Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- కార్పొరేట్లకూ- అధికార పార్టీకి మధ్య క్విడ్ ప్రోకో..?
- బీజేపీ పాలిత రాష్ట్రాల్లో విరాళాల వరద
- తెలుగురాష్ట్రాలకు అనుమతి నిరాకరణ
వెయ్యికోట్ల విరాళాలకు పడగలెత్తిన బీజేపీ..హస్తినలో పీఠాన్ని నిలబెట్టుకోవటానికి ఏ చిన్న అవకాశాన్ని వదలుకోవటంలేదు. పన్నులు ఎగ్గొడుతున్న పెద్ద మనుషులకు ప్రభుత్వాలు పరోక్షంగా సహకరించేవిధంగా ఈ ఎన్నికల బాండ్లకు తెరలేపింది. కార్పొరేట్ యాజమానులు,అధికారపార్టీ నేతల మధ్య జరిగే అనైతిక లావాదేవీలకు కేరాఫ్ అడ్రస్సే ఈ క్విడ్ప్రోకో..
న్యూఢిల్లీ:ఎన్నికల బాండ్ల పథకాన్ని తమకు మాత్రమే లబ్ది చేకూరేలా కేంద్రంలోని అధికార బీజేపీ మార్చి వేసిందన్న అనుమానాలు వ్యక్తమవు తున్నాయి. బాండ్లు జారీ చేయడానికి అనుమతిచ్చిన 11 కేంద్రాల్లో ఏడు బీజేపీ పాలిత రాష్ట్రాల్లోనే ఉండటం పట్ల విమర్శలు వస్తున్నాయి. కార్పొరేట్ సంస్థల యజమానులు, అధికార పార్టీ నేతల మధ్య క్విడ్ ప్రోకో(నీకిది, నాకది)కి అవకాశమిచ్చినట్టేనని భావిస్తున్నారు. రాజకీయ పార్టీలకు విరాళాలు ఇవ్వడానికి వీలుగా ఈ ఏడాది జనవరి రెండున ఈ పథకాన్ని మోడీ ప్రభుత్వం ప్రకటించింది. ఈ ఏడాది ఫిబ్రవరిలో బడ్జెట్ ప్రవేశ పెట్టిన సందర్భగా ఎన్నికల బాండ్ల జారీకి విధి విధానాలను ఆర్థికమంత్రి వివరించారు.
మార్చి 1నుంచి 10 రోజులపాటు ఎన్నికల బాండ్లను జారీ చేయడానికి ఎస్బీఐకి చెందిన ముంబై, చెన్నై, కోల్కతా, న్యూఢిల్లీలోని ప్రధాన బ్రాంచ్లకు మొదటి దశలో అనుమతిచ్చారు. రూ.1000 నుంచి రూ.కోటి వరకూ ఎన్నికల బాండ్లను కొనుగోలు చేసి పార్టీలకు విరాళంగా ఇచ్చేందుకు వీలు కల్పించారు. విరాళాలు ఇచ్చిన వ్యక్తులు లేదా సంస్థల పేర్లను రహస్యంగా ఉంచడం ఈ పథకంలోని ఓ నిబంధన.
రెండోదశ ఎన్నికల బాండ్ల జారీకి ఏప్రిల్లో నోటిఫికేషన్ ఇచ్చారు. ఆ సందర్భంగా మరో ఏడు బ్రాంచ్లకు అనుమతి ఇవ్వగా, అందులో ఆరు బీజేపీ పాలిత రాష్ట్రాల్లోనివే కావడం గమనార్హం. ఆ ఏడింటిలో బెంగళూరుతోపాటు గాంధీనగర్, లక్నో, జైపూర్, చంఢగీఢ్, భోపాల్, గౌహతిలోని ఎస్బీఐ బ్రాంచీలున్నాయి.
కర్నాటక ఎన్నికలకు ముందు బెంగళూరులోని బ్రాంచికి అనుమతి ఇవ్వగా ఆ ఒక్క దశలోనే అక్కడ రూ.38 కోట్ల విలువైన ఎన్నికల బాండ్లు అమ్ముడుపోవడం గమనార్హం. అయితే, ప్రాంతీయ పార్టీలు అధికారంలో ఉన్న ఆంధ్రప్రదేశ్, తెలంగాణ, ఒడిషా, బీహార్లాంటి రాష్ట్రాల్లోని బ్రాంచీలకు ఎన్నికల బాండ్ల జారీకి ఎందుకు అనుమతివ్వలేదన్న విమర్శలొస్తున్నాయి. ఇందులో బీహార్లో బీజేపీ మిత్రపక్షమైన జేడీ(యూ) అధికారంలో ఉండటం గమనార్హం.
మే నెలలోనూ మూడో దశ బాండ్ల జారీకి అనుమతిచ్చారు. రెండు, మూడు దశల్లో బెంగళూరులోని బ్రాంచిలో రూ.51.8 కోట్ల విలువైన బాండ్లు జారీ కావడం గమనార్హం. ఆ సమయంలో కర్నాటకలో ఎన్నికలుండటం వల్ల విలువైన బాండ్లు అమ్ముడైనట్టు భావిస్తున్నారు. మూడు దశల్లో ముంబయిలోని ఎస్బీఐ బ్రాంచిలో అధిక మొత్తంలో రూ.213 కోట్ల విలువైన బాండ్లు అమ్ముడైనట్టు ఆర్టీఐ కింద సమాచారం ఇచ్చారు. ఆ తర్వాతి స్థానంలో ఢిల్లీ బ్రాంచ్లో రూ.73.6 కోట్లు, కోల్కతాలో రూ.70 కోట్లు, చెన్నైలో రూ.18 కోట్లు, గాంధీనగర్లో రూ.12 కోట్ల విలువైన బాండ్లను కొనుగోలు చేశారు. రెండోదశ నుంచి అనుమతి పొందిన బ్రాంచిల్లో బెంగళూరు, గాంధీనగర్ మినహా మిగతా ఐదు బ్రాంచ్ల్లో ఒక్క బాండు కూడా అమ్ముడు కాలేదు. ఈ ఐదు బీజేపీ పాలిత రాష్ట్రాల్లోనివే.
బీజేపీ పాలిత రాష్ట్రాల్లోని బ్రాంచ్లకే అనుమతి ఇవ్వడాన్ని కాంగ్రెస్ సమాచార ప్రతినిధి రణదీప్ సూర్జేవాలా తప్పు పట్టారు. విరాళాలు ఇచ్చే ప్రతి ఒక్కరి పేరూ వెల్లడించాలని ఆయన డిమాండ్ చేశారు. అమ్ముడైన బాండ్లు అన్నీ ఎక్కువ మొత్తంలోనివే కావడంతో కార్పొరేట్ కంపెనీల యజమానులే వాటిని కొనుగోలు చేసినట్టుగా అర్థమవుతోంది. 99.7 శాతం బాండ్లు రూ.10 లక్షలు, రూ.కోటి విలువైనవి కావడం గమనార్హం. రూ.కోటి విలువైన బాండ్ల మొత్తం రూ.384 కోట్లు అంటే 87.6 శాతం. రూ.10 లక్షల విలువైనవి రూ.53.9 కోట్లు. అంటే 12.3 శాతం. కార్పొరేట్ సంస్థల యజమానులు ఈ బాండ్లను అధికార పార్టీలకు ఇవ్వడం ద్వారా క్విడ్ ప్రోకో(నీకిది..నా కది)కు పాల్పడ్తారని పరిశీలకులు విమర్శిస్తున్నారు. అవినీతికి తాము వ్యతిరేకమని గొప్పగా చెప్పుకునే మోడీ నేతృత్వంలోని బీజేపీ ప్రభుత్వం ఎన్నికల బాండ్ల విషయంలో రహస్య పద్ధతిని ఎందుకు ప్రవేశపెట్టిందన్న ప్రశ్నలు వస్తున్నాయి. రహస్యమని చెబుతున్నప్పటికీ ఎవరు ఎవరికి ఎంత విరాళమిచ్చారనేది అధికార పార్టీకి తెలిసే అవకాశముందని కూడా అనుమానిస్తున్నారు. అవినీతిలేని పారదర్శక పాలన అందిస్తామని చెబుతున్న ప్రధాని మోడీ ఎన్నికల నిధులు ఎవరు ఎవరికి ఇస్తున్నారనేది పౌరులకు తెలియకుండా దాచడంపై ఏం సమాధానమిస్తారో చూడాలి.