Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- రెండో జాబితా విడుదలతో మరో సంచలనం
- సునీల్ మిట్టల్ కుమారుడు కవిన్ మిట్టల్, అజరు బిజ్లీ,జలజ్ అశ్విన్ దన్ పేర్లు
- లీకైన 12 లక్షల పత్రాల్లో 12 వేలు భారతీయులవే..!!
న్యూఢిల్లీ: విదేశాల్లో డబ్బు దాచుకునే పన్ను ఎగవేతదారుల(నల్ల కుబేరుల) మరికొన్ని పేర్లు పనామా పత్రాల్లో వెల్లడయ్యాయి. పనామాకు చెందిన లా కంపెనీ మొస్సాక్ ఫోన్సెకాకు చెందిన 12 లక్షల కొత్త పత్రాలను ఇంటర్నేషనల్ కన్సార్టియం ఆఫ్ ఇన్వెస్టిగేటివ్ జర్నలిస్ట్స్ (ఐసీఐజే) బయటపెట్టింది. వాటిలో 12 వేల పత్రాలు భారతీయులవే కావడం గమనార్హం. ఈ కొత్త పత్రాల్లో 2016లో వెల్లడైన జాబితాకు తోడు మరికొన్ని కొత్త పేర్లు లీకయ్యాయి. వీరిలో టెలికాం దిగ్గజం భారతీ ఎయిర్టెల్ అధినేత సునీల్ మిట్టల్ కుమారుడు కవిన్ భారతీ మిట్టల్(హైక్ మెసెంజర్ సీఈవో), పీవీఆర్ సినిమాస్ అధినేత అజరు బిజ్లీ, ఆసియన్ పెయింట్స్ యజమాని అశ్విన్ దనీ కుమారుడు జలజ్ అశ్విన్ దనీ ఉన్నారు.
2016, ఏప్రిల్ 4న మొదటిసారి పనామా పత్రాలు లీక్ కాగా, అందులో 500మంది భారతీయుల పేర్లున్నాయి. వీటిపై విచారణ జరిపేందుకు కేంద్ర ప్రభుత్వం మల్టీ ఏజెన్సీ గ్రూప్(ఎంఏజీ)ని ఏర్పాటు చేసింది. ప్రత్యక్ష పన్నుల కేంద్ర బోర్డు (సీబీడీటీ) చైర్మన్ కన్వీనర్గా ఉండే ఎంఏజీలో ఆదాయం పన్ను అధికారులతోపాటు ఆర్బీఐ అధికారులు సభ్యులుగా ఉన్నారు. ఇప్పటివరకూ రూ.1140 కోట్ల నల్ల ధనాన్ని ఎంఏజీ గుర్తించినట్టు ఆర్థికశాఖ తెలిపింది. అయితే, డొల్ల కంపెనీల్లోని 75 శాతంమంది అసలు యజమానులను మొస్సాక్ ఫోన్సెకా కూడా గుర్తించలేని స్థితిలో ఉన్నట్టు ఐసీఐజే పరిశోధనలో వెల్లడైంది. పన్ను ఎగవేతదారులు బినామీ పేర్లతో విదేశాల్లో డొల్ల కంపెనీలు ఏర్పాటు చేయడం తెలిసిందే.