Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- హస్తినలో కేరళ సీఎం ధర్నా
- రాష్ట్రంలో రైల్కోచ్ ఫ్యాక్టరీ ఏర్పాటుపై కేంద్రం యూటర్న్
- రైల్వే భవన్ ఎదుట ఎంపీలతో పినరయి నిరసన
- యూపీ హర్యానాల్లో కోచ్ఫ్యాక్టరీలకు కేంద్రం సంసిద్ధత
- వామపక్ష ప్రభుత్వంపై కేంద్రం అక్కసు : పినరయి విజయన్
నవతెలంగాణ-న్యూఢిల్లీబ్యూరో
కేరళలోని పాలక్కడ్లో రైల్కోచ్ ఫ్యాక్టరీ ఏర్పాటుపై కేంద్రం యూటర్న్ తీసుకోవడాన్ని నిరసిస్తూ ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి పినరయి విజయన్, రాష్ట్ర ఎంపీలు శుక్రవారం ఢిల్లీలోని రైల్భవన్ ఎదుట ఆందోళన చేపట్టారు. ఈ సందర్భంగా ముఖ్యమంత్రి పినరయి మాట్లాడుతూ.. కేరళలో వామపక్ష ప్రజాతంత్ర కూటమి(ఎల్డీఎఫ్) ప్రభుత్వం అధికారంలో ఉందనే అక్కసుతో కేంద్ర ప్రభుత్వం తమ రాష్ట్ర ప్రజలను శిక్షిస్తోందని విమర్శించారు. 'ప్రస్తుతం కేరళలో వినియోగిస్తున్న కోచ్ల కాలం చెల్లిపోయింది. కానీ కేంద్ర ప్రభుత్వం మాత్రం రాష్ట్రంలో కోచ్ ఫ్యాక్టరీ అవసరం లేదని నిర్ణయించింది. అదేసమయంలో హర్యానాలో నూతన ఫ్యాక్టరీ ఏర్పాటు చేయాలని నిర్ణయం తీసుకున్నది' అని సీఎం తప్పుపట్టారు. రైల్వేమంత్రి పియూష్గోయల్ ఇటీవల మాట్లాడుతూ.. రైల్కోచ్ ఫ్యాక్టరీ ఏర్పాటు చేసేందుకు ఉత్తరప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వాన్ని కూడా స్థలం కోరినట్టు ప్రకటించారని గుర్తు చేశారు. 'హర్యానా, ఉత్తరప్రదేశ్లో కొత్తగా కోచ్ఫ్యాక్టరీలు ప్రారంభించ వచ్చు కానీ కేరళలో చేయడం లేదు. దీని వెనకున్న ఏకైక కారణం ఏమిటంటే కేరళలో ఎల్డీఎఫ్ ప్రభుత్వం అధికారంలో ఉండగా.. మిగతా రెండు రాష్ట్రాల్లో బీజేపీ పాలనసాగుతోంది' అని వివరించారు. 'ఈ విధంగానేనా ఓ ప్రజాస్వామ్య దేశం పని చేయాల్సింది?' అని విజయన్ ప్రశ్నించారు. 'ఇది కేరళ రాష్ట్ర ప్రజలను
శిక్షించడం కాదా? దేశంలోని సమాఖ్య వ్యవస్థకు నిదర్శనమా? దీన్నిబట్టి కేంద్ర ప్రభుత్వం ప్రజాస్వామ్య పద్ధతులను ఆమోదించడం లేదని తేలుతుంది' అని అన్నారు. కేంద్రం రాష్ట్రాలతో ఏ విధంగా వ్యవహరిస్తోందో ఈ అంశం స్పష్టం చేస్తోందని పినరయి విజయన్ అన్నారు. 'ఒక ప్రాంతాన్ని కేంద్రం ఏ విధంగా హింసిస్తోందో, కేరళను తన శత్రువుగా ఎలా భావిస్తోందో, బీజేపీ, ఆ పార్టీ నాయకత్వం కేరళపై శత్రుత్వం ఎలా ప్రదర్శిస్తోందో ఈ అంశంతో తెలుస్తోందని అన్నారు. 'కేంద్రం తీరు ఒక్క పాలక్కడ్ లేదా కేరళకు పరిమితం కాదు. ఇది ఓ జాతీయ అంశం' అని చెప్పారు. ఈ విషయంలో ప్రధానమంత్రి నరేంద్రమోడీ, రైల్వేమంత్రి పియూష్గోయల్ జోక్యం చేసుకోవాలని పినరయి విజయన్ స్పష్టం చేశారు. 'పాలక్కడ్లో రైల్వేకోచ్ ఫ్యాక్టరీ ఏర్పాటు చేస్తామని 1982లో అప్పటి ప్రధానమంత్రి ఇందిరాగాంధీ వాగ్ధానం చేశారు. గత 36 యేండ్లుగా ఇచ్చిన హామీని అమలు చేయకపోవడంతో నేడు ఇక్కడికి వచ్చాం' అని అన్నారు. ఈ ధర్నాలో ఎంపీలు ఎండీ సలీం, ఎంబీ రాజేష్, ఆర్కే శ్రీమతి, ఎలమరమ్ కరీం తదితరులు పాల్గొన్నారు.
కేరళలో గత కొన్ని సంవత్సరాలుగా రైల్ కోఛ్ ఫ్యాక్టరీ ఏర్పాటు డిమాండ్ ఉంది. అయితే ఇటీవల పియూష్గోయల్ మాట్లాడుతూ.. కేరళలో రూ.550 కోట్ల రైల్కోఛ్ ఫ్యాక్టరీని తక్షణమే ప్రారంభించే ప్రణాళికలు ఏమీ లేదని ప్రకటించారు. పైగా కోచ్ అవసరాలు తీర్చేందుకు ప్రస్తుతం అవసరమైన సదుపాయాలున్నాయని, వీటితో భవిష్యత్తు అవసరాలు కూడా తీరుతాయని చెప్పారు.