకు సరైన ధర కల్పించాలి.
- పేద రైతుల, వ్యవసాయ కార్మికుల రుణాలు మాఫీ చేయాలి.
- వ్యవసాయ కార్మికుల కోసం సమగ్రమైన చట్టం చేయాలి.
- అన్ని గ్రామీణ ప్రాంతాల్లో ఉపాధి హామీ చట్టం అమలు చేయాలి. పట్టణ ప్రాంతాల్లోనూ అమలు చేసేలా చట్ట సవరణ చేయాలి.
- ఆహార భద్రత, ఆరోగ్యం, విద్య, అందరికీ ఇండ్లు కల్పించాలి.
- సార్వత్రిక సామాజిక భద్రత కల్పించాలి.
- కాంట్రాక్టు విధానం నిలిపేయాలి.
- బలవంతపు భూసేకరణ ఆపాలి.
- సహజవిపత్తు బాధితులకు పరిహారం, పునరావాసం కల్పించాలి.
- నయాసరళీకరణ ఆర్థిక విధానాలు నిలిపేయాలి.
- భూసంస్కరణలు అమలు చేయాలి.