Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- కాశ్మీర్ జర్నలిస్టులకు బీజేపీ మాజీ మంత్రి బెదిరింపులు
శ్రీనగర్: బీజేపీ నేత, మాజీ మంత్రి చౌదరి లాల్ సింగ్ కాశ్మీర్ జర్నలిస్టులపై బహిరంగంగా బెదిరింపులకు పాల్పడ్డారు. జర్నలిస్టులు తమ పద్ధతులు మార్చుకోవాలని, లేదంటే తీవ్ర పరిణామాలను ఎదుర్కోవాల్సి ఉంటుందని ఇటీవల హత్యగావించబడ్డ షుజాత్ బుకారిని ఉదహరిస్తూ హెచ్చరించారు. దీనికి సంబంధించిన వీడియో సామాజిక మాధ్యమాల్లో వైరల్ అయింది. కతువా ఘటన నిందితులను సమర్థిస్తూ ర్యాలీలో పాల్గొన్న అప్పటి పీడీపీ-బీజేపీ సంకీర్ణ ప్రభుత్వంలో అటవీ శాఖ మంత్రిగా ఉన్న చౌదరి లాల్ సింగ్ జమ్మూకాశ్మీర్లో శుక్రవారం జరిగిన ఓ విలేకరుల సమావేశంలో మాట్లాడారు. కతువా ఘటనపై ఈ కాశ్మీర్ విలేకరులు తప్పుగా రిపోర్టు చేశారని అభిప్రాయపడ్డారు. మీరు చేసే జర్నలిజంపై, మీరు ఎలా బతకాలనుకుంటున్నారో అనే విషయంపై స్పష్టతను కలిగి ఉండాలని కాశ్మీరీ విలేకరులకు ఆయన సూచించారు. రిపోర్టింగ్ చేసేటప్పుడు మిమ్మల్ని మీరు నియంత్రించుకోండని అన్నారు. అలా కాకుండా షుజాత్ బుకారిలానే మీరూ రిపోర్టింగ్ చేయాలనుకుంటారో నిర్ణయించుకోండని హెచ్చరించారు. తన వ్యాఖ్యలను సమర్థించుకుంటూ తర్వాతి రోజూ సింగ్ ఓ ట్వీట్ చేయడం గమనార్హం. కాశ్మీరి జర్నలిస్టులను బెదిరించేందుకు షుజాత్ బుకారి హత్య.. గూండాలకు ఓ సాధనంగా మారినట్టున్నదని నేషనల్ కాన్ఫరెన్స్ నేత ఒమర్ అబ్దుల్లా ట్విట్టర్లో పోస్టు చేశారు.