Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- పెద్ద నోట్లు రద్దు తర్వాత గూడుపుఠాణి
- గుజరాత్లోని జిల్లా సహకార బ్యాంకుల్లో రూ.3118 కోట్లు జమ
- బీజేపీ అనుకూల రాష్ట్రాల్లోనూ అధిక మొత్తంలో..
- నల్ల ధనం మార్పిడి, ఇదో భారీ కుంభకోణం : కాంగ్రెస్
- క్యూలైన్లలో 100మందికిపైగా పేదలు చనిపోయారు, అమిత్షా బ్యాంక్లో మాత్రం పెద్ద మొత్తంలో మార్పిడి : సీతారాం ఏచూరి
న్యూఢిల్లీ: పెద్ద నోట్ల రద్దు వెనుక భారీ కుంభకోణమున్నదని కాంగ్రెస్ ఆరోపించింది. బీజేపీ పాలిత గుజరాత్ రాష్ట్రంలోని జిల్లా సహకార బ్యాంకుల్లో ఐదు రోజుల్లోనే రూ.3,118.51 కోట్ల విలువైన రద్దయిన పెద్ద నోట్లు జమ కావడమే అందుకు అధికారిక సాక్ష్యమని కాంగ్రెస్ ప్రతినిధి రణదీప్ సూర్జేవాలా అన్నారు. నల్ల ధనాన్ని తెలుపుగా మార్చడానికే పెద్ద నోట్ల రద్దు నిర్ణయమని ఆయన విమర్శించారు. స్వాతంత్య్రానంతరం జరిగిన భారీ కుంభకోణం ఇదేనని సూర్జేవాలా అన్నారు. ముంబయికి చెందిన సమాచార హక్కు కార్యకర్త మనోరంజన్ ఎస్.రారు దరఖాస్తుకు సమాధానంగా దేశంలోని సహకార బ్యాంకుల్లో జమైన పెద్ద నోట్ల వివరాలను నాబార్డ్ సమకూర్చింది. వీటిని ఇండో-ఆసియన్ న్యూస్ సర్వీస్(ఐఏఎన్ఎస్) వెల్లడించింది. వాటినే కాంగ్రెస్ ఉటంకించింది.
ఈ వివరాల ప్రకారం రద్దయిన నోట్లను జమ చేసుకోవడంలో బీజేపీ అధ్యక్షుడు అమిత్షా డైరెక్టర్గా ఉన్న అహ్మదాబాద్ జిల్లా సహకార బ్యాంకు(ఏడీసీబీ) రికార్డు సాధించింది. ఐదు రోజుల్లోనే ఈ బ్యాంకులో రూ.745.59 కోట్ల విలువైన రద్దయిన పెద్ద నోట్లు జమ కావడం గమనార్హం. ఈ బ్యాంకుకు 2000 సంవత్సరంలో అమిత్ షా చైర్మన్గా వ్యవహరించారు. ప్రస్తుతం ఈ బ్యాంకు డైరెక్టర్గా అమిత్ షా కొనసాగుతున్నట్టు ఏడీసీబీ వెబ్సైట్లో ఉన్నది. ఏడీసీబీ తర్వాతి స్థానంలో రాజ్కోట్ జిల్లా సహకార బ్యాంకు నిలిచింది. ఈ బ్యాంకులో రూ.693 కోట్ల విలువైన పెద్ద నోట్లు జమయ్యాయి. దీని చైర్మన్ జయేశ్భారు విఠల్భారు రాడాడియా. ఈయన గుజరాత్లోని బీజేపీ ప్రభుత్వంలో క్యాబినెట్ మంత్రి. నల్ల ధనాన్ని చలామణీలోకి తెస్తున్నారన్న అనుమానంతో నవంబర్ 14 తర్వాత సహకార బ్యాంకుల్లో పెద్ద నోట్ల జమను నిలిపివేశారు. అంటే..సహకార బ్యాంకుల్లో పెద్ద నోట్లు జమైంది నవంంబర్ 10 నుంచి 14 వరకు మాత్రమేనన్నది గమనార్హం. ఈ ఐదు రోజుల్లోనే గుజరాత్లోని జిల్లా సహకార బ్యాంకుల్లో పెద్ద మొత్తంలో రూ.500, రూ.1000 రద్దయిన నోట్లు జమ కావడం అనుమానాలకు తావిస్తోంది. జమైన రద్దయిన నోట్లకు సమానమైన విలువతో కొత్త నోట్లను పొందేందుకు ఆర్బీఐ వీలు కల్పించిన విషయం తెలిసిందే. బీజేపీ, దాని భాగస్వామ్య పక్షాలు(ఎన్డీఏ కూటమి), అనుకూల పార్టీలు అధికారంలో ఉన్న 18 రాష్ట్రాల్లోని(ఏపీ, తెలంగాణ సహా) జిల్లా సహకార బ్యాంకుల్లో రూ.14,293.71 కోట్ల విలువైన నోట్ల మార్పిడి జరిగిందని, ఇది దేశంలోని జిల్లా సహకార బ్యాంకుల్లో జమైన మొత్తం రూ.22,270 కోట్లలో 64.18 శాతమని ఆర్టీఐ కార్యకర్త ఇచ్చిన గణాంకాలను కాంగ్రెస్ ఉటంకించింది. కాంగ్రెస్ పార్టీ విడుదల చేసిన ప్రకటనకు ఈ గణాంకాలను చేర్చింది. బీజేపీయేతర పార్టీలు అధికారంలో ఉన్న రాష్ట్రాల్లోని జిల్లా సహకార బ్యాంకుల్లో రూ.7977 కోట్ల విలువైన రద్దయిన నోట్లు జమయ్యాయి.
ఈ వివరాలపై స్పందించిన కాంగ్రెస్ అధ్యక్షుడు రాహుల్ గాంధీ.. మీరు డైరెక్టర్గా ఉన్న బ్యాంకులో పెద్ద మొత్తంలో నోట్ల మార్పిడి జరిగి మొదటి ర్యాంక్ సాధించినందుకు శుభాకాంక్షలంటూ అమిత్షానుద్దేశిస్తూ ట్వీట్ చేశారు.
బీజేపీ ఎంపిక చేసిన ఆశ్రిత పెట్టుబడిదారులకు లబ్ది చేకూర్చేందుకే నోట్ల రద్దు జరిగిందని కాంగ్రెస్ విమర్శించింది. దీనిపై సీపీఐ(ఎం) ప్రధాన కార్యదర్శి సీతారాం ఏచూరి కూడా ట్విట్టర్ ద్వారా స్పందించారు. 'రద్దయిన నోట్లను మార్చుకోవడంలో పేదలు విఫలమయ్యారు. ఎంతో కష్టపడి సంపాదించిన డబ్బును మార్చుకునేందుకు క్యూలైన్లలో నిలబడి 100మందికి పైగా చనిపోయారు. అమిత్షా బ్యాంకులో మాత్రం అత్యధిక నోట్లను మార్చుకోగలిగారు. అందరికీ న్యాయం అంటే ఇదేనా..?' అని ఏచూరి ప్రశ్నించారు.